
యూపీలో గాలి నాణ్యతపై యోగి ఏమన్నారు?
దేశరాజధానిని ‘గ్యాస్ చాంబర్’గా విమర్శించిన సీఎం..
దేశ రాజధాని ఢిల్లీ, తీవ్ర వాయు కాలుష్యంతో ‘గ్యాస్ చాంబర్’లా మారిందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ప్రజలు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అభివృద్ధి కోసం పర్యావరణాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని, యూపీ అభివృద్ధి నమూనా దీనికి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.
గోరఖ్పూర్ జిల్లా జంగల్ కౌరియా ప్రాంతంలో పునరుద్ధరించిన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (BDO) కార్యాలయాన్ని శనివారం (ఫిబ్రవరి 14) ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో వాతావరణాన్ని కాపాడుకుంటూనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తూ వృద్ధి సాధిస్తున్నామని తెలిపారు.
పర్యావరణం బాగుంటే.. ఆరోగ్యం బాగున్నట్లే..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో పర్యావరణ నష్టం ఒకటని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. “ఇక్కడ పర్యావరణం చాలా బాగుంది. కాలుష్యం లేకపోతే వ్యాధులు తక్కువగా ఉంటాయి. కాలుష్యం ఉన్న చోట ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. మన ఆక్సిజన్ సరఫరా దెబ్బతింటే, శరీరమంతా బాధపడుతుంది” అని పేర్కొన్నారు.
ఢిల్లీతో పోల్చిన యోగి..
ఈ పరిస్థితిని ఢిల్టీతో పోల్చిన సీఎం, “అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కళ్లలో మంట వస్తోంది. ఆస్తమాతో బాధపడేవారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఎలాంటి జీవితం?” అని ప్రశ్నించారు.
రైతులకు జీవనోపాధి కూడా..
కాంపియర్గంజ్లో ప్రతిపాదిత అటవీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకం కానుందని ముఖ్యమంత్రి అన్నారు. అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు రైతుల జీవనోపాధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ శ్రేయస్సుకు ఊతమిస్తుందని పేర్కొన్నారు.
కాంపియర్గంజ్లో ఏర్పాటు చేసిన రాబందుల సంరక్షణ కేంద్రం గురించి మాట్లాడారు. పౌరాణిక పాత్ర జటాయువును గుర్తు చేస్తూ, రసాయనాలు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
స్థానిక అభివృద్ధి పనుల గురించి..
జంగల్ కౌరియా బ్లాక్ గ్రామాలతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రతి గ్రామాన్ని తాను స్వయంగా సందర్శించానని, వరదలు వంటి పునరావృత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కలేసర్–జంగిల్ కౌరియా బైపాస్ ద్వారా లక్నో, కుషినగర్లకు కనెక్టివిటీ మెరుగుపడిందని, ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించామని తెలిపారు. శాశ్వత వరద నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మహంత్ అవైద్యనాథ్ జ్ఞాపకార్థం డిగ్రీ కళాశాల, స్టేడియం, రెజ్లింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గృహనిర్మాణం, మరుగుదొడ్లు, రేషన్, ఆరోగ్య సేవలు, పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయని చెప్పారు.
1962లో బ్లాక్ ప్రధాన కార్యాలయ స్థాపనలో కీలక పాత్ర పోషించిన మాజీ బ్లాక్ చీఫ్ దివంగత రాంపతి యాదవ్ సేవలను గుర్తుచేసుకుంటూ యోగి నివాళులర్పించారు. అనంతరం పునర్నిర్మాణ పనులను పరిశీలించి, కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారు.

