
కోస్తాంధ్రలో కోట్లు పలుకుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్!
తెలుగు రాష్ట్రాలలో, ప్రత్యేకించి కోస్తాంధ్ర రీజియన్లో బెట్టింగుల దందా విపరీతంగా జోరందుకుంది.
ఐపీఎల్ 19వ సీజన్ (IPL 19th Edition) మహా సంగ్రామానికి తెరలేచింది. లీగ్ దశలో సమాన విజయాలతో అగ్రస్థానాల్లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మెగా ఫైనల్ మ్యాచ్ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో, ప్రత్యేకించి కోస్తాంధ్ర రీజియన్లో బెట్టింగుల దందా విపరీతంగా జోరందుకుంది.
గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరడంతో అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ప్రస్తుత ఛాంపియన్స్గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపు అంచనాలు గట్టిగానే ఉన్నప్పటికీ, అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్ పిచ్ గుజరాత్ టైటాన్స్కు ఎంతవరకు అనుకూలిస్తుందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ వివరాలు ఇలా..
ఐపీఎల్-19 తుదిపోరు నేడు (31-05-2026)
సమయం రాత్రి 7.30 నుంచి
వేదిక- అహ్మదాబాద్, మోదీ స్టేడియం
ఈ ఉత్కంఠను క్యాష్ చేసుకునేందుకు కోస్తా జిల్లాలలో బెట్టింగ్ ముఠాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి. ఏలూరు జిల్లాకు చెందిన ఓ స్థానిక విలేఖరి అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షణ కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు వెలిశాయి.
భారీ స్క్రీన్ల ఏర్పాటు: స్పోర్ట్స్ బార్లు, మామూలు బార్లు, రహస్య ప్రైవేటు ప్రాంగణాలలో మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నిర్వాహకులు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఆదివారం ఎఫెక్ట్: ఫైనల్ మ్యాచ్ ఆదివారం కావడంతో సెలవు దినం కావడం వల్ల జనం ఈ స్క్రీన్ల వద్దకు భారీగా ఎగబడే సూచనలు కనిపిస్తున్నాయి.
బంతి బంతికీ పందాలు: మ్యాచ్ ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి ఓవర్, ప్రతి బంతికి పందాలు కాసే కొత్త సంస్కృతి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయిందని, ఈ ఫైనల్ మ్యాచ్లో ఇది మరింత పీక్స్కు చేరిందని విలేఖరి వెల్లడించారు. ఈ ఒక్క మ్యాచ్తోనే కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పోలీసుల సీరియస్ వార్నింగ్: క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని కోస్తా జిల్లాల పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. అనధికారిక స్క్రీన్లు, బార్లపై ప్రత్యేక నిఘా ఉంచామని.. పందాలు కాసే వారిని, ముఠాలను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
మైదానంలో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. టైటిల్ పోరు విశ్లేషణ
బెట్టింగ్ మార్కెట్ ఇలా ఉంటే, మైదానంలో మాత్రం ఇరు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. గత ఏడాది 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి కప్పు కొట్టిన రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ.. ఈసారి వరుసగా రెండో టైటిల్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అటు ఐపీఎల్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ఇదివరకే ఒకసారి కప్పు గెలిచి, ఇప్పుడు ఐదేళ్లలో మూడో ఫైనల్ ఆడుతున్న శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సైతం రెండో ట్రోఫీపై కన్నేసింది.
ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్.. ఒకరు పోతే ఇంకొకరు!
బెంగళూరు జట్టు గత కొంతకాలంగా అత్యంత పటిష్టమైన ఆల్రౌండ్ బలంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు ఒకరిద్దరిపైనే ఆధారపడే ఆర్సీబీ, ఇప్పుడు మ్యాచ్ విన్నర్లతో నిండిపోయింది.
కింగ్ కోహ్లి హవా: ఈ సీజన్లో 600 పరుగులు చేసిన విరాట్ కోహ్లి ఒకవైపు యాంకర్ పాత్ర పోషిస్తుంటే, మిగతా బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు.
భారీ హిట్టర్ల దండు: దేవ్దత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్య వంటి హిట్టర్లు ఉండటంతో 200+ స్కోర్లు చేయడం ఆర్సీబీకి సర్వసాధారణంగా మారింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ను 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసం కూడా ఆర్సీబీకి ఉంది.
గుజరాత్ ఆశలన్నీ టాప్-3 పైనే!
గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ (వాషింగ్టన్ సుందర్, తెవాతియా, హోల్డర్) కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, ఆ జట్టు టాప్-3 బ్యాటర్లు అద్భుత ఫామ్లో ఉన్నారు.
గిల్ - సుదర్శన్ తిరుగులేని జోడీ: కెప్టెన్ శుభ్మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710 పరుగులు) ఈ సీజన్లో పరుగుల వరద పారించారు. క్వాలిఫయర్-2లో వీరిద్దరూ 167 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చారు. మూడో స్థానంలో జోస్ బట్లర్ (500+ పరుగులు) కూడా బలంగా ఉన్నాడు. అయితే, క్వాలిఫయర్-1 తరహాలోనే ఈ ముగ్గురిని ఆర్సీబీ బౌలర్లు త్వరగా అవుట్ చేస్తే మాత్రం గుజరాత్ కుప్పకూలడం ఖాయం.
పిచ్ రిపోర్ట్: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
అహ్మదాబాద్లోని ఎర్రమట్టి పిచ్ హిస్టారికల్గా బ్యాటింగ్కు, ఎక్స్ట్రా బౌన్స్ లభించే ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. ఈ సీజన్లో ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 193 పరుగులుగా ఉంది. స్పిన్నర్లకు పెద్దగా లూప్ దొరకదు కాబట్టి, ఇక్కడ భారీ స్కోర్ల హై-వోల్టేజ్ మ్యాచ్ను ఆశించవచ్చు. "మాకు ఈ పిచ్ బాగా అలవాటే కానీ ఫైనల్లో మానసిక బలమే ముఖ్యం" అని గుజరాత్ సారథి శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తన టైటిల్ను నిలబెట్టుకుంటుందా? లేదా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? అనేది చూడాలి.
Next Story

