వరదల నష్టం అంచనాపై ఏపీలో కేంద్ర బృందం పర్యటన
x

వరదల నష్టం అంచనాపై ఏపీలో కేంద్ర బృందం పర్యటన

ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన చేయనుంది.


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్ణాన్ని అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. అందులో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యింది. జరిగిన నష్టంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి రాష్ట్రంలోని విపత్తుల పరిస్థితిని వివరించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా వరద నష్టం తీవ్రతను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందానికి వివరించారు. దాదాపు రూ. 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు కేంద్ర బృందానికి వివరించారు.

ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్‌ రోడ్లు, ఆర్‌ అండ్‌ బి రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలపై సుదీర్ఘంగా వివరించారు. వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని వివరించారు. వరదలు, భారీ వర్షాల ధాటికి 32 వార్డులు, 2 గ్రామాలు, 161 సచివాలయాల పరిధిలో దాదాపు 10.63 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని వివరించారు.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో 108 మండలాలు, 337 గ్రామాలు ప్రభావితం అయ్యాయని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. 246 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 45,855 మంది ప్రజలతో పాటు 522 మంది దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించిటన్లు వివరించారు. 28 అంబులెన్స్‌లు, 199 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి 1,24,916 మందికి అత్యవసర వైద్య సాయం అందించామని వివరించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లు వరద నీటితో నిండి పోయాయని వివరించారు. బుడమేరు వరదల కారణంగా ముంపుకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. బుడమేరుకు ఎక్కువ మొత్తంలో వరద నీరు రావడం, దీంతో గండ్లు పడటం, ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావడంతో వరదలు చోటు చేసుకున్నాయని వివరించారు. వరదల కారణంగా పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్‌ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఎన్యూమరేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని, వరదల సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యలపైన సెంట్రల్‌ టీమ్‌కు వివరించారు. దాదాపు 2.06 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 19,686 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, భారీగా రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. వరదల కారణంగా బాధితుల ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాహనాలు, గృహోప కరణాలు మెకానిక్‌ సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అనిల్‌ కుమార్‌ సింఘాల్, విజయానంద్, శేషగిరిరావు, ఢిల్లీ రావు, విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్, ఏపీఎస్‌ఎండీఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్, వివిధ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్డిఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సెంట్రల్‌ టీం పరిశీలించింది.
అనంతరం రాష్ట్ర అధికారుల నుంచి సమగ్ర నివేదికను తీసుకున్న కేంద్ర బృందం రెండు టీమ్‌ లుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఒక టీమ్‌ గుంటూరు, బాపట్ల జిల్లాల్లోను, రెండో టీమ్‌ కృష్ణా జిల్లాలో పర్యటించింది. డా.ఎ.ఎల్‌. వాగ్మేర్‌ నేతృత్వంలోని బృందం బాపట్ల, గుంటూరు జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. బాపట్ల జిల్లా వేమూరు, కొల్లూరు మండలం ఈపురులంక, అరవింద వారథి, పెసర్లంక, నక్కపాయ, పల్లెపాలెంలోని ఓలేరు, రావి అనంతవరం, కనగాలలో çపర్యటించిన కేంద్ర బృందం వరద బాధితులతోను నేరుగా మాట్లాడి వివరాలు తెలసుకుంది. అనంతరం గుంటూరుకు చేరుకుంది.
మరో టీం కష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురులో దెబ్బతిన్న ఆర్‌ డబ్ల్యూఎస్, సీపీ డబ్ల్యూ ఎస్‌ స్కీం లను పరిశీలించింది. కంకిపాడు మండలంలోని పెదపులిపాక గ్రామంలో దెబ్బతిన్న గృహాలు, ఉద్యాన పంటలను పరిశీలింది. పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటల పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు లో దెబ్బతిన్న కంకిపాడు – రొయ్యూరు రహదారి పరిశీలించింది. గుడివాడ మండలంలోని నందివాడ ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించింది.
కేంద్ర బృందానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తుండగా, వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమం సంచాలకులు డా.ఎ.ఎల్‌. వాగ్మేర్, ఉపరితల రవాణాశాఖ చీఫ్‌ ఇంజనీరు రాకేష్‌కుమార్, ఆర్థిక శాఖ కన్సల్టెంట్‌ ఆర్‌.బి.కౌల్, గ్రామీణాభివద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రదీప్‌ కుమార్, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.వి.ఎస్‌.పి. శర్మలు బృందంలో సభ్యులుగా ఉన్నారు.
Read More
Next Story