
కేరళ: త్రిస్సూర్ జిల్లాలో బాణసంచా పేలుడు..
ఎనిమిది మంది మృతి, 40 మందికి పైగా గాయాలు..
కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో ఒక బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. దారి ఇరుకుగా ఉండటంతో బాణాసంచా తయారీ కేంద్రం వద్దకు చేరుకోడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డాయి. సమీపంలోని వరి పొలాల గుండా వెళ్లి అక్కడికి చేరుకోగలిగారు. గాయపడిన వారిని వెంటనే త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
‘మెరుగైన వైద్యం అందించాలి’
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే రాష్ట్రం వెలుపల నుంచి వైద్య నిపుణులను రప్పించాలని ఆదేశించారు. గాయపడ్డ 40 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

