
ఆంధ్రా ఇవాళ అగ్నిగుండమే: గడప దాటితే గండమే!
ఎండలు పేలిపోతాయ్, బయటికి పోయి దెబ్బ తినకండి! పిడుగురాళ్లలో పదేళ్ల రికార్డు బద్దలు.. 48.1 డిగ్రీలు!
ఏపీ భగ్గు మంటోంది. ఎండలు ఇవాళా పేలిపోనున్నాయి. బయటికి పోయి దెబ్బ తినకండి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అక్షరాలా ఒక నిప్పుల కుంపటి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు... గాలిలో తేమ ఆవిరైపోయింది... ఎల్నినో ఎఫెక్ట్తో ఊపిరాడనంతగా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. "ఇల్లు దాటి బయటకొస్తే ప్రాణాలకే ప్రమాదం" అనే రేంజ్లో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది.
నిన్న మొన్నటి వరకు 45 డిగ్రీలకే అల్లాడిపోయిన జనం... ఇప్పుడు 48 డిగ్రీల మార్కును చూసి వణికిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఢిల్లీ వరకు ఒక భారీ హీట్ స్ట్రెచ్ ఏర్పడిందని, వచ్చే వారం రోజుల పాటు ఈ 'సూర్య తాండవం' ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు బాంబు పేల్చారు.
పిడుగురాళ్లలో పదేళ్ల రికార్డు బద్దలు..
రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పేరుకు తగ్గట్టే నిప్పుల పిడుగులు కురిపించింది. బుధవారం 47.6 డిగ్రీలు దాటిన పాదరసం... గురువారం ఏకంగా 48.1 డిగ్రీలకు చేరి 11 ఏళ్ల రికార్డులను తుడిచేసింది. ఇదే జిల్లా అచ్చంపేటలో 47.7 డిగ్రీలు నమోదైంది.
రాత్రయినా చల్లబడని కుంపటి:
సాయంత్రం ఆరు దాటితేనైనా ఉపశమనం లభిస్తుందనుకుంటే అదీ లేదు. రాత్రి 7 గంటల సమయంలో కూడా పల్నాడు జిల్లా మల్లాదిలో 42.4 డిగ్రీలు, గురజాలలో 42.3, మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిధిలో 42.3 డిగ్రీల సెగలు రేగాయి. రాత్రి పూట కూడా ఏసీలు, ఫ్యాన్లు వేడి గాలినే కక్కుతున్నాయి.
వడదెబ్బకు ఇద్దరు బలి..
ఈ అగ్నిగుండం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవించే ఎల్.రఘు(30) అనే యువకుడు, అలాగే తెర్లాం మండలం నందిగాంలో ఉపాధి హామీ కూలీగా వెళ్లిన గుల్లిపల్లి తౌడమ్మ(62) వడదెబ్బకు గురై గురువారం కన్నుమూశారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7 నుంచి 8 డిగ్రీలు అధికంగా నమోదు కావడమే ఈ దారుణానికి కారణం.
200 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన సెగలు
రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 200 మండలాల్లో సూర్యుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. 47 డిగ్రీల మార్కు దాటిన కొన్ని ముఖ్య ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
బాపట్ల జిల్లా వేటపాలెం: 47.6°C
కృష్ణా జిల్లా నందివాడ: 47.6°C
కృష్ణా జిల్లా నందిగామ: 47.4°C
ప్రకాశం జిల్లా అద్దంకి: 47.4°C
ఏలూరు జిల్లా చింతలపూడి: 47.3°C
మార్కాపురం జిల్లా నందనమారెళ్ల: 46.6°C
విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్, షీలానగర్ ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం వేళ జనాల్లేక కర్ఫ్యూను తలపిస్తూ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఇవాళ 219 మండలాల్లో హెచ్చరిక!
విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారానికి సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 15 మండలాల్లో 'తీవ్ర వడగాలులు', మరో 219 మండలాల్లో వడగాలులు వీస్తాయి.
45 నుంచి 47 డిగ్రీలు నమోదు కాగల జిల్లాలు: అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం.
రాయలసీమ, నెల్లూరులో స్వల్ప ఊరట: ఉపరితల ఆవర్తన ప్రభావంతో నెల్లూరు, రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
హాస్పిటల్స్ బయట బంధువుల నరకం!
విజయవాడలో ఎండలు 45 డిగ్రీలు దాటేయడంతో పాత ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కి వచ్చే రోగుల బంధువుల పరిస్థితి ఘోరంగా తయారైంది. గర్భిణులను ప్రసవాల కోసం లోపల జాయిన్ చేస్తే... తోడుగా వచ్చిన సహాయకులు బయట చెట్ల నీడన, ఎండ సెగలకు అల్లాడిపోతున్నారు. లోపల ఉన్న రోగుల కంటే బయట ఉన్న సహాయకులే వడదెబ్బ బారిన పడేలా ఉన్నారు. కనీసం తాగునీరు, చలువ పందిళ్లు కూడా లేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో తుపాన్లు, అల్పపీడనాలు లేకపోవడం వల్లే ఈ అసాధారణ వేడి పెరుగుతోంది. రాబోయే 10 రోజులు ఇదే ట్రెండ్ ఉంటుంది. కాబట్టి... అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రాకండి. మజ్జిగ, ఓఆర్ఎస్, మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ ప్రాణాలను కాపాడుకోండి!
Next Story

