మాస్ మహరాజా.. రోడ్సైడ్ టిఫిన్, టీ కొట్టు వద్ద చాయ్తో జోష్
నెల్లూరు వీధుల్లో మంత్రి నారాయణ మార్క్ పొలిటికల్ ధమాకా..
స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగకముందే నెల్లూరులో రాజకీయ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. జనంతో కలవడానికి నగర ఎమ్మెల్యే, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జోరు పెంచారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి అభివృద్ధి పనులతో ప్రతిపక్షానికి సవాల్ విసురుతున్నారు. ఆయనకు తమ్మడు గిరిధర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణతో జోరుగా అడుగులు వేస్తున్నారు.
నెల్లూరు నగరం తొమ్మిదో డివిజన్లోని నవాబుపేట శివాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన బంగ్లాతోట పార్క్, అత్యాధునిక AC మినీ ఫంక్షన్ హాల్ను ఘనంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఆ తర్వాత వీధిబాట పట్టారు. నగరంలో సరికొత్త రాజకీయ ఉత్సాహాన్ని నింపారు. దీనికి ముందు..
నెల్లూరు నగరంలో ఏడు వేల మంది విద్యార్ధినులకు సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా మంత్రి నారాయణ తల్లిదండ్రు అభిమానం చూరగగొనే యత్నం చేశారు. వీధుల్లో కనీస వసతులు మెరుగు పరచడం, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం మంత్రి నారాయణ వీధుల్లోకి వచ్చి విలక్షణ శైలితో జనాన్ని ఆకట్టుకునే కార్యక్రమాలకు తెరతీశారు.
రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ కు వెళ్లారు. ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ రుచి చూశారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు, స్థానిక ప్రజలకు కూడా టిఫన్ తోపాటు టీ గ్లాసులు అందించి రుచి చూడాలని కోరూతూ ఎన్నికల సిత్రాలకు తెరతీసే తరహాలో ఆయన మాస్ మార్కు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రొటోకాల్ పక్కన పెట్టి..
మంత్రి హోదాను పక్కన ఉంచిన నారాయణ ఆదివారం మాస్ లీడర్ గా మారారు. అధికారిక హంగామా పక్కనపెట్టి, నేరుగా నవాబుపేట వీధుల్లోకి అడుగుపెట్టిన మంత్రి నారాయణ... స్థానిక ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. కాన్వాయ్ను వదిలేసి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ, రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారుల వద్ద స్వయంగా ఆగి వారి యోగక్షేమాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఒక చిన్న టిఫిన్ సెంటర్లో సాధారణ పౌరుడిలా కూర్చుని వేడి వేడి టిఫిన్ ఆస్వాదించడం, ఆపై టీ కొట్టు వద్ద నిలబడి స్థానిక నాయకులతో కలసి సరదాగా చాయ్ తాగుతూ ముచ్చటించడం నగరవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు నగర అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతూనే, మరోవైపు ఇలా నేరుగా జనంతో మమేకమై వారి మనసులు గెలుచుకోవడం వెనుక రానున్నే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనంలోకి రావడానికి మరింత జోరు పెంచారా? అనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.

