
ఢిల్లీలో మెట్రో సేవలకు అంతరాయం
సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు స్టేషన్లు మూసివేసిన పోలీసులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం, సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే మెట్రో స్టేషన్లు మూసివేశారు.
సోమవారం జాతీయ రాజధానిలోని పలు మెట్రో స్టేషన్లలో గందరగోళం నెలకొంది. దీంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోగా, చాలామంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
రాజధానిలోని అత్యంత రద్దీగా ఉండే ఇంటర్చేంజ్ స్టేషన్లలో ఒకటైన రాజీవ్ చౌక్లో, మూసివేసిన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రయాణికులు గుమిగూడి కనిపించారు. పటేల్ చౌక్ స్టేషన్లో, జంతర్ మంతర్ వద్ద ఉన్న సీజేపీ నిరసన ప్రదేశానికి వెళ్తున్న వారిని చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది స్వల్పంగా బలప్రయోగం చేశారు. ప్రవేశ మార్గాలను మూసివేసిన తర్వాత, పలువురు ప్రయాణికులు బారికేడ్లు, తాళం వేసిన గేట్లను దాటి స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
జనపథ్ మెట్రో స్టేషన్ వెలుపల, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు మూసివేసిన గేట్ల వద్ద గుమిగూడి, భద్రతా సిబ్బంది నుంచి సమాచారం కోసం వేచి ఉన్నారు. "సోమవారం రద్దీని తప్పించుకోవడానికి నేను మామూలు కన్నా దాదాపు గంట ముందే ఇంటి నుంచి బయలుదేరాను. కానీ ఇప్పుడు నేను మరో మెట్రో స్టేషన్కు నడవాలి. నా ఆఫీసుకు చేరుకోవడానికి నాకు కనీసం మరో 30 నుండి 40 నిమిషాలు పడుతుంది," అని అమిత్ శర్మ అనే ప్రయాణికుడు చెప్పారు.
ఇద్దరు సహ విద్యార్థులతో కలిసి జన్పథ్ స్టేషన్కు వచ్చిన కళాశాల విద్యార్థిని రియా వర్మ మాట్లాడుతూ.. స్టేషన్ మూసివేతతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. "మేము స్టేషన్కు చేరుకునేసరికి గేట్లు తాళం వేసి ఉన్నాయి. కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మేము కళాశాలకు చేరుకోవడానికి మరో మార్గం కోసం ప్రయత్నిస్తున్నాము," అని ఆమె అన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాజీవ్ చౌక్, జన్పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు సోమవారం ఉదయం ఎక్స్ లో DMRC ప్రకటించింది.
పార్లమెంటుకు సీజేపీ ప్రతిపాదిత పాదయాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ మూసివేత జరిగింది. చాలా మంది ప్రయాణికులు నావిగేషన్ యాప్లను తనిఖీ చేయడం, సహోద్యోగులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం లేదా మెట్రో సిబ్బంది.. పోలీసు సిబ్బందిని దారి అడగడం కనిపించింది. సెంట్రల్ ఢిల్లీ అంతటా భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో, చాలామంది సమీపంలోని ఆపరేషనల్ స్టేషన్ల వైపు నడవగా, మరికొందరు బస్సులు, ఆటో-రిక్షాలు, క్యాబ్లను ఎంచుకున్నారు.
Next Story

