సీదిరితో ములాఖ‌త్ లేకుండానే వెనుదిరిగిన వైఎస్ జ‌గ‌న్‌!
x
విశాఖ నుంచి అంపోలు వెళ్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల‌కు అభివాదం చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌..

సీదిరితో ములాఖ‌త్ లేకుండానే వెనుదిరిగిన వైఎస్ జ‌గ‌న్‌!

జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును ములాఖ‌త్ అవ్వాలనుకున్న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్యం నెర‌వేర‌కుండానే వెనుదిరిగారు.


శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కుమారుడి బైక్ యాక్సిడెంట్ వివాదం రాజ‌కీయ రంగు పులుముకుంది. కూట‌మి నాయ‌కులు, వైఎస్సార్‌సీపీ నాయ‌కుల మ‌ధ్య ర‌గ‌డ కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఇలా కొద్ది రోజులుగా ఉత్త‌రాంధ్ర‌లో ఈ వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. బైకు కేసు నుంచి కొడుకుని త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌యి అంపోలు జైలులో ఉన్న సీదిరిని ములాఖ‌త్ ద్వారా ప‌రామ‌ర్శిండానికి వైఎస్ జ‌గ‌న్ గురువారం తాడేప‌ల్లి నుంచి అంపోలు చేరుకున్నారు. కానీ అప్ప‌టికే ములాఖ‌త్ గ‌డువు ముగియ‌డంతో జ‌గ‌న్ వెనుదిర‌గాల్సి వచ్చింది.


విశాఖ నుంచి అంపోలు వెళ్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల‌కు అభివాదం చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌..

అస‌లేం జ‌రిగిందంటే..?

కొద్దిరోజుల క్రితం శ్రీ‌కాకుళం జిల్లా కాశీబుగ్గ‌లో సీదిరి అప్ప‌ల‌రాజు కుమారుడు అర‌వ్ బైక్‌పై వెళ్తూ ఓ వ్య‌క్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. తొలుత‌ బైక్ న‌డుపుతున్న అర‌వ్ స్థానంలో ఆయ‌న స్నేహితుడి పేరు చేర్చిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. త‌న కొడుకును కేసు నుంచి త‌ప్పించేందుకే మ‌రొక‌రి పేరును కుట్ర పూరితంగా చేర్చారంటూ కూట‌మి నాయ‌కులు ఆరోపించారు. దీంతో ఇది రాజ‌కీయ వివాదంగా మారి చివ‌ర‌కు సీదిరి అప్ప‌ల‌రాజుపై కుట్ర కేసు న‌మోదు చేసి శ్రీ‌కాకుళం జిల్లా అంపోలు జైలుకు త‌ర‌లించారు. అంత‌కుముందే నిందితుడైన సీదిరి కుమారుడు అర‌వ్‌ను కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారు. (రెండు రోజుల క్రిత‌మే అర‌వ్ బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు) ఈ వివాదం వైఎస్సార్‌సీపీ, కూట‌మి పార్టీల మ‌ధ్య పెను దుమారం రేపుతోంది.

ములాఖ‌త్‌లో సీదిరిని క‌ల‌వాల‌ని..

అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్ప‌ల‌రాజును ములాఖ‌త్ ద్వారా ప‌రామ‌ర్శించాల‌ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో ఆయ‌న గురువారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో తాడేప‌ల్లి నుంచి విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యానికి వచ్చారు. అనంత‌రం అక్కడ నుంచి విశాఖ‌లోని గోపాల‌ప‌ట్నం, వేప‌గుంట‌, ఆనంద‌పురం, త‌గ‌ర‌పువ‌ల‌స‌, భోగాపురం, శ్రీ‌కాకుళంల మీదుగా అంపోలుకు బ‌య‌లు దేరారు. దారి పొడ‌వునా వైఎస్సార్‌సీపీ శ్రేణులు జ‌గ‌న్ కాన్వాయ్‌ను నిలువ‌రిస్తూ జైజ‌గ‌న్ నినాదాలు చేశారు. దీంతో దారి పొడ‌వునా జ‌గ‌న్ ఆగుతూ, సాగుతూ సాయంత్రానికి అంపోలు చేరుకున్నారు. విశాఖ‌ప‌ట్నం నుంచి అంపోలుకు దాదాపు 120 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. సాధార‌ణంగా ఈ దూరం చేర‌డానికి గ‌రిష్టంగా రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అక్క‌డ‌కు చేరుకోవ‌డానికి దాదాపు ఆరు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది.

ములాఖ‌త్ స‌మ‌యం దాటిపోవ‌డంతో..

జైలు అధికారులు రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్ప‌ల‌రాజుతో వైఎస్ జ‌గ‌న్ ములాఖ‌త్‌కు సాయంత్రం 5 గంట‌ల లోపు స‌మ‌యాన్ని కేటాయించారు. అయితే జ‌గ‌న్ జైలుకు చేరుకునే స‌రికే ఆ స‌మ‌యం దాటిపోయింది. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం జైలు అధికారులు ములాఖ‌త్‌కు జ‌గ‌న్‌ను అనుమ‌తించ‌లేదు. దీనిపై వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు జైలు అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. అయిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు అనుమ‌తించ‌ని కార‌ణంగా ములాఖ‌త్‌కు జైలు అధికారులు స‌సేమిరా అన్నారు. దీంతో కొద్దిసేపు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చివ‌ర‌కు చేసేది లేక జ‌గ‌న్‌.. అక్క‌డే ఉన్న సీదిరి భార్య‌, కుమారుడిని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం అక్క‌డ నుంచి వెనుదిరిగి విశాఖ చేరుకున్నారు. అక్క‌డ నుంచి తాడేప‌ల్లికి ప‌య‌న‌మ‌య్యారు. మొత్త‌మ్మీద ఏ ల‌క్ష్యంతో ములాఖ‌త్‌కు వ‌చ్చారో ఆ ల‌క్ష్యం నెర‌వేర‌కుండానే వైఎస్ జ‌గ‌న్ వెనుదిర‌గాల్సి వచ్చింద‌న్న మాట‌! ఈ ప‌రిణామం వైఎస్సార్‌సీపీ శ్రేణుల‌ను నిరాశ‌కు గురిచేయ‌గా, కూట‌మి నాయ‌కుల‌కు మాత్రం ఆనందాన్నిచ్చింది.

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జ‌గ‌న్

మీడియాతో జ‌గ‌న్ ఏమ‌న్నారంటే?

ములాఖ‌త్ ర‌ద్దు కావ‌డంతో వైఎస్ జ‌గ‌న్ జైలు వ‌ద్దే మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..
` మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కుటుంబంపై చంద్ర‌బాబు స‌ర్కారు కుట్ర‌కు పాల్ప‌డింది. యాక్సిడెంట్‌ను హ‌త్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌కు తెర‌లేపింది. అస‌లు యాక్సిడెంట్ కేసును హ‌త్య కేసుగా ఎలా మారుస్తారు? రాష్ట్రంలో క‌క్ష సాధింపు రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. అనుకోని ప‌రిస్థితుల్లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే సీదిరి కుమారుడి జీవితాన్ని నాశ‌నం చేయాల‌ని చూడ‌డం ఎంత‌వ‌ర‌కు స‌రైంది? 18 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని నాశ‌నం చేస్తున్న చంద్ర‌బాబు గ‌డ్డి తింటున్నారా? మ‌నిషా? ర‌ఆక్ష‌సుడా? ఇదే టీడీపీ నేత‌లెవ‌రైనా చేస్తే ఇలాగే శిక్ష‌లు విధిస్తారా? ఇదే శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే, పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే యాక్సిడెంట్ చేస్తే ఈ కేసుల్లో ఎవ‌రిని అరెస్టు చేశారు? ఒక్కొక్క‌రికి ఒక్కోలా చేస్తే వ్య‌వ‌స్థ బ‌త‌క‌దు.

కులాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారు..
చంద్ర‌బాబు విష విత్త‌నాలు నాటుతున్నారు. కులాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు యాద‌వ మంత్రిని పంపి ర్యాలీలు చేస్తారా? చంద్ర‌బాబుకు పేద‌లంటే ప్రేమ లేదు. బీసీల‌ను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటారు. చ‌రిత్ర‌లో తొలిసారి యాద‌వ మ‌హిళ‌ను వైఎస్సార్‌సీపీ విశాఖ మేయ‌ర్‌గా చేస్తే చంద్ర‌బాబు కుట్ర‌తో ఆమెను దించేశారు. విశాఖ‌లో ఇటీవ‌ల స‌ముద్రంలో ప‌డ‌వ బోల్తాప‌డి ఆరుగురు మ‌త్స్య‌కారులు చ‌నిపోతే చంద్ర‌బాబు ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించాడు.

ఫిషింగ్ హార్బ‌ర్లను అమ్ముకుంటున్నారు..
రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బ‌ర్ల‌ను అమ్ముకుంటున్నాడు ఈ చంద్ర‌బాబు. మ‌త్స్య‌కారుల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాడు. సూప‌ర్ సిక్స్‌, సెవెన్ లేదు. అమ్మ ఒడి లేదు. నోరు తెరిస్తే అబద్దాలు. చేస్తే మోసాలు. ప్ర‌శ్నించిన వారిపై త‌ప్పుడు కేసులు. జీవినాలు నాశ‌నం అవుతాయ‌న్న జ్ఞానం లేదు. సీదిరి అప్ప‌ల‌రాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండ‌గా ఉంటుంది. ఆయ‌న విష‌యంలో న్యాయం గెలుస్తుంది. ` అని వైఎస్ జ‌గ‌న్ ముగించారు.
Read More
Next Story