అమరావతి కౌలు రైతులకు న్యాయం జరిగినట్లేనా?
x

అమరావతి కౌలు రైతులకు న్యాయం జరిగినట్లేనా?

ఆలస్యం అవుతున్న చెల్లింపులు, సాంకేతిక సమస్యలు కారణం.


రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS 1.0) కింద స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించిన రైతులకు వార్షిక కౌలు (యాన్యుయిటీ) చెల్లింపుల్లో APCRDA కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 17,718 మంది రైతుల ఖాతాల్లో రూ.138.46 కోట్లు (రూ.138,46,15,594) జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

LPS 1.0 కింద మొత్తం 27,811 మంది రైతులు కౌలు చెల్లింపులకు అర్హులుగా ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ.214.46 కోట్లు అందించాల్సి ఉంది. ఇప్పటికే 23,932 మంది రైతులకు సంబంధించి రూ.145.93 కోట్లు ఖరారు చేయగా, మిగిలిన 3,879 మంది రైతులకు రూ.68.53 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

ఆలస్యానికి కారణాలు ఏమిటి?

APCRDA అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం, కొన్ని కేసుల్లో సాంకేతిక, డాక్యుమెంటరీ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది.

NPCI లింకేజ్ సమస్యలు

e-KYC వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం

బ్యాంక్ ఖాతాలు నిష్క్రియంగా మారడం

మరణించిన రైతుల వారసులు అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం

భూమి బదిలీలు, విక్రయాల వల్ల యాజమాన్య మార్పులు

ఈ నేపథ్యంలో 2,800 ఇనాక్టివ్ ఖాతాలు గుర్తించినట్లు APCRDA తెలిపింది. వీటికి సంబంధించి రూ.30.41 కోట్లు ఉన్నాయి. ఈ జాబితాను APCRDA అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

రైతులకు ఏం చేయాలి?

అధికారులు రైతులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వెంటనే సమీప బ్యాంకు శాఖలను సంప్రదించి e-KYC పూర్తి చేయాలి. ఖాతాలను యాక్టివ్ చేసి NPCI లింకేజ్ పునరుద్ధరించాలి. వారసులు ఉన్న వారు సంబంధిత పత్రాలు (మ్యూటేషన్, నామినేషన్) సమర్పించాలని సూచించారు.

వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే మిగిలిన అర్హులైన అందరి ఖాతాల్లోకి కౌలు మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ చేస్తామని APCRDA పునరుద్ఘాటించింది.

ప్రభుత్వ వైఖరి

ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రైతులను భాగస్వాములుగా చూస్తోంది. వారి ఆర్థిక భద్రత కోసం వార్షిక కౌలు చెల్లింపులను వేగవంతం చేసేందుకు బ్యాంకులు, లబ్ధిదారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

అమరావతి నిర్మాణంలో తమ భూముల ద్వారా కీలక త్యాగం చేసిన రైతులకు గౌరవప్రదమైన ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పాలకులు చెబుతున్నారు. అయితే, సాంకేతిక సమస్యలను రైతులు కూడా సహకరించి త్వరగా పరిష్కరిస్తే చెల్లింపులు మరింత వేగంగా జరుగుతాయని అధికారులు వ్యాఖ్యానించారు.

Read More
Next Story