LIVE అర్థరాత్రి దాటినా ఆగని చర్చ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్న స్పీకర్!
x
లోక్ సభలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోదీ

అర్థరాత్రి దాటినా ఆగని చర్చ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్న స్పీకర్!

దక్షిణాదికి అన్యాయమేనన్న నేతలు, అమిత్ షాపై ఒవైసీ నిప్పులు, రాష్ట్ర విభజనపై మంటలు, ఆవలింతలు, కళ్ల మూతలతో ఎంపీల ఆపసోపాలు..


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు తొలిరోజే వాదోపవాదాలతో దద్దరిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్), నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు-2026 సభ ముందుకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును, డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును హోం మంత్రి అమిత్ షా టేబుల్ చేశారు.
ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.
రూల్ 66 సస్పెన్షన్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఏకకాలంలో ఆమోదించేందుకు వీలుగా 'రూల్ 66'ను సస్పెండ్ చేయాలని న్యాయశాఖ మంత్రి ప్రతిపాదించారు.
సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఇది వివక్ష లేని నిర్ణయం అన్నారు. "ఈ నిర్ణయం ఎవరిపట్ల వివక్ష చూపదు లేదా ఎవరికీ అన్యాయం చేయదు. గత ప్రభుత్వాలు అందించిన దామాషా వాటా కూడా అలాగే కొనసాగుతుంది. దీని కోసం నేను 'హామీ' లేదా 'వాగ్దానం' అనే పదాన్ని లేదా దానికి సమానమైన తమిళ పదాన్ని వాడాలని మీరు కోరుకుంటే, నేను దానికి కూడా సిద్ధమే. ఎందుకంటే మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు, పదాలకు ప్రాముఖ్యత ఉండదు."

మహిళా సాధికారతపై:

"మేము మహిళలకు ఏదో ఉపకారం చేయడం లేదు. వారికి దక్కాల్సిన వాటాను మేము వారికి అందిస్తున్నాము. ఇది ఒక తపస్సు లాంటిది. గతంలో జరిగిన పొరపాట్ల నుండి మనల్ని మనం విముక్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము."

"మూడు దశాబ్దాల పాటు, ప్రజలు రకరకాల ఎత్తుగడలతో దీనిని అడ్డుకున్నారు. వారు ప్రసంగాల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తారు, కానీ ఆ తర్వాత షరతులు విధిస్తారు. అలా మూడు దశాబ్దాల సమయం వృధా అయింది. ఇప్పుడు మేము అలా జరగనివ్వము. ఇది (మహిళా రిజర్వేషన్) వాస్తవం కావాల్సిందే."

"దీని వల్ల మోదీకి లాభం కలుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ వారు దీనిని వ్యతిరేకిస్తే, సహజంగానే మోదీకి లాభం చేకూరుతుంది. దాని గురించి నేనేమీ చేయలేను. నేను దీనిని కీర్తి కోసం చేయడం లేదు. మీకు ఆ కీర్తి గురించి ఆందోళన ఉంటే, ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒక ప్రకటన (Add) ఇచ్చి, అందులో అందరి (వివిధ రాజకీయ పార్టీల నాయకుల) ఫోటోలు వేసి, ధన్యవాదాలు చెప్పడానికి కూడా నేను సిద్ధమే. ఆ క్రెడిట్ కోసం నేను మీకు 'బ్లాంక్ చెక్' ఇస్తున్నాను. నాకు దీనిపై ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు."

DMK ఎంపీలపై వ్యంగ్యాస్త్రం

తమ నిరసనలో భాగంగా నల్ల దుస్తులు ధరించి వచ్చిన DMK ఎంపీలపై మోదీ చమత్కరిస్తూ ఇలా ముగించారు. "మనం ఏదైనా మంచి పని చేయబోయేటప్పుడు, అది నిర్విఘ్నంగా సాగాలని మన సంప్రదాయం ప్రకారం 'కాటుక చుక్క' (నల్లని తిలకం) పెడతాం. మీరు నల్ల దుస్తుల్లో వచ్చి మాకు ఆ దిష్టి చుక్కను పెట్టారు, అందుకు మీకు ధన్యవాదాలు."


కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం..
అంతకుముందు ఈ బిల్లుల ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలు జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు (ముఖ్యంగా దక్షిణాదికి) రక్షణగా నియోజకవర్గాల పెంపుపై విధించిన మారటోరియంను మోదీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు గళమెత్తాయి.
ముస్లిం రిజర్వేషన్లపై రిజిజు అభ్యంతరం:
చర్చ సందర్భంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల సంఖ్య పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ పరిణామాలపై అటు విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, ఇటు ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపిస్తోంది.
సభ ముందుకు వచ్చిన 3 కీలక బిల్లులు:
నేడు కేంద్ర మంత్రులు లోక్‌సభలో ఈ క్రింది బిల్లులను ప్రతిపాదించారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026: మహిళా రిజర్వేషన్ల (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుకు మార్గం సుగమం చేసేందుకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిని ప్రవేశపెట్టారు.
నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు-2026: లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కూడా మేఘ్వాల్ ప్రతిపాదించారు.
కేంద్ర పాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లు-2026: దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు.
సీట్ల పెంపు: లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి రాష్ట్రంలో 50% మేర సీట్లు పెరుగుతాయని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
నల్లచొక్కాలతో సభకు వచ్చిన డీఎంకే సభ్యులు
ఈ మూడు బిల్లులను డీఎంకే సభ్యులు తిరస్కరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు డీఎంకే సభ్యులు నల్లచొక్కాలు ధరించి వచ్చారు. ఈ బిల్లులను నిరసించారు.

Live Updates

  • 17 April 2026 12:06 AM IST

    అర్థరాత్రి ఒంటి గంట వరకు చర్చ..

    డీలిమిటేషన్ పై అర్థరాత్రి ఒంటి గంట వరకు చర్చించాలని ప్యానల్ స్పీకర్ ప్రేమచంద్రన్ నిర్ణయించారు. ఎక్కువ మంది సభ్యులు మాట్లాడాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీన్ని సభ కూడా అంగీకరించింది. 

  • 16 April 2026 11:36 PM IST

    ఆంధ్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య

    పార్లమెంటులో జరిగిన డిలిమిటేషన్ బిల్లు చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వాఖ్యలు తెలంగాణ ఉద్యమకారులను, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్, బిఆర్ఎస్ మండిపడుతున్నాయి.

    తేజస్వీ సూర్య ఏమన్నారంటే..

    భారత్-పాక్ విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పోల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఏపీలుగా విభజించిన తీరును ఆయన భారతదేశ విభజన (Partition of India) తో పోల్చారు. "కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు.. గతంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారత్-పాక్‌లుగా విడగొట్టిన దానికంటే దారుణంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

    ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

    ఆ తర్వాత పార్లమెంటులో ప్రసంగించిన కడియం కావ్య కూడా సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ సూర్య తప్పుగా మాట్లాడితే ఉపసంహరించుకుంటామన్నారు. సూర్య కూడా మాట్లాడుతూ.. తనకు తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన ఉందని, తన మాటల్ని తప్పుగా వ్యాఖ్యానించారని వివరించారు. కాంగ్రెస్ సభ్యులు వాళ్ల వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సభలో వివాదానికి దిగారు. మల్లు రవి మాట్లాడుతూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద తెలంగాణ అంశం ఇవాళ లోక్ సభలో పెద్ద వివాదాస్పద అంశమైంది.

  • 16 April 2026 11:03 PM IST

    అమిత్ షా అసత్యాలు చెబుతున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ

    ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డిలిమిటేషన్ బిల్లు (నియోజకవర్గాల పునర్విభజన) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ తన ప్రసంగంలో అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇలా అన్నారు.  "తెలంగాణలో బీజేపీ సీట్లు పెరుగుతాయని, అధికారంలోకి వస్తామని హోం మంత్రి పదే పదే చెబుతుంటారు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన డిలిమిటేషన్ బిల్లులో తెలంగాణ లేదా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రస్తావించలేదు?" అని ప్రశ్నించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గడం లేదా పెరగకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరగడం వల్ల అధికార సమతుల్యత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • 16 April 2026 7:01 PM IST

    ఏపీలో పెరిగే ఎంపీ సీట్లు ఎన్నంటే...

    డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ సంబంధిత బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా అమిత్‌ షా ఈ వివరాలు వెల్లడించారు.

  • 16 April 2026 3:34 PM IST

    రేవంత్ వాదన మూర్ఖత్వం- బీజేపీ ఎంపి సూర్య

    "నియోజకవర్గాల పునర్విభజనను జనాభాతో పాటు రాష్ట్రాల జీఎస్‌డీపీ (GSDP)కి ముడిపెట్టాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి వాదన అత్యంత మూర్ఖత్వంతో కూడింది, రాజ్యాంగ విరుద్ధమైనది. రాష్ట్రాల జీఎస్‌డీపీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది, మరి అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సీట్లను కోల్పోవడం లేదా పెంచుకోవడం నిరంతరం జరుగుతూనే ఉంటుందా? ఇది రాజ్యాంగం ప్రసాదించిన 'ఒక ఓటు - ఒకే విలువ' అనే సిద్ధాంతానికి విరుద్ధం. ఎందుకంటే అప్పుడు పేదవాడి ఓటు కంటే ధనవంతుడి ఓటుకే ఎక్కువ విలువ ఉంటుంది." అని బీజేపీ ఎంపీ సూర్య అన్నారు.

    "నరేంద్ర మోదీ అధికారంలో ఉన్న సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను విభజించిన తీరు.. 1947లో బ్రిటిష్ వారు చేసిన దేశ విభజన కంటే దారుణంగా ఉంది."

    ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే..

    "బీజేపీ 'నారి' (మహిళ)ని తన 'నారా' (నినాదం)గా మార్చుకోవాలని చూస్తోంది. కానీ వారి మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)లో ఎంతమంది మహిళలు ఉన్నారో వారు చెప్పగలరా?" అని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.

    "బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న 21 రాష్ట్రాలలో ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు? ఢిల్లీలో ఉన్న ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా 'సగం ముఖ్యమంత్రి' మాత్రమే, ఎందుకంటే ఆమెకు ఎటువంటి అధికారాలు లేవు. ఢిల్లీలోని అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయి. ఈ 21 రాష్ట్రాల్లో బీజేపీ మహిళా ఎమ్మెల్యేల శాతం ఎక్కడా 10 శాతం కంటే ఎక్కువగా లేదు."

    "ఈ బిల్లులను తీసుకురావడం వెనుక అసలు కారణం ఏమిటంటే.. మిగిలిన అన్ని విషయాల్లో బీజేపీ రాజకీయ ఎత్తుగడలు పూర్తిగా బయటపడిపోయాయి. ఎస్‌ఐఆర్ (SIR) విషయంలో కూడా ఇదే జరిగింది. వారి అజెండా కేవలం ఓట్లు మరియు వాటిని ఎలా ప్రభావితం చేయాలి అనేదే.

    మేము మహిళా రిజర్వేషన్లకు పూర్తిగా అనుకూలం, కానీ బీజేపీ కుట్రలను వ్యతిరేకిస్తున్నాం. కులగణన నివేదిక వచ్చే వరకు ఆగకూడదనేది వారి కుట్ర. ఎందుకంటే ఒకవేళ ఆగితే, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో అంతర్గత కోటా (quota within quota) ఇవ్వాల్సి ఉంటుంది.

    వారు ప్రతిపాదిస్తున్న ఈ నియోజకవర్గాల పునర్విభజన ఏమిటి? ఇది రాజకీయ మ్యాప్‌ను తమకు (బీజేపీకి) అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. అస్సాంలో ఇలా జరగడం మనం చూశాం.

    పునర్విభజన ద్వారా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 500 లేదా 600 వరకు పెంచాలని చూస్తున్నట్లు మాకు అనుమానం ఉంది. ఈ సీట్ల పెంపు వెనుక కూడా బీజేపీ ఏదో ఒక కుట్ర పన్ని ఉంటుందని మేము భావిస్తున్నాము."

    మహిళా రిజర్వేషన్లపై అఖిలేష్ సూచన:

    మహిళా రిజర్వేషన్ల అమలుకు అఖిలేష్ ఒక భిన్నమైన నమూనాను సూచించారు. "సీట్ల సంఖ్యపై 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే అది మహిళల మధ్య పోటీకి, గొడవలకు దారితీస్తుంది. దానికి బదులుగా, రాజకీయ పార్టీలకే ఈ రిజర్వేషన్ నిబంధనను వర్తింపజేయాలి. తద్వారా పార్టీలు తప్పనిసరిగా మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేలా బాధ్యత వహిస్తాయి" అని ఆయన వాదించారు.

  • 16 April 2026 3:28 PM IST

    ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు- మోదీ

    తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘మహిళా సాధికారత దిశగా మరో చారిత్రక అడుగు వేసేందుకు మన దేశం సిద్ధంగా ఉంది. సోదరీమణులు, తల్లులపై మనం చూపించే గౌరవమే.. దేశానికి మనమిచ్చే గౌరవం. ఇదే స్ఫూర్తితో, దృఢ నిశ్చయంతో మనమంతా ముందుకుసాగుదాం’’ అని మోదీ పేర్కొన్నారు.

    చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వీటిపై చర్చలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో మాట్లాడారు. ‘‘దేశ చర్రితలో కొన్ని కీలక ఘట్టాలున్నాయి. ఇది అలాంటి సమయమే. 30 ఏళ్ల క్రితమే ఆమోదించుకోవాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకొచ్చింది. పార్లమెంట్‌ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్‌ గొప్ప బిల్లు’’ అని మోదీ (PM Modi) కొనియాడారు.

    డీలిమిటేషన్ బిల్లు వల్ల ఏ రాష్ట్రానికీ, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని, ఇది గ్యారంటీ అని చెప్పారు.

  • 16 April 2026 1:52 PM IST

    ఇందులో పెద్ద కుట్ర దాగి ఉంది- గొగోయ్

    "అర్జున్ రామ్ మేఘవాల్ మాటలు వింటే, మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే మొదటిసారి తెస్తున్నట్లు ఉంది. కానీ నిజానికి 2023లోనే అందరి ఆమోదంతో ఈ చట్టం తయారైంది. మేఘవాల్ ఇవాళ చెప్పిన దాంట్లో 90 శాతం విషయాలు అప్పట్లో ప్రభుత్వం చెప్పినవే.

    నియోజకవర్గాల పునర్విభజనతో (Delimitation) సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని 2023లోనే మేం డిమాండ్ చేశాం. మా మాట ఇప్పటికీ అదే.

    2024 ఎన్నికలు పూర్తికాగానే జనాభా లెక్కలు తీస్తామని, పునర్విభజన చేసి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం మంత్రి అప్పట్లో చెప్పారు. మరి ఈ రెండేళ్లలో ఏం మారింది? ఇప్పుడు జనాభా లెక్కలకు టైమ్ పడుతుందని, అందుకే 2011 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం ఎందుకు చెబుతోంది? కొత్త జనాభా లెక్కల ప్రక్రియ మొదలైందని హోం మంత్రే కొద్దిసేపటి క్రితం చెప్పారు కదా, మరి ఆ వివరాల కోసం ఎందుకు ఆగరు?

    నిజానికి ఈ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. 2023లో మేం చెప్పినట్లు విని ఉంటే, ఇప్పుడున్న 543 మంది ఎంపీల బలంతోనే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉండేది.

    ముఖ్యమైన అంశాలు:

    రాజకీయ వ్యూహం: మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు నెట్టాలని చూస్తోంది.

    కుట్ర: ఇండియా (INDIA) కూటమి ఒత్తిడి వల్ల 2027 జనాభా లెక్కలతో పాటు 'కులాధారిత గణన' చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు కొత్త లెక్కల్లో కులాల వివరాలు బయటకు వస్తాయనే భయంతోనే.. పాత 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారా?

    ప్రశ్నలు: లోక్‌సభ ఎంపీల సంఖ్యను 850కి పెంచాలని ఏ లెక్కన నిర్ణయించారు? దీనిపై ఏమైనా అధ్యయనం చేశారా? అస్సాం, కాశ్మీర్‌లలో జరిగినట్లుగా, ఎన్నికల్లో గెలవడానికి పునర్విభజనను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారు.

    ఉదాహరణ: అస్సాంలో ఒక ఎంపీ సీటుకు 14 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో సీటుకు 26 లక్షల మంది ఉన్నారు. ఇది ప్రజల కోసమా లేక బీజేపీ ప్రయోజనం కోసమా?"

    మొత్తానికి, మహిళా రిజర్వేషన్ల ముసుగులో ప్రభుత్వం తన రాజకీయ పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని గొగోయ్ విమర్శించారు.

  • 16 April 2026 1:47 PM IST

    ఆలస్యమవుతుందనే డీలిమిటేషన్ బిల్లు తెచ్చాం-మేఘవాల్

    "నారీ శక్తి వందన్ చట్టం తెచ్చినప్పుడే రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ప్రతిపక్షాలు అడిగారు. కానీ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పూర్తయ్యాకే ఇది సాధ్యమని అప్పట్లో చెప్పడం జరిగింది. 2027లో జరిగే జనాభా లెక్కల పూర్తి వివరాలు రావడానికి 2028 వరకు సమయం పడుతుంది. అంతవరకు ఆగకుండా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికే ఈ కొత్త బిల్లులు తెచ్చాం. దీనివల్ల 2027 లెక్కల కోసం ఎదురుచూడకుండా, 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం కలుగుతుంది."

  • 16 April 2026 12:31 PM IST

    పార్లమెంట్‌లో చర్చల పర్వం

     విపక్షాల అభ్యంతరాల మధ్యే 3 బిల్లులపై ఉమ్మడి చర్చ ప్రారంభం!

    లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ వాడీవేడీగా ప్రారంభమైంది. బిల్లుల చర్చా విధానంపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు.

    సభలో జరిగిన కీలక పరిణామాలు:

    విపక్షాల అభ్యంతరాలు: కేంద్ర మంత్రి మేఘ్వాల్ విజ్ఞప్తిపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, డిఎంకె ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ బిల్లు మరియు చట్టబద్ధమైన బిల్లుల స్వభావం వేర్వేరుగా ఉంటుందని, కాబట్టి వాటిపై వేర్వేరుగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

    అమిత్ షా వాదన: ఈ మూడు బిల్లులు పరస్పరం ముడిపడి ఉన్నాయని, అందుకే వీటిని కలిపి చర్చించాలని హోం మంత్రి అమిత్ షా వాదించారు. అయితే, ఓటింగ్ సమయంలో మాత్రం ప్రతి బిల్లుపై విడివిడిగా ఓటింగ్ జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు.

    స్పీకర్ నిర్ణయం: విపక్షాల వాదనను తోసిపుచ్చిన స్పీకర్ ఓం బిర్లా, మూడు బిల్లులపై ఏకకాలంలో (Concurrently) చర్చ జరిపేందుకు అనుమతించారు.

    చర్చా సమయం: ఈ బిల్లులపై నేడు మరియు రేపు కలిపి సుమారు 12 గంటల పాటు చర్చ జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. అవసరమైతే సమయాన్ని పొడిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    ఓటింగ్ ముహూర్తం ఖరారు: రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. అయితే ఎంపీలందరికీ మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

    ప్రస్తుత స్థితి:

    ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లులపై చర్చను ప్రారంభించారు. మహిళా సాధికారత మరియు దేశ భవిష్యత్తు కోసం ఈ బిల్లులు ఎంత అవసరమో ఆయన వివరిస్తున్నారు.

    మరోవైపు, విపక్షాలు కూడా తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. రేపు సాయంత్రం జరగబోయే ఓటింగ్ ఈ బిల్లుల భవిష్యత్తును నిర్ణయించనుంది. 

  • 16 April 2026 12:20 PM IST

    బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి

    లోక్‌సభలో తొలి అడుగు వేసిన రాజ్యాంగ సవరణ బిల్లు: ఓటింగ్‌లో నెగ్గిన ప్రభుత్వం

    పార్లమెంటులో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ప్రవేశానికి సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశంపై జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి లభించింది.

    ఓటింగ్ వివరాలు:

    బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా మరియు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ (Division) ఫలితాలు ఇలా ఉన్నాయి:

    అనుకూలం (Ayes): 251

    వ్యతిరేకం (Noes): 185

    తటస్థం (Abstain): 0

    మొత్తం 251 ఓట్ల మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విపక్షాలు 185 ఓట్లతో తమ నిరసనను వ్యక్తం చేసినప్పటికీ, సాధారణ మెజారిటీ ఉండటంతో బిల్లు సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే తదుపరి దశల్లో ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ అవసరం కానుంది.

Read More
Next Story