
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను స్వాగతిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
'రక్షణ' ప్రాజెక్టుతో రాయలసీమ ప్రజలకు 'రిటర్న్ గిఫ్ట్...'
పుట్టపర్తి వద్ద యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేష్ వ్యాఖ్య.
రాయలసీమ ఎన్డీఏ కూటిమిని ఆదరించింది. ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా నిలిచింది. అందుకే, పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, అభివృద్ధితో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. శుక్రవారం ఉదయం జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ కొంతసేపు హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్నారు.
"ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తి అయ్యింది. శత్రువుకు భారత రక్షణ దళాల శక్తి ఏమిటో ప్రధాని చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడే ప్రధాని దేశానికి ఉన్నారు. దేశానికి ఐరన్ మ్యాన్ గా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుంది" అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాయలసీమకు రిటర్న్ గిఫ్ట్..
టీడీపీ కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చిన రాయలసీమ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే ఈ ప్రాజెక్టు తెచ్చాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కరవు నేలపై రక్షణ జెక్టులు వచ్చాయనీ, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరవు నేలపై కియా ప్రాజెక్టు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచారన్నారు. గతంలో శ్రీసత్యసాయి బాబా పుట్టపర్తిలో ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే అందరూ అవసరమా ?అని అడిగారు. అలాంటి ప్రదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తితో పుట్టపర్తికి కూటమి ప్రభుత్వం డిఫెన్సు ప్రాజెక్టు తెచ్చిందని గుర్తు చఏశారు.
" డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఏపీలో ఉంది. ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోడీజీ జోడీ, మోదీజీ, చంద్రబాబుజీ, రాజ్ నాథ్ సింగ్ జీ 75 ఏళ్ల కుర్రవాళ్లు. వారి స్పీడ్ ఇప్పటికీ ఎవరూ అందుకోలేరు" అని హిందీలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
" 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో చూపించి ఈ ప్రాజెక్టును సాకారం చేశాం. పొరుగు రాష్ట్ర ప్రజలు ఏపీని చూసి అసూయపడే పరిస్థితి తీసుకువచ్చాం. రాయలసీమతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు వచ్చింది. పుట్టపర్తిలో ఏడీఏ ఆమ్కా ప్రాజెక్టును తీసుకువచ్చాం" అని గుర్తు చేశారు.
అనంతపురం నంబర్ వన్
పరిశ్రమలు, సాంకేతికరంగంలోనే కాకుండా, దేశానికి రక్షణ వ్యవస్థ ప్రధానమైందనీ దీనికి అనంతపురం జిల్లా నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయనీ త్వరలో కర్నూలులోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని చెప్పారు.
"పుట్టపర్తిలో ఐదో తరం ఆధునిక యుద్ధ విమానాల ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు వచ్చింది. ఇతర డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చాయి. అమ్కా ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా నెంబర్ వన్ గా నిలుస్తుంది" అని లోకేష్ చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
ఢిల్లీలో నేను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి విన్నవించాను. అమ్కా కథ 2025 డిసెంబరులో ఢిల్లీలో మొదలైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పరుగులు పెట్టించి ఏడాది పూర్తి అయ్యేలోపే దీనిని సాకారం చేశాం. ఇది కేవలం డిఫెన్సు ప్రాజెక్టు మాత్రమే కాదు. రాయలసీమకు కొత్త దిశను కల్పించే అత్యుత్తమ ప్రాజెక్టు " అని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు.
వైసీపీకి చురకలు
దేశ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకభాగస్వామిగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ పాలనపై చతురోక్తులతో ఆయన చురకలు వేశారు.
"వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రైండ్, ఎన్డీఏలో కీలకభాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమిది రక్షణ కల్పించే విధానం ఉంది. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దీనికి అడుగడుగునా పుల్లలు పెడుతున్నారు" అని మంత్రి నారా లోకేష్ వైసీపీ పాలన, ప్రస్తుత తీరుపై విరుచుకుపడ్డారు. వైసీపీ క్రిమినల్ ఆలోచనలతో పనిచేస్తుంటే, మనది (టీడీపీ కూటమి) కియా బ్యాక్ గ్రౌండ్ అని చురకలు వేశారు. కరువుతో సతమతం అవుతున్న అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడంలో తీసుకున్న శ్రద్ధను ఆయన వివరించారు.
Next Story

