
‘సంఘ్ అడిగితే పదవి నుంచి తప్పుకుంటా’
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంఘ్చాలక్ మోహన్ భగవత్(Mohan Bhagwat) అన్నారు. సంఘ్ అడిగితే వెంటనే వైదొలుగుతానని, అయితే నన్నే పదవిలో కొనసాగాలని సంస్థ కోరుతోందని చెప్పారు. ముంబైలో జరిగిన RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంఘ్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవని, ప్రాంతీయ–విభాగ స్థాయి నాయకులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సాధారణంగా 75 ఏళ్లు పైబడిన వారు పదవులు చేపట్టరాదన్న నిబంధన ఉందన్నారు.
‘ఉత్తమ హిందువయితే చాలు..’
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎంపికలో కులానికి ప్రాధాన్యం లేదని, “ఉత్తమ హిందువు” అయి ఉండడమే ప్రమాణమని భగవత్ స్పష్టం చేశారు. బ్రాహ్మణుడు కావడం అర్హత కాదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైనా అర్హులే అని చెప్పారు. సంఘ్ ప్రారంభ దశలో బ్రాహ్మణుల ఆధిక్యం ఉండటంతో అలా ముద్ర పడిందని, ప్రస్తుతం అన్ని వర్గాలకూ ప్రతినిధ్యం ఉందని చెప్పారు.
బంగ్లాదేశ్ హిందువులకు మద్దతు..
బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారు అక్కడే ఉండి తమ హక్కుల కోసం పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు లభిస్తుందని భగవత్ పేర్కొన్నారు. అక్కడి మైనారిటీలపై దాడులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ చొరబాట్లపై..
దేశంలో జనాభా మార్పులను గత ప్రభుత్వాలు ఎదుర్కోలేదని భగవత్ చెప్పారు. పెరుగుతున్న జనన రేట్లు, అక్రమ వలసలు ప్రధాన కారణాలని చెప్పారు. చొరబాటుదారులను గుర్తించి చట్టపర చర్యలు తీసుకోవాలని, పౌరులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల సవరణలో పౌరులు కాని వారి పేర్లు తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నైతిక విలువల కోసమే..
ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం కేవలం ప్రచారం కోసం కాదని, విలువలు నేర్పడానికేనని భగవత్ స్పష్టం చేశారు. అతి ప్రచారం అహంకారానికి దారితీస్తుందని, ప్రచారం అవసరమైనంత మాత్రమే ఉండాలన్నారు. సంస్థలో పదవీ విరమణ అనే భావన లేదని సరదాగా వ్యాఖ్యానించారు.
‘ఏ కులాన్ని లక్ష్యంగా చేసుకోలేదు..’
ముస్లిం ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవకుల పనిపై ప్రశ్నించగా.. సంఘర్షణను నివారించడమే తమ విధానమని భగవత్ చెప్పారు. కించపరిచే మాటలు వచ్చినా ప్రతిస్పందించకపోవడం ద్వారా ఘర్షణలు తగ్గుతాయన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ కులం లేదా సమాజాన్ని లక్ష్యంగా చేసుకోదని, భౌగోళిక ప్రాతిపదికన పనిచేస్తుందని స్పష్టం చేశారు.

