మరఠ్వాడలో రిజర్వాయర్ లు ఖాళీ
x

మరఠ్వాడలో రిజర్వాయర్ లు ఖాళీ

తీవ్ర నీటి ఎద్దడితో సాగు నీటి ప్రణాళికలు రద్దు చేశామన్న అధికారులు


మహారాష్ట్రలో కరువు ప్రాంతంగా పేరు పొందిన మరఠ్వాడాలో మరోసారి నీటి ఎద్దడి కనిపించే సూచనలు కనిపిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక నుంచి జలాశయాల్లో నీటిని తాగునీటి కోసం మాత్రమే ఉపయోగించనున్నట్లు ఒక సీనియర్ అధికారి సోమవారం తెలిపారు.

జూన్ 1 నుంచి ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో సాధారణంగా కురవాల్సిన 552.2 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా 388.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది 29.7 శాతం లోటు. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు, అంచనా వేసిన 38.7 మిల్లీమీటర్లలో కేవలం 14 శాతం, అంటే 5.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
అధికారిక గణాంకాల ప్రకారం, లాతూర్, పర్భణి జిల్లాల్లో వర్షపాతం సాధారణం కంటే 60 శాతం తక్కువగా నమోదు అయింది. ఈ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటిని యంత్రాంగం నిర్వహించడం ప్రారంభించింది. "అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిగా తాగునీటి అవసరాలకే రిజర్వ్ చేస్తాము. రాబోయే రబీ సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ తర్వాత వచ్చే సీజన్ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటాము" అని డివిజనల్ కమిషనర్ జి. శ్రీకాంత్ విలేకరులతో అన్నారు. "తక్కువ నిల్వ ఉన్న మంజర, మఖ్ని వంటి డ్యామ్‌ల నుంచి నీటిని ఇప్పుడు కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించారు" అని ఆయన తెలిపారు.
ఈ నీటి వనరుల చుట్టూ గస్తీ బృందాలను మోహరించామని, అక్రమంగా నీటిని తోడటానికి ఉపయోగించే పంపులను స్వాధీనం చేసుకుంటామని ఆ అధికారి చెప్పారు. మరాఠ్వాడా ప్రాంతంలో 11 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. డివిజనల్ కమిషనర్ కార్యాలయం నివేదిక ప్రకారం.. గత సంవత్సరం ఇదే రోజున 176.30 టీఎంసీలు (96.82 శాతం) నీటి నిల్వ ఉండగా, ఈ సంవత్సరం వాటి మొత్తం నీటి నిల్వ 123.32 టీఎంసీలకు (మొత్తం సామర్థ్యంలో 67.73 శాతం) చేరింది.
అనేక ప్రాజెక్టులలో పరిస్థితి క్లిష్టంగా ఉంది. 3.15 టీఎంసీల సామర్థ్యం గల ధరాశివ్‌లోని సినా కోలేగావ్ ప్రాజెక్టులో నీటి నిల్వ సున్నాగా ఉంది. లాతూర్‌కు నీటిని సరఫరా చేసే బీడ్‌లోని మంజర డ్యామ్‌లో దాని సామర్థ్యంలో కేవలం 12.26 శాతం మాత్రమే ఉంది.
పర్భణి జిల్లాలోని నిమ్నా దుధ్నా ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ తక్కువగా ఉన్నట్లు నమోదైంది. గత సంవత్సరం, అధికారిక డేటా ప్రకారం, అదే రోజున నిమ్నా దుధ్నా ప్రాజెక్ట్‌లో 74.67 శాతం నీటి నిల్వ ఉండగా, ఈ ఏడాది అది కేవలం 22.49 శాతానికి పడిపోయింది.


Read More
Next Story