వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ లను ‘డీకే’ కొనసాగించబోతున్నారా?
x
డీకే శివకుమార్

వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ లను ‘డీకే’ కొనసాగించబోతున్నారా?

మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లపై కర్ణాటక ముఖ్యమంత్రి చూపు


కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ పరిపాలనలో తన ముద్ర వేయడానికి ప్రయత్నించే అవకాశాలు సుస్పష్టం. ఆయన హయాంలో అనేక భారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి.ఇందులో మెజారిటీ కూడా పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నవే.

వాటిలో ముఖ్యమైనది బెంగళూరు 17 కిలోమీటర్ల సొరంగ ప్రాజెక్టు. ఇది పూర్తయ్యేసరికి రూ. 18,000 నుంచి రూ. 40,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇది నిస్సందేహంగా నగరంలోనే అత్యంత ఖరీదైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఈ సొరంగం అక్షరాలా నగరం అంతర్భాగం గుండా వెళుతుంది.

ఇది సున్నితమైన భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే ప్రసిద్ధ లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ వంటి వారసత్వ ప్రదేశాలకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి.

బెంగళూరులో ప్రాజెక్టులు అమలు చేసే తీరును బట్టి చూస్తే, ఈ సొరంగం చివర పనులు నగరం ఇప్పట్లో చూసే అవకాశం లేదు, కాగితాల మీద ఇది ఐదేళ్లలోపు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు అది అసాధ్యమని అందరికి తెలుసు. నగరానికి ఇది పీడకలా లాంటి నిర్మాణంగా మారుతుందని, శతాబ్ధాల తరబడి పీడిస్తుందనే నమ్మకం అందరి మదిలోనూ ఉంది.

స్టీమ్ రోలింగ్..

నగరంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్ ఆ ప్రతిఘటనను అణచివేసి, నిర్మాణానికి టెండర్లను పిలిచి, ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి అదానీ గ్రూప్‌ను ఎంపిక చేశారు. ఈ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి మోదీ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ ఎంపిక ప్రతిపక్ష బీజేపీ నుంచి వచ్చే నిరసనలను సమర్థవంతంగా నిలిపివేసింది.
కానీ, స్వతంత్ర సంస్థలు ఈ ప్రాజెక్ట్ ప్రయోజనంపై, బెంగళూరు నగరానికి ఉన్న అపఖ్యాతి పాలైన, మీమ్స్‌కు కారణమయ్యే ట్రాఫిక్‌ను తగ్గించడం అనే దాని ఉద్దేశ్యాన్ని ఇది నెరవేరుస్తుందా లేదా అనే దానిపై తమ సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
వివిధ విద్యార్థి సంఘాల సమాఖ్య ఒకటి, ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. నగరంలోని సున్నితమైన భూగర్భ జల వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందనే భయంతో వారు ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ఈ ప్రాజెక్టును అమలు చేయాలనే శివకుమార్ ఆత్రుతను చూస్తుంటే, నగరవాసులు దీనిని ముందుకు సాగకుండా అడ్డుకోవడం కష్టమవుతుంది.

విలక్షణమైన తీరు..

సిద్ధరామయ్య ఇంతకుముందు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన శివకుమార్ కాదు. ఈయన శైలి కొంచెం భిన్నం.
ఉదాహరణకు, ప్రజా వ్యతిరేకతకు ప్రతిస్పందనగా, బెంగళూరు సమీపంలోని నగర శివారులో ప్రతిపాదించిన 1,777 ఎకరాల హై-టెక్ రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌తో సహా భారీ ప్రాజెక్టులను సిద్ధరామయ్య రద్దు చేశారు. తమ సాంప్రదాయ వృత్తిని కోల్పోయి నిరాశ్రయులయ్యే వెయ్యికి పైగా కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో, పట్టు వడికే కార్మికులు ఉపయోగించే భూమిలో మైసూరు సమీపంలో క్రీడా స్టేడియం నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా ఆయన ప్రభుత్వం రద్దు చేసింది. కానీ శివకుమార్ భిన్నమైన వ్యక్తిత్వం కలవారు. ఆయన దృక్పథం వ్యాపార అనుకూలమైనది. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణకు సన్నిహితుడు.
సుమారు మూడు దశాబ్దాల క్రితం తన గురువు అందించిన మద్దతుతో బెంగళూరు భారతదేశపు ఐటీ హబ్‌గా ఎలా మారిందో ఆయన ప్రత్యక్షంగా చూశారు. బహుశా కృష్ణ విజయం బెంగళూరుపై శివకుమార్ భవిష్యత్ దృష్టిని ప్రభావితం చేసి ఉండవచ్చు.

ఇతర భారీ ప్రాజెక్ట్ లు..

ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించిన ఇతర భారీ ప్రాజెక్టులలో, 17 కిలోమీటర్ల సొరంగ మార్గానికి అనుబంధంగా 114 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, 700 కిలోమీటర్ల పొడవునా కొత్త రోడ్లు ఉన్నాయి.
శివకుమార్ దార్శనికతను ఎవరూ తప్పుపట్టలేరు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలు ఈ విధంగానే విస్తరించి, అభివృద్ధి చెందాయి. అంతేకాక, కాగితంపై ఆడంబరమైన ఆడిటోరియంలలో ఇచ్చే ఆకర్షణీయమైన ప్రజెంటేషన్లలో, ఈ ప్రాజెక్టులు ఆచరణ సాధ్యమైనవిగా కనిపిస్తాయి. కానీ, కాగితంపై ఉన్న ప్రణాళికలకు, వాస్తవంగా సాధించగల వాటికి మధ్య అంతరం పూడ్చలేని వాస్తవం. గతంలోని కొన్ని ప్రాజెక్టులను, అవి ఏమి వాగ్దానం చేశాయో, వాటి పర్యవసానం ఏమిటో పరిశీలిస్తే చాలు.

బెంగళూరులోని పాత ఫ్లైఓవర్ల సంగతి..

ప్రధానమైన బన్నేర్‌ఘట్ట రోడ్డు మీదుగా, సుమారు 2005లో నిర్మించిన జయదేవ ఫ్లైఓవర్‌ను, ఒక మెట్రో స్టేషన్ భాగాన్ని కూడా కలుపుకొని బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌కు మార్గం సుగమం చేయడానికి కూల్చివేశారు. ఆ పాత ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది.
విలాసవంతమైన ప్యాలెస్ ఆర్చర్డ్స్‌ను ఆనుకుని, 2008లో నిర్మించిన "మ్యాజిక్ బాక్స్" అని పిలవబడే అండర్‌పాస్, బెంగళూరు సమస్యలకు పరిష్కారంగా ప్రచారం చేయబడింది, కానీ ఇప్పుడు అది మూసివేశారు. అన్ని విధాలుగా చూస్తే, ఇది ఒక ఇంజనీరింగ్ వైఫల్యంగా చెప్పవచ్చు.
విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్లే మార్గంలో ఉన్న హెబ్బాల్ కూడలిని నిర్మించి, పాక్షికంగా కూల్చివేసి, సవరించిన ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ పునఃసర్దుబాట్లతో తిరిగి నిర్మించారు. అయినప్పటికీ, ఇవన్నీ పెద్దగా మార్పు తెచ్చినట్లు కనిపించడం లేదు. ఇక, ఆ కూడలి నుంచి ప్రయాణించే తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి శివకుమార్ తన మరో ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు. అదే సొరంగాలు - ఫ్లైఓవర్ల కలయిక. రవాణా నిపుణులను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, ఈ టన్నెల్-ఫ్లైఓవర్ పూర్తయినప్పుడు, భూగర్భంలో మరింత ట్రాఫిక్ రద్దీకి దారితీస్తుంది.
అదే సమయంలో దానిలోని భారీ మలుపులు వాహనాలను నడపడాన్ని ప్రమాదకరంగా మార్చాయి. కానీ రూ. 2,250 కోట్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది.

అండర్‌పాస్‌లు – మృత్యు ఉచ్చులు.

కీలకమైన కూడళ్ల వద్ద ఉన్న కొన్ని అండర్‌పాస్‌లు వర్షాలు పడినప్పుడు మృత్యు ఉచ్చులుగా మారాయి. భూగర్భ డ్రైనేజీని సరిచేస్తామని నిరంతరం చెబుతున్నప్పటికీ, భారీ వర్షాలు పడిన ప్రతిసారీ అండర్‌పాస్‌లు వరదలతో నిండిపోతున్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఒక విషాద సంఘటనలో, రాష్ట్ర శాసనసభకు అతి సమీపంలోని కేఆర్ సర్కిల్ వద్ద, వరద నీటితో నిండిన అండర్‌పాస్‌లో ప్రయాణికులతో సహా ఒక కారు మునిగిపోవడంతో, అందులోని ప్రయాణికులలో ఒకరు మరణించారు. ప్రభుత్వం దాని డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దలేకపోవడంతో, ఇప్పటికీ వర్షాలు మొదలైనప్పుడు ఆ అండర్‌పాస్‌కు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలస్యం అనే మాట కూడా సరిపోదు..

ప్రాజెక్టులను ముందుకు నడిపించే అధికారం ముఖ్యమంత్రికి లేదా ఉప ముఖ్యమంత్రికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు శివకుమార్ చివరకు రాష్ట్ర పాలకవర్గంలో అత్యున్నత శిఖరాగ్రానికి చేరుకున్నారు కాబట్టి, తన కలల ప్రాజెక్టులను అమలు చేయడానికి ఆయన తన పదవిని ఉపయోగించుకోవడం ఖాయం. కానీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో నగరానికి ఉన్న నిరాశాజనకమైన అనుభవాన్ని బట్టి చూస్తే, ఇది సామాన్య బెంగళూరు వాసి వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ఎందుకంటే, ప్రాజెక్టుల కాలపరిమితులను ఎప్పుడూ పాటించరు. నగరంలోని రద్దీగా ఉండే స్టార్టప్ హబ్ అయిన కోరమంగళలో ట్రాఫిక్‌ను "సులభతరం" చేస్తుందని భావించిన 2.4 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవున్న ఎజిపుర ఫ్లైఓవర్‌ను 2017లో ప్రారంభించారు. ఇది దాదాపు దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు.

స్థానిక పరిపాలనలో అవినీతి ఆరోపణలు..

సంవత్సరాలుగా, బెంగళూరు ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎప్పుడూ సకాలంలో పూర్తి చేయదనే అపఖ్యాతిని సంపాదించుకుంది. స్థానిక పరిపాలనలో అవినీతిని నివేదికలు నిరంతరం బయటపెడుతున్నాయి. ఎస్.ఆర్. బొమ్మై నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో, ప్రాజెక్టులను క్లియర్ చేయడానికి రాజకీయ నాయకులు "40 శాతం కమీషన్" డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది.
ఆ తర్వాత వచ్చిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇదే విధమైన ఆరోపణ చేసింది. విచిత్రం ఏమిటంటే, గత ఐదు దశాబ్దాలలో విపరీతంగా అభివృద్ధి చెందిన బెంగళూరుకు మౌలిక సదుపాయాల విస్తరణ అవసరం. కానీ శివకుమార్‌కు సుపరిచితమైన, ఇప్పుడు ఆయన వారసత్వంగా పొందుతున్న పరిపాలనా సంస్కృతి, ఆయన వాగ్దానాలను, ప్రాజెక్టులను నెరవేర్చే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు.

కొత్త ప్రాజెక్టులు

అయినప్పటికీ, మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లు రానున్నాయి.రాబోయే కొన్నేళ్లలో సామర్థ్యానికి మించి రద్దీగా మారనున్న ప్రస్తుత అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా, ఒక కొత్త భారీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి చర్చ జరుగుతోంది.
శివకుమార్ నగరం దక్షిణ శివారు ప్రాంతమైన బిడదిలో ఒక భారీ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ కోసం ఒత్తిడి చేస్తున్నారు, ఇది కొంతమంది రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆయన బెంగళూరు మైసూరు మధ్య మరో ఎక్స్‌ప్రెస్‌వే గురించి కూడా మాట్లాడుతున్నారు.
మొదటి రోజే, కొత్త ముఖ్యమంత్రి నగర రోడ్ల కోసం ఏకంగా రూ. 2,000 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు, అవే రోడ్లను మెరుగుపరచడానికి, గుంతలను తొలగించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అనేక కోట్ల రూపాయలు మామూలుగానే మంజూరు చేశారు. ఆ డబ్బు చాలావరకు ఖర్చు చేశారు, కానీ రోడ్ల పరిస్థితి అలాగే ఉంది, లేదా మరింత అధ్వాన్నంగా మారాయి.
నిరాశావాదంగా అనిపించే ప్రమాదం ఉన్నప్పటికీ, బెంగళూరు నష్టానికి శివకుమార్ దార్శనికత కేవలం ఆశగా మిగిలిపోకుండా చూడటానికి, కేవలం కలలు ఆకాంక్షల కన్నా అసాధారణమైన తీవ్రమైన, నిబద్ధతతో కూడిన ప్రయత్నం అవసరం.


Read More
Next Story