
త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి.. ఆత్మహత్యగా అనుమానం
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధంకర్ సోమవారం అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన కార్యాలయంలో చనిపోయి కనిపించారు. ఈ ఘటనను పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. అయితే, ఆయన మరణం ఎలా జరిగిందనే విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారని చెబుతుండగా, మరికొందరు ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అనురాగ్ ధంకర్ను వెంటనే అగర్తలాలోని జీబీ పంత్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం 12:48 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మరణానికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.
1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ధంకర్, 2025 మేలో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో త్రిపుర పోలీస్, సీబీఐలో కీలక బాధ్యతలు నిర్వహించి అనేక ప్రముఖ దర్యాప్తులకు నాయకత్వం వహించారు. ఆయనకు విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ పతకం కూడా లభించింది. కొసావోలో ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో కూడా పనిచేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మాణిక్ సాహా, ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

