
ఏపీలో 16 లక్షల మందికి ‘ఉపాధిహామీ కార్డులు’ గోవింద!
బోగస్ ఉపాధి హమీ కార్డుల ఏరివేత పేరిట లక్షలాది మంది కార్డులు ఏపీ ప్రభుత్వం తొలగించింది. E-KYC చేయని కార్డులను తొలగించినట్టు ప్రభుత్వం చెబుతోంది.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో బోగస్ జాబ్ కార్డుల సంక్షోభం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి బోగస్ కార్డులున్నట్టు వెలుగులోకి వచ్చింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 లక్షల జాబ్ కార్డులు రద్దు కానున్నాయి. ఇందులో ఇప్పటికిప్పుడు 15.92 లక్షల కార్డులు పోనున్నాయి.
మరణించిన లేదా వలస వెళ్లినవారి జాబ్ కార్డులు కావచ్చని ప్రభుత్వం చెబుతుంటే లిబ్టెక్ ఇండియా వంటి సంస్థలు దీన్ని 'అసాధారణమైన తొలగింపుగా విమర్శిస్తున్నాయి. గ్రామీణ పేదల కడుపుగొట్టే చర్యగా భావిస్తున్నాయి..
బోగస్ కార్డులు ఎలా వెలుగులోకి వచ్చాయి?
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2025-26లో eKYCను తప్పనిసరి చేసింది. ఇది ఆధార్, మొబైల్ నంబర్ లింకింగ్తో జాబ్ కార్డు. లబ్ధిదారులను ధృవీకరించడానికి ఈకేవైసీ తప్పని సరి. ఏపీలో దాదాపు 78.4% మంది eKYC – చేసుకున్నారు. దేశంలో ఇదే అత్యధికం. తమిళనాడు (67.6%), చత్తీస్గఢ్ (66.6%)తో పోలిస్తే కూడా ఇది ఎక్కువ. అయినా సరే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్యకాలంలో 15.92 లక్షల జాబ్ కార్డులు రద్దు అయ్యాయి.
ఈ కార్డుల రద్దుపై ప్రభుత్వం చెప్పేవాదన ఒక రకంగా లిబ్టెక్ రిపోర్ట్ లాంటి సంస్థలు చేసే వాదన మరోరకంగా ఉంది.
మొత్తం జాబ్ కార్డులు, eKYC స్థితి
ఏపీలో మొత్తం జాబ్ కార్డులు 70.66 లక్షలు (జూన్ 2025 డేటా ప్రకారం). ఇందులో 57.20 లక్షలు క్రియాశీలకంగా ఉన్నాయి. మిగిలిన 15.26 లక్షల కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటికి ముప్పు ఏర్పడింది.
రద్దయిన కార్డుల్లో ఎక్కువ భాగం విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో (కృష్ణా, గుంటూరు) 2-3 లక్షలు చొప్పున రద్దయ్యాయి.
| సూచిక | మొత్తం / శాతం | వివరాలు |
| మొత్తం జాబ్ కార్డులు | 70.66 లక్షలు | జూన్ 2025 డేటా |
| యాక్టివ్ జాబ్ కార్డులు | 57.20 లక్షలు | అంటే 81% యాక్టివ్ |
| eKYC పూర్తి చేసుకున్నవారు | 78.4% (55.4 లక్షలు) | అక్టోబర్ 2025 వరకు |
| పెండింగ్ eKYC | 21.6% (15.26 లక్షలు) | డిలీట్ అవకాశం ఉంది |
| బోగస్ / డిలీట్ చేసిన కార్డులు | 15.92 లక్షలు | అక్టోబర్-నవంబర్ 2025 |
(సోర్స్: లిబ్టెక్ ఇండియా, nrega.nic.in)
eKYC లేకపోవడంతో రూ.45.57 కోట్లు కోల్పోయిందా?
ప్రభుత్వం eKYC లేకపోవడంతో జరిగిన దుర్వినియోగాన్ని రూ.45.57 కోట్లుగా అంచనా వేస్తోంది ప్రభుత్వం (2024-25 ఆర్థిక సంవత్సరం డేటా). ఇది మొత్తం కేంద్ర నిధులు (రూ.7,558.95 కోట్లు)లో 0.6 శాతం. కానీ బోగస్ మస్టర్ రోల్స్, డూప్లికేట్ పేమెంట్లు ద్వారా దేశవ్యాప్తంగా 2023-24లో దుర్వినియోగం జరిగింది రూ.169.75 కోట్లు. ఇందులో రికవరీ కేవలం 12.33 శాతం (రూ.20.93 కోట్లు). ఏపీలో సోషల్ ఆడిట్లు జరిపి 10,454 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
విమర్శకులు ఏమంటున్నారు?
eKYC పేరిట 38 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని,కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర' లక్ష్యంతో eKYCను తీసుకువచ్చి బలోపేతం చేయడం మంచిదే అయినా గ్రామీణుల 'కడుపుగొట్టే పనులు' మానాలని విమర్శించింది. .
ఉపాధి తగ్గుదల, గ్రామీణ సంక్షోభం
ఈ కార్డుల రద్దు గ్రామీణ ప్రాంతాల్లో జీవనం దెబ్బతింటోంది. ఏపీలో మొదటి ఆరు నెలల్లో పని రోజులు 47.6 శాతం తగ్గాయి. వర్షాలు సకాలంలో రాకపోవడం, eKYC ఆలస్యం వల్ల ఉత్తరాంధ్ర లో ఎక్కువ ప్రభావం చూపింది.

