సింహ‌`గిరి ప్ర‌ద‌క్షిణ‌` తో పుల‌కించిన భ‌క్త‌జ‌నం!
x
సింహ‌గిరి పుర‌వీధుల్లో క‌దులుతున్న‌ నార‌సింహుని పుష్ప‌ర‌థం

సింహ‌`గిరి ప్ర‌ద‌క్షిణ‌` తో పుల‌కించిన భ‌క్త‌జ‌నం!


ఓం న‌మో నార‌సింహా.. గోవిందా హ‌రి గోవిందా.. హ‌రేరామ హ‌రేరామ‌.. హ‌రేకృష్ణ హ‌రేకృష్ణ వంటి హ‌రినామ సంకీర్త‌న‌లు, నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో సింహ‌గిరి ప్ర‌ద‌క్షిణ మంగ‌ళ‌వారం అత్యంత అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. సింహాద్రి అప్ప‌న్న‌కు ప్రీత‌పాత్ర‌మైన త‌ప్పెట‌గుళ్లు, తోడ‌పెద్దుల ఊరేగింపులు, భాజా భ‌జంత్రీలు, పులివేషాలు, చెక్క భ‌జ‌న‌లు, కోలాటాలు, మేళ‌తాళాలతో 32 కిలోమీట‌ర్ల మేర మార్మోగిపోయింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తుజ‌నంతో కిక్కిరిసిపోయింది. సింహాచ‌లంతో పాటు విశాఖ న‌గ‌ర‌మంతా జ‌న‌సంద్రంగా మారిపోయింది. చీమ‌ల‌దండుని త‌ల‌పిస్తూ ముందుకు సాగుతోంది.


గిరి ప్ర‌ద‌క్షిణ చేస్తున్న భ‌క్తజ‌నం

గిరి ప్ర‌ద‌క్షిణ‌కు భ‌క్త‌జ‌న ప్ర‌వాహం..!
విశాఖ‌లోని సింహాచ‌లంలో కొలువైన శ్రీ‌వ‌రాహ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామికి ఆషాఢ‌ శుద్ధ చ‌తుర్ద‌శి నాడు గిరి ప్ర‌ద‌క్షిణ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ దేవ‌స్థానానికి చంద‌నోత్స‌వం త‌ర్వాత అత్యంత విశిష్టంగా నిర్వ‌హించేది ఈ గిరి ప్ర‌ద‌క్షిణే. ఈ సింహ‌గిరి చుట్టూ ఒక‌సారి ప్ర‌ద‌క్షిణ చేస్తే భూ ప్ర‌ద‌క్షిణ చేసినంత ఫ‌లం సిద్ధిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కంతోనే గిరి ప్ర‌ద‌క్షిణ‌కు ఇత‌ర జిల్లాల నుంచే కాదు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా భ‌క్తులు పోటెత్తుతుంటారు. స‌రిగ్గా 32 కిలోమీట‌ర్ల దూరం గిరి ప్ర‌ద‌క్షిణ చేసి స్వామి ఆశీస్సుల కోసం అర్రులు చాస్తుంటారు. ఈ గిరి ప్ర‌ద‌క్షిణ‌లో పిల్ల‌లు, యువ‌కులు, పెద్ద‌లు, వృద్ధులు, వ‌య‌సుతో ప‌నిలేకుండా ఒంట్లో ఓపిక ఉన్నా, లేకున్నా స్త్రీ పురుషులంతా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా గిరి ప్ర‌ద‌క్షిణ‌కు భ‌క్తులు పోటెత్తారు.గిరి ప్ర‌ద‌క్షిణ రోజున వ‌ర్షం కుర‌వ‌డం ఆన‌వాయితీ. అందుకనుగుణంగానే ఉద‌యం కొంత‌సేపు వ‌ర్షం కురిసింది. దీంతో వ‌రుణుడు ఇబ్బంది పెడతాడేమోన‌ని భ‌క్తులు ఒకింత ఆందోళ‌న చెందారు. అయితే మ‌ధ్యాహ్నానికి వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా మారి గిరి ప్ర‌ద‌క్షిణ‌కు స‌హ‌క‌రించింది.

గిరి ప్ర‌ద‌క్షిణ చేస్తున్న భ‌క్తజ‌నం

పుష్ప‌ర‌థం క‌ద‌లిక‌తో శ్రీ‌కారం..

ఆన‌వాయితీ ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు సింహాచ‌లం దేవ‌స్థానం అనువంశిక ధ‌ర్మ‌క‌ర్త‌, గోవా గ‌వ‌ర్న‌ర్ పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు సింహాచ‌లం తొలిపావంచా వ‌ద్ద కొబ్బ‌రికాయ కొట్టి స్వామి వారి పుష్ప‌ర‌థాన్ని ప్రారంభించి గిరి ప్ర‌ద‌క్షిణ‌కు శ్రీ‌కారం చుట్టారు. దీంతో భ‌క్తులంతా ఒక్క‌సారిగా గోవిందా.. నార‌సింహా అంటూ ముందుకు క‌దిలారు. దేవ‌స్థానానికి తూర్పు దిశ‌గా ఉన్న అడ‌వివ‌రం నుంచి ముడ‌స‌ర్లోవ‌, హ‌నుమంత‌వాక‌, విశాలాక్షిన‌గ‌ర్‌, జోడుగుళ్ల‌పాలెం, అప్పుఘ‌ర్‌, ఎంవీపీ డ‌బుల్ రోడ్డు, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాల‌నీ, సీత‌మ్మ‌ధార‌, బాల‌య్య‌శాస్త్రి లేఅవుట్‌, పోర్టు స్టేడియం, మాధ‌వ‌ధార‌, ఎన్ ఎస్ టీ ఎల్‌, ప్ర‌హ్లాద‌పురం, శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌ల మీదుగా తిరిగి సింహాచ‌లం చేరుకుంటున్నారు. వాస్త‌వానికి పుష్ప‌ర‌థం క‌ద‌లాడానికి ముందే వేకువ‌జాము నుంచే పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు గిర ప్ర‌ద‌క్షిణ మొద‌లు పెట్టారు.

తొలి పావంచా వ‌ద్ద భ‌క్తుల కోలాహ‌లం

8 ల‌క్ష‌ల మంది భ‌క్తులు పాల్గొంటార‌ని.

ఈ ఏడాది సింహ‌గిరి ప్ర‌ద‌క్షిణ‌లో దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల మంది భ‌క్తులు పాల్గొంటార‌ని అధికారులు అంచ‌నా వేశారు. అందుకు త‌గ్గ‌ట్టే ఏర్పాట్లు కూడా చేశారు. గిరి ప్ర‌ద‌క్షిణ జ‌రిగే దారి పొడ‌వునా 28 ప్రాంతాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 26 అంబులెన్స్‌లు, 33 వైద్య శిబిరాలు, 727 తాత్కాలిక మ‌రుగుదొడ్లు, 50 చోట్ల పార్కింగ్ సెంట‌ర్లను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల కోసం 400 వ‌ర‌కు ఆర్ట‌సీ బ‌స్సుల‌ను నడుపుతున్నారు. 50కి పైగా స్వచ్చంద సంస్థ‌లు సేవ‌లందిస్తున్నాయి. 114 తాగెనీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిరి ప్ర‌ద‌క్షిణ చేసే వారిలో కొంద‌రు భ‌క్తులు న‌గ‌రంలోని అప్పుఘ‌ర్‌, జోడుగుళ్లపాలెం వ‌ద్ద స‌ముద్రంలో స్నాన‌మాచ‌రిస్తుంటారు. అధికారులు ఈ ఏడాది స‌రికొత్త‌గా లుంబినీ పార్కు వ‌ద్ద తాత్కాలిక ష‌వ‌ర్ బాత్‌ల‌ను ఏర్పాటు చేశారు. గిరి ప్ర‌ద‌క్షిణ చేస్తున్న వారిలో ఆస‌క్తి ఉన్న వారు ష‌వ‌ర్ల కింద స్నానాలు చేస్తూ ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతున్నారు. మ‌రోవైపు గిరి ప్ర‌ద‌క్షిణ సంద‌ర్భంగా విశాఖ న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను మ‌ళ్లించారు. సుమారు ఐదు వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. గిరి ప్ర‌ద‌క్షిణ సంద‌ర్భంగా అధికారులు జిల్లాలోని 221 విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

లుంబినీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ష‌వ‌ర్ బాత్‌లు

భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌నం ఇలా..

మంగ‌ళ‌వారం రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు నృసింహ‌స్వామిని ద‌ర్శించుకునేందుకు అనుమ‌తిస్తారు. మ‌ళ్లీ బుధ‌వారం వేకువ‌జామున 4 నుంచి సాయంత్రం 3 వ‌ర‌కు, అనంత‌రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 వ‌ర‌కు ద‌ర్శ‌నాల‌కు వీలు క‌ల్పిస్తారు. బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి కొండ‌పై ఉన్న‌ సింహాద్రి అప్ప‌న్న ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌కు అవ‌కాశ‌మిస్తారు.

భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంచుతున్న దృశ్యం

అప‌రిమితంగా ప్ర‌సాద విత‌ర‌ణ‌..

ఏటా గిరి ప్ర‌ద‌క్షిణ చేసే భ‌క్తుల‌కు వివిధ స్వ‌చ్చంద సంస్థ‌లు, దుకాణ‌దారులు, దాత‌లు పెద్ద ఎత్తున ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తుంటారు. ప్ర‌ద‌క్షిణ జ‌రిగే మార్గం పొడ‌వునా వంద‌ల సంఖ్య‌లో ఫుడ్ కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించారు. భ‌క్తుల‌కు భోజ‌నం, పులిహోర‌, చ‌క్కెర పొంగ‌లి, ద‌ద్దోజ‌నం, పాలు, బిస్కెట్లు, మ‌జ్జిగ‌, బాదంపాలు, టీలు, కాఫీలు, చ‌క్కీలు, పండ్లు ఇలా ఒక‌టేమిటి? ఎన్నో ర‌కాల రుచుల‌ను అడుగునా అందిస్తున్నారు. అప‌రిమితంగా అందిస్తున్న వీటిని తీసుకుని ఆర‌గిండానికి భ‌క్తులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Read More
Next Story