చంద్రబాబు ‘ప్రజా సేవ’ ‘ఒక టీ-కూర కథ’
x

చంద్రబాబు ‘ప్రజా సేవ’ ‘ఒక టీ-కూర కథ’

ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలు సందర్భంలో కూరలు వండి, టీలు కాచి పెడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రంలో ఒక కొత్త 'వికాస' కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేరు ఏమంటే... ‘‘ప్రజల మధ్యకు, ప్రజలతో పాటు, ప్రజల కోసం... కెమెరా ఆన్!’’ ఈ కార్యక్రమంలో ఆయన చేస్తున్న కృషి నిజంగా అద్భుతం. ఎందుకంటే, ఇది రాజకీయాలను కాదు, సినిమా రీల్స్‌ను గుర్తు చేస్తోంది.


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో మత్స్యకారుడి ఇంట్లో చేపల కూర వండి అందరికీ వడ్డించి తాను తింటున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

బాబు గారు మంగళవారం మత్స్యకారుల వద్దకు వెళ్లి, స్వయంగా చేపలు కూర వండి, వారితో కలిసి భోజనం చేశారు. ‘‘నేను మీలాగే సామాన్యుడిని’’ అని చెప్పాలని ఆయన మనసులో ఉన్నట్టు ఉంది. కానీ ఆ కూరలో ఎంత మసాలా వేశారో, ఎంత ఉప్పు పోశారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ రీల్‌ను యూట్యూబ్‌లో 50 లక్షల వ్యూస్ వచ్చేసరికి, ప్రజలు "బాబు గారు సూపర్" అని కామెంట్లు పెడుతున్నారు. చేపలు తిన్న మత్స్యకారులు మాత్రం "ఇంకా ఒక్క రీల్ కోసం వస్తారా సార్?" అని అడిగినట్టు సమాచారం.


చేపలు కొనుగోలు చేస్తున్న సీఎం చంద్రబాబు

అంతకు ముందు ఎన్టీఆర్ జిల్లాలో కూలీ ఇంటికి వెళ్లి టీ కాచి, తాను తాగుతూ ఇంటి వారికి ఇచ్చి, వారి మంచంపై కూర్చున్నారు. "నా ప్రభుత్వం పేదల పక్షాన" అని సందేశం. కానీ ఆ టీలో ఎంత చక్కర వేశారో, ఎంత పాలు పోశారో కూలీ గారికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత, కామెంట్లు "బాబు గారు మా గుండెల్లోకి వచ్చేశారు" అని వస్తున్నాయి. కూలీ ఇంటి యజమాని మాత్రం "సార్, ఇంకోసారి వస్తే మా పాత మంచం మీద కాకుండా కొత్తది కొని పెడతా" అని అనుకున్నట్టు ఉంది.


చేపల కూర వండుతూ సీఎం చంద్రబాబు నాయుడు...

రోడ్డుపై తాటి నుంజలు చూసి కొని తినడం, స్కూళ్లలో విద్యార్థులతో ముచ్చటించి వారితో పాటు భోజనం చేయడం, ఇవన్నీ ఆయన రోజువారీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే...

‘‘ప్రజలారా! నేను మీ మధ్యనే ఉన్నాను. మీరు చేపలు తింటే నేను కూడా తింటా. మీరు టీ తాగితే నేను కాచి తాగుతా. మీరు నుంజలు తింటే నేను కొంటా. కానీ... మీ సమస్యలు పరిష్కరించడానికి సమయం లేదు. ఎందుకంటే రీల్స్ తీయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. అది చాలా బిజీ!’’


టీ కాచి ఇంట్లో వారికి అందిస్తున్న సీఎం చంద్రబాబు

ఈ ‘సామాన్యుడి’ నాటకం చూసి రాజకీయ విశ్లేషకులు ఒకటి అంటున్నారు. ‘‘బాబు గారు ఇప్పుడు ‘మైక్రో మేనేజ్‌మెంట్’ నుంచి ‘మైక్రో సెల్ఫీ మేనేజ్‌మెంట్’కు మారారు. పాలన కంటే ప్రచారం ముఖ్యం అని నిరూపిస్తున్నారు.’’

చివరగా ఒక చిన్న సూచన... సార్, ఒక్కసారి కెమెరాలు ఆపి, రీల్స్ లేకుండా ఒక్క మత్స్యకారుడి ఇంటికి వెళ్లి అడగండి. ‘‘మీ సమస్య ఏమిటి?’’ అని. ఆ తర్వాత టీ కాచి తాగవచ్చు. ఎందుకంటే, ప్రజలు టీ కాదు... తమ సమస్యలకు పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు.

Read More
Next Story