
న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం
New Delhi | మే ఒకటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
న్యూడిల్లీ వెంకటేశ్వర ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ అంకురార్పణ
తిరుమల శ్రీవారి తరహాలోనే న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీ నుంచి తొమ్మది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఏప్రిల్ 30వ తేదీ టీటీడీ వేదపండుతుల ద్వారా అంకురార్పణం చేయనున్నారు.
తిరుమల తరువాత దేశంలోని ప్రధాన నగరాల్లో శ్రీవారి ఆలయాల తోపాటు సమాచార కేంద్రాలు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అందులో న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఈ నెల 28వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే నెల ఒకటో తేదీ తొమ్మిది గంటల నుంచి 10.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాలు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత మే నెల పదో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
వాహన సేవల వివరాలు
మే ఒకటో తేదీ: ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం
రెండో తేదీ: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
మూడో తేదీ: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
నాల్గవ తేదీ:ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
ఐదో తేదీ: ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం
ఆరో తేదీ: ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
ఏడో తేదీ: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
ఏనిమిదో తేదీ: ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
తొమ్మిదో తేదీ: ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
Next Story

