హైడ్రా రెండునెలల ప్రోగ్రెస్ రిపోర్టు
x

హైడ్రా రెండునెలల ప్రోగ్రెస్ రిపోర్టు

రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమనిర్మాణాలను కూల్చేసి 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది.


ఏర్పాటైన దగ్గర నుండి హైడ్రా సంచలనాలు సృష్టిస్తునే ఉంది. రెండునెలల క్రితం ఏర్పడిన హైడ్రా తన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో అందించింది. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమనిర్మాణాలను కూల్చేసి 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, కుంటాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చేసి తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవటమే టార్గెట్ గా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

గడచిన రెండునెలలుగా చెరువులు, కాల్వలు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో చేసిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చేస్తోంది. నిజానికి ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లో ఎలాంటి శాస్వత నిర్మాణాలు ఉండకూడదు. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లో వ్యవసాయం చేసుకోవచ్చు లేదా తాత్కాలిక నిర్మాణాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుంది. నిర్మాణాల్లో తాత్కాలికం అంటు ఉండదు కాబట్టి శాస్వత నిర్మాణాలు నిషిద్ధం. ఈ విషయాలు బిల్డర్లు, రియల్టర్లకు బాగా తెలుసు కాబట్టి ఏదో పద్దతిలో అధికారులతో సంతకాలు చేయించుకునో లేకపోతే అసలు అనుమతి తీసుకోకుండానే నిర్మాణాలు చేసేస్తున్నారు.

చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించేసి చేసిన నిర్మాణాలు కొన్ని వేలుంటాయి. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి అలాంటి వాటి భరతం పడుతోంది. రామ్ నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నంచెరువు పరిధిలో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమనిర్మాణాలను కూల్చేసినట్లు హైడ్రా తన రిపోర్టులో చెప్పింది. అత్యధికంగా అమీన్ పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్లోని సున్నంచెరువులో 10 ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా చెప్పింది. నిర్మాణాల్లో ఉన్న వాటిని కూల్చేస్తున్న హైడ్రా ఇప్పటికే నివాసం ఉంటున్న అక్రమనిర్మాణాల కూల్చివేతలపై నోటీసులు ఇస్తున్నది. హైడ్రాకు కమీషనర్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ అక్రమనిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఇతర శాఖలతో క్రాస్ చెక్ చేసుకుని మరీ యాక్షన్లోకి దిగుతున్నారు.

Read More
Next Story