
హైబ్రిడ్ మోడ్: ఆన్ లైన్ జోరు, హోరెత్తుతున్న టీడీపీ 'మహానాడు'
తెలుగుదేశం పార్టీ వార్షిక పండగ ‘మహానాడు-2026’ సరికొత్త హంగులతో, అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు సాగనున్న ఈ పసుపు పండుగకు ఈసారి సాంకేతికత జోడించి డిజిటల్, హైబ్రిడ్ విధానంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్కు నివాళి.. పార్టీ జెండా ఆవిష్కరణ
ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి మహానాడును అధికారికంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, ముఖ్య స్పీకర్లు పాల్గొన్నారు.
'హైబ్రిడ్ మహానాడు'.. 1875 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లు
గతానికి భిన్నంగా ఈ ఏడాది మహానాడును పూర్తి హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తుండడం విశేషం. మంగళగిరి ప్రధాన వేదిక నుంచి సాగే ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేలాది మంది శ్రేణులు వీక్షిస్తున్నారు. 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఆన్లైన్ ద్వారానే నేరుగా ముఖ్య నేతల ప్రసంగాలను వినేలా ఐటీ విభాగం పక్కా ఏర్పాట్లు చేసింది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ పండుగతో ఆన్లైన్ వేదికలన్నీ పసుపుమయంగా మారాయి.
'స్త్రీ శక్తి' థీమ్.. మొదటిరోజు ప్రధాన ఎజెండా ఇదే!
ఈసారి మహానాడులో సరికొత్తగా 'స్త్రీ శక్తి' థీమ్ను ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ థీమ్ను డిజైన్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న మొదటి రోజు డిబేట్లలో ప్రధానంగా నాలుగు అంశాలపై తీర్మానాలు, సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి.
స్త్రీ శక్తి: మహిళ సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యత.
కార్యకర్తే అధినేత: పార్టీ కోసం కష్టపడిన క్యాడర్కు గుర్తింపు.
యువగళం: యువతరం పాత్ర, భవిష్యత్తు కార్యాచరణ.
పేదల సేవలో: ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరు.
శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. రాబోయే రెండేళ్ల రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ డిజిటల్ మహానాడు పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Next Story

