భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తత తలెత్తిందా?
x

భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తత తలెత్తిందా?

అర్థరాత్రి మీడియా సమావేశంపై ఢాకా తీవ్ర ఆగ్రహం


పారుల్ చంద్ర..

న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మీడియా సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.

గత రెండేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా, ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది.

ఈ పరిణామంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హసీనాకు బహిరంగంగా మీడియాతో మాట్లాడే అవకాశం కల్పించడం తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధమని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే చర్యగా పేర్కొంది.

అంతేకాకుండా, పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాల ఆధారంగానే భారత్‌తో సంబంధాలు కొనసాగాలని ఢాకా స్పష్టం చేసింది.

హసీనా విలేకరుల సమావేశం నిర్వహించిన రోజు కూడా వివాదానికి కారణమైంది. ఆమె ప్రభుత్వం కూలిపోయిన వార్షిక దినాన ఈ సమావేశం జరగడం బంగ్లాదేశ్‌లో రాజకీయంగా మరింత సున్నితమైన అంశంగా మారింది. అక్కడ ఈ రోజును ప్రజా తిరుగుబాటు దినోత్సవంగా నిర్వహిస్తుండటంతో, హసీనా ప్రసంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ వ్యవహారం కారణంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశలు దెబ్బతిన్నాయి. వచ్చే నెలలో జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వం భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలకు ముందుకు వస్తుందా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూఢిల్లీ ఈ సమావేశం ప్రైవేట్ కార్యక్రమమని వివరణ ఇచ్చినప్పటికీ, అది ఢాకాను సంతృప్తిపరచలేకపోయింది. హసీనా రాజకీయ కార్యకలాపాలపై బంగ్లాదేశ్ గతంలో పలుమార్లు అభ్యంతరాలు తెలిపినా, భారత్ వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయం అక్కడ బలపడుతోంది.

దీంతో, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాల కంటే మాజీ ప్రధానికి రాజకీయంగా అవకాశం కల్పించడానికే భారత్ ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌పై భారత్ సానుకూలంగా స్పందించే అవకాశాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి.

సుమారు అరగంట పాటు సాగిన తన ప్రసంగంలో షేక్ హసీనా విద్యార్థి ఉద్యమ సమయంలో తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించుకున్నారు. తనను అధికారంలో నుంచి దించేందుకు విదేశీ శక్తుల మద్దతుతో కుట్ర జరిగిందని పరోక్షంగా ఆరోపించారు.

మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మహమ్మద్ యూనస్ సహా పలువురిపై విమర్శలు గుప్పించారు. అలాగే తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లో తిరిగి చురుకైన పాత్ర పోషిస్తాననే సంకేతాలు ఇచ్చారు.

హసీనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితి దేశీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా, భారత తూర్పు సరిహద్దు భద్రతపైనా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విదేశాంగ విధానంలో చైనా వైపు మరింతగా మొగ్గు చూపుతోంది. ఇటీవల చైనా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, విదేశాంగం-భద్రత అంశాలపై 2+2 చర్చలకు అంగీకరించడం వంటి పరిణామాలు భారత్ ఆందోళనకు కారణమయ్యాయి.

మోంగ్లా పోర్టు విస్తరణ, సమీప ఆర్థిక మండలి అభివృద్ధి, తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులకు చైనా మద్దతు కూడా ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాలను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు, తీస్తా జలాల పంపిణీ ఒప్పందం ఇంకా అమలులోకి రాకపోవడం కూడా బంగ్లాదేశ్‌ను చైనా వైపు మరింత ఆకర్షించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశీయ రాజకీయ సమీకరణలు కూడా రెహమాన్ ప్రభుత్వానికి సవాలుగా మారాయి. భారత్‌కు అనుకూలంగా కనిపించే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జమాత్-ఎ-ఇస్లామీ వంటి పార్టీల ఒత్తిడి మధ్య ప్రభుత్వం సమతుల్య వైఖరి పాటించాల్సిన అవసరం ఏర్పడింది.

మొత్తంగా చూస్తే, షేక్ హసీనా హయాంలో నెలకొన్న సన్నిహిత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, చైనా పెరుగుతున్న ప్రభావం, అంతర్జాతీయ శక్తుల పాత్ర నేపథ్యంలో న్యూఢిల్లీ కొత్త వాస్తవాలకు అనుగుణంగా తన విదేశాంగ వ్యూహాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

(ది ఫెడరల్ అన్ని వర్గాల వారీ అభిప్రాయాలను అందిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)

Read More
Next Story