
అయోధ్య రామ మందిర ట్రస్ట్పై SIT దూకుడు..
5 ఏళ్ల ఖాతాల రీ-ఆడిట్..
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విచారణలో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో, గత ఐదేళ్ల శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాలను మళ్లీ ఆడిట్ చేయనుంది.
ఈ పునః ఆడిట్లో ఆలయ నిర్మాణానికి చేసిన ఖర్చులు మాత్రమే కాకుండా, భక్తులు ఇచ్చిన బంగారం, వెండి, నగదు, ఆభరణాల విరాళాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ నిర్వహణకు సంబంధించిన పలువురిని SIT విచారించింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయగా, జూలై 6న జరిగే ట్రస్ట్ సమావేశంలో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దర్యాప్తులో రూ.77 లక్షలకు పైగా నగదు, 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "రామరాజ్య కోష్" పేరుతో ఉన్న విరాళాల పెట్టెను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దర్యాప్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, తప్పు చేసినవారికి చట్టం, దేవుడు ఇద్దరూ శిక్షిస్తారని అన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

