
పెల్లెట్ గన్ కలకలం.. ఓ విద్యార్థి కంటి చూపుకు ముప్పు?
ఢిల్లీలో సీజేపీ నిరసన సందర్భంగా గాయపడిన 19 ఏళ్ల యువకుడు కుడి కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీలో జూలై 20న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెల్లెట్ గన్ కాల్పుల్లో అతనికి కంటి, ముఖం, ఛాతీ భాగాల్లో గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీస్ అధికారి కావాలన్న లోచాబ్ కల నెరవేరకుండాపోయింది.
శరీరమంతా పెల్లెట్ గాయాలే..
లోహంతో తయారైన పెల్లెట్లు సాహిల్ శరీరానికి తాకడంతో ముఖం, మెడ, ఛాతీ, భుజం, చేతికి గాయాలయ్యాయి. ఒక పెల్లెట్ కుడి కంటిలో ఇరుక్కుపోవడంతో కార్నియా దెబ్బతిన్నట్లు సమాచారం. మరో పెల్లెట్ ఊపిరితిత్తుల సమీపంలో గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
వరుస శస్త్రచికిత్సలు..
గాయపడిన వెంటనే సాహిల్ను లేడీ హార్డింగ్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సఫ్దర్జంగ్, అనంతరం ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. ఇప్పటికే ఒక శస్త్రచికిత్స జరిగింది. మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మొదట చూపు తిరిగి వచ్చే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని చెప్పిన వైద్యులు, ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
అయితే నిరసనకారులపై పెల్లెట్ గన్లు వాడినట్లు వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. అలాంటి సమాచారం అవాస్తవమని, ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజకీయ దుమారం..
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్లు ప్రయోగించారన్న అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.
తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు, నిరాయుధ విద్యార్థులపై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించాయి. మరోవైపు, పోలీసులు తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

