ఎన్డీయే వ‌చ్చాక ఆ ఆన‌వాయితీని మార్చేశాం
x
భోగాపురం విమానాశ్ర‌యం వేదిక‌పై ప్ర‌ధాని మోదీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేష్‌ల చిరునవ్వులు

ఎన్డీయే వ‌చ్చాక ఆ ఆన‌వాయితీని మార్చేశాం

ఎన్డీయే పాల‌న‌లో ఉడాన్ ప‌థ‌కం ద్వారా సామాన్య‌లు సైతం విమానాల్లో తిరిగే వీలు క‌ల్పించామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు.

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన గ‌త ప‌న్నెండేళ్ల‌లో విమాన‌యాన రంగంలో అసాధార‌ణ అద్భుతాలు చేశామ‌ని చెప్పారు. అంతేకాదు.. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు విమానాశ్ర‌యాల‌కు ఒక కుటుంబానికి చెందిన వారి పేర్లే పెట్టేవార‌ని, ఎన్డీయే వ‌చ్చాక ఆ ఆన‌వాయితీని మార్చేశామ‌న్నారు. ఇంకా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూట‌మి ప్ర‌భుత్వం డ‌బుల్ స్పీడుతో న‌డుస్తోంద‌న్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల సార‌ధ్యంలోపెట్టుబ‌డులు వెల్లువెత్తుతున్నాయ‌ని కితాబునిచ్చారు. ఈ స‌భ‌లో ప్ర‌ధానితో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర‌మంత్రి శ్రీ‌నివాస్ వ‌ర్మ‌, రాష్ట్ర మంత్రి లోకేష్‌లు కూడా మాట్లాడారు. వీరంతా ప్ర‌ధాని మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ఏమ‌న్నారంటే?


స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న చంద్ర‌బాబు

ఎన్డీయే వచ్చాక ఆ ఆన‌వాయితీ మార్చాం..

`` ఇది అల్లూరి సీతారామ‌రాజు న‌డ‌యాడిన నేల‌. త‌న జీవితాన్ని ఆదివాసీల కోసం అంకితం చేశారు. అలాంటి ప‌విత్ర భూమిపై అల్లూరి సీతారామ‌రాజు పేరుతో కొత్త ఎయిర్‌పోర్టు ఆవిర్భ‌వించింది. ఇది ఏపీ యువ‌త భ‌విష్య‌త్తుకు మేలు చేస్తుంది. గ‌తంలో ఒక కుటుంబం పేరిటే ఎయిర్‌పోర్టులుండేవి. ఎన్డీయే ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆ ఆన‌వాయితీని మార్చి గొప్ప వ్య‌క్తుల పేర్లు పెడుతున్నాం. గ‌త ప‌న్నెండేళ్ల‌లో దేశ విమాన‌యాన రంగంలో అసాధార‌ణ అద్భుతాలు జ‌రిగాయి. అంత‌కుముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులుంటే ఎన్డీయే వ‌చ్ఆక అవి 166కు పెరిగాయి. ఉడాన్ ప‌థ‌కం ద్వారా సామాన్యులు సైతం విమానాల్లో తిరిగే వీలు క‌ల్పించాం. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల సారథ్యంలో ఏపీలోని ఎన్డీయే ప్ర‌భుత్వం డ‌బుల్ స్పీడ్‌తో న‌డుస్తోంది.

మాట్లాడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

చంద్ర‌బాబును చూసే పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృషిని చూసే రాష్ట్రంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌లు పెట్టుబ‌డులకు ముందుకొస్తున్నాయి. ఏపీ ఒక పారిశ్రామిక గ్రోత్ కారిడారే కాదు.. న‌క్క‌ప‌ల్లిలో భారీ ఫార్మా కంపెనీ వ‌స్తోంది. దీంతో ఏపీ దేశంలోని ఒక ఫార్మా హ‌బ్‌గా మార‌బోతోంది. రాయ‌ల‌సీమ‌లో రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌తో పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తే రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టుల‌ను ప్రారంభించిన విష‌యాన్ని గ‌మ‌నించాలి. విశాఖ నుంచి కృష్ణ‌ప‌ట్నం వ‌ర‌కు పాత పోర్టుల ఆధునికీక‌ర‌ణ‌తో పాటు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేప‌ట్టాం. ఇంకా ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించాం. రాష్ట్రంలో ల‌క్ష‌ల కోట్ల‌తో రైల్వే ప‌నులు జ‌రుగుతున్నాయి. పెట్టుబ‌డుల నుంచి ఉపాధి క‌ల్పించడ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం`` అని ప్ర‌ధాని వివ‌రించారు.

స‌భ‌లో మాట్లాడుతున్న కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు

వెంటిలేట‌ర్‌పై ఉన్న ఏపీని నిల‌బెట్టారు : చంద్ర‌బాబు

`` రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వెంటిలేట‌ర్‌పై ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌ధాని మోదీ ఆక్సిజ‌న్ అందించి నిల‌బెట్టారు. విశాఖ ఉక్కును ఎవ‌రు నిల‌బెట్టారు? రైల్వే జోన్‌ను మంజూరు చేసి విభ‌జ‌న హామీని నెర‌వ‌ర్చింది ఎవ‌రు? పోల‌వ‌రం ప్రాజెక్టును గాడిన పెట్టిందెవ‌రు? రాజ‌ధాని ప‌నులు పునఃప్రారంభించింది ఎవ‌రు? ఇవ‌న్నీ చేసింది మోదీ కాదా? పోల‌వ‌రం పూర్తి చేసి ప్ర‌ధానితోనే ప్రారంభోత్స‌వం చేస్తాం. 2026 నాటికి అమ‌రావ‌తి మొద‌టి ద‌శ ప‌నులు పూర్తి చేసి మోదీతోనే ప్రారంభిస్తాం. రూ.5,641 కోట్ల వ్య‌యంతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జ‌రిగింది. ఈ ఎయిర్‌పోర్టు ఉత్త‌రాంధ్ర ద‌శ‌, దిశ‌ల‌ను మార్చేస్తుంది.

కొబ్బ‌రికాయ కొట్టింది.. గుమ్మ‌డికాయ కట్టింది మేమే..

భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2015లో ప్ర‌క‌ట‌న చేశాం. 2019లో శంకుస్తాప‌న చేశాం. నాడు కొబ్బ‌రికాయ కొట్టింది, నేడు గుమ్మ‌డి కాయ క‌ట్టిందీ మ‌న‌మే. ఈ ఎయిర్‌పోర్టుకు రైతులు భూములు మాత్ర‌మే కాదు. భ‌విష్య‌త్తును కూడా ఇచ్చారు. ఎర్ర‌బ‌స్సు కూడా రాని ఊరికి ఎయిర్‌పోర్టు ఎందుక‌ని కొంద‌రు (వైఎస్ జ‌గ‌న్‌) అవ‌హేళ‌న చేశారు. వారిప్పుడు అడ్ర‌స్ లేకుండా పోయారు. ఈ విమానాశ్ర‌యానికి ఈ ప్రాంతానికి చెందిన విప్ల‌వ వీరుడు అల్లూరి పేరు పెట్టాం. దీనిని నిర్మించింది ఉత్త‌రాంధ్ర వాసి జీఎమ్మార్‌. నిర్మాణ బాధ్య‌త‌ను తీసుకున్న‌ది ఈ ప్రాంత విమాన‌యాన‌శాఖ మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు. ఈనెల 14న గోదావ‌రి నీటిని అన‌కాప‌ల్లికి తీసుకొస్తాం. గోదావ‌రి, వంశ‌ధార న‌దుల‌ను అనుసంధానం చేస్తాం. దేశంలో ఎంద‌రో నాయ‌కులొచ్చినా ఒక్క న‌రేంద్ర మోదీ మాత్ర‌మే స‌రైన నాయ‌కుడు. 2047 నాటికి భార‌త్ ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ స్థానం సాధించ‌డం మోదీ వ‌ల్లే సాధ్యం. ఈ దేశ ప్ర‌జ‌ల‌కు నా విజ్ఞ‌ప్తి ఒక్క‌టే. న‌రేంద్ర మోదీ లేకుండా 2047 ని ఊహించ‌లేం`` అని చంద్ర‌బాబు ముగించారు.

యువ‌త‌కు సంస్కారం నేర్పించాలిః ప‌వ‌న్‌

`` ప్ర‌ధానిమోదీ దేశం కోసం ప‌డ్డ క‌ష్టం కొత్త త‌రానికి ఏం తెలుసు? ఆయ‌న ఒక్క రోజూ సెల‌వు తీసుకోలేదు. అలాంటిది జంత‌ర్‌మంత‌ర్‌లో మోదీని యువ‌త తిడుతుంటే క‌ళ్లంట నీళ్లొచ్చాయి. దేశం కోసం క‌ష్ట‌ప‌డే నేత‌కు మ‌నం ఇచ్చే గౌర‌వం ఇదా? ద‌ఏశంలో మోదీని క‌ట్టే నాయ‌కుడు లేడు. రాబోడు. పిల్ల‌ల్ని స‌రైన దారిలో పెట్ట‌డం, సంస్కారం నేర్పించ‌డం చాలా అవ‌స‌రం. త‌న‌ను తిట్టినా, దూషించినా ప్ర‌ధాని వారిని క్ష‌మించారు. అందుకు ప్ర‌ధానికి పాదాభివంద‌నం చేస్తున్నా. 140 కోట్ల మందిని న‌డ‌ప‌డం ఆషామాషీ కాదు. మీరు (ప్ర‌ధాని) వ‌ద్ద‌నుకున్నంత కాలం అధికారం మీ వ‌ద్ద‌నే ఉంటుంద‌ది. మీరు ప‌డ్డ క‌ష్టం ఎవ‌రూ ప‌డ‌రు. నేనెందుకు అల‌యెన్స్ కోసం త‌ప‌న ప‌డ్డానంటే దేశం కోసం పాటుప‌డే నాయ‌కుడికి అండ‌గా ఉండాల‌ని. భోగాపురం ఎయిర్‌పోర్టు రాక‌తో మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌స్తాయి. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీ దేశంలోనే అగ్ర‌గామిగా అవ‌త‌రిస్తుంది`` అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

భోగాపురం వైపు ప్ర‌పంచం చూపుః రామ్మోహ‌న్‌నాయుడు

`` ఇన్నాళ్లూ ఉత్త‌రాంధ్ర వాసులు ఉపాధి కోసం ప్ర‌పంచం వైపు చూసేవారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చాక ఇక ప్ర‌పంచ‌మే ఉత్త‌రాంధ్ర వైపు చూస్తుంది. ఎంద‌రికో ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి. ఏవియేష‌న్ ట్రైనింగ్ కూడా ఇక్క‌డే ఇవ్వ‌వ‌చ్చు. ఉత్త‌రాంధ్ర‌లోని అన్ని ప్రాంతాల‌కూ ఇదే సింహ‌ద్వారం అవుతుంది. ఏపీ అభివృద్ధికి భోగాపురం ద్వారం తెరుస్తుంది. ఉత్త‌రాంధ్ర దిశ‌నే మార్చేస్తుంది.`` అని కేంద్ర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.

న‌మో అంటే నాయుడూజీ.. మోదీజీః లోకేష్‌
న‌మో అంటే న‌రేంద్ర మోదీ అనే ఇన్నాళ్లూ అంద‌రికీ తెలుసు. అయితే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వ స‌భ‌లో న‌మోకు స‌రికొత్త భాష్యం చెప్పారు. ఆయ‌న ఏమ‌న్నారంటే.. `` ఏపీలో న‌మో అంటే నాయుడూజీ.. మోదీజీ.. వీరిద్ద‌రి సార‌ధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది. విశాఖ ఉక్కును కాపాడింది మ‌న న‌మో. గూగుల్‌, ఆర్సెలార్ మిట్ట‌ల్ వంటి వాటిని తెచ్చిందీ మ‌న న‌మో. ఎర్ర బ‌స్సు రాని చోట ఎయిర్‌పోర్టు ఎందుక‌ని హేళ‌న చేసిన వారు ఇప్పుడు చూడండి. ఉత్త‌రాంధ్ర దెబ్బ అర్థ‌మైందా రాజా? ఈ నేల‌కు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి అయితే.. ఈ ప్రాంతానికి అభివృద్ధి తెచ్చింది ప్ర‌ధాని మోదీ అని పేర్కొన్నారు లోకేష్‌.
Read More
Next Story