
ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధమన్న రక్షణ మంత్రి
భారత్ తన సొంత షరతులపైనే ఆపరేషన్ సింధూర్ను స్వచ్ఛందంగా నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే పాకిస్థాన్పై సుదీర్ఘ యుద్ధానికి కూడా భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30న నిర్వహించిన జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ను ఆపడం అంటే భారత్ సామర్థ్యం తగ్గిందని కాదు, అది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయం,’’ అని పేర్కొన్నారు.
“మా సామర్థ్యాలు తగ్గినందువల్ల ఆపరేషన్ను ఆపలేదు. మేమే స్వచ్ఛందంగా, ఆపాం. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం” అని సింగ్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడి చేసిన వారినే భారత సైన్యం లక్ష్యంగా చేసుకుందని, తమ ప్రతిస్పందన స్పష్టంగా, కచ్చితంగా ఉండిందని తెలిపారు.
భారతదేశానికి అవసరమైనప్పుడు తన రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకునే “సర్జ్ కెపాసిటీ” ఉందని సింగ్ వివరించారు.
“ఆకస్మిక పరిస్థితుల్లో మా రక్షణ సామర్థ్యాన్ని విస్తరించుకునే శక్తి మాకు ఉంది. అది ఇప్పుడు మరింత బలంగా మారింది” అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా భారతదేశం తన ప్రతిస్పందన విధానంలో మార్పు తీసుకువచ్చిందని సింగ్ పేర్కొన్నారు. గతంలో ఉగ్రదాడులపై కేవలం దౌత్య ప్రకటనలకే పరిమితమయ్యే ధోరణి ఇకపై ఉండదని ఆయన స్పష్టం చేశారు.
“మన గడ్డపై ఉగ్రదాడి జరిగితే కేవలం ప్రకటనలతో సరిపెట్టుకునే పాత విధానం ఇక లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి ఇది స్పష్టమైంది” అని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రభుత్వం నిర్ణయించిందని సింగ్ పేర్కొన్నారు.
ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, అది బహుముఖ సమస్య అని ఆయన వివరించారు. కార్యాచరణ, సైద్ధాంతిక, రాజకీయ కోణాల్లో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
పాకిస్థాన్కు స్ట్రాంగ్ వార్నింగ్..
“పాకిస్థాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది. భారత్ ఐటీ శక్తిగా ఎదిగితే, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారింది” అని అన్నారు.
భారత సైనిక పారిశ్రామిక వ్యవస్థ శాంతి కాలంలోనే కాదు, యుద్ధ సమయంలో కూడా వేగంగా సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. అణు బెదిరింపులకు కూడా భారత్ లొంగదని స్పష్టం చేశారు.
“మమ్మల్ని అణుదాడితో బెదిరించినా, మేము వెనక్కి తగ్గలేదు” అని సింగ్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్ తన రక్షణ విధానంలో దృఢత్వాన్ని మరోసారి ప్రదర్శించింది.

