
రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ‘ప్రోటోకాల్ లోపాలు’..
టీఎంసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజాయిషీ కోరిన కేంద్రం..
రాష్ట్రపతి ముర్ము బెంగాల్ పర్యటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి , మంత్రుల గైర్హాజరు కావడంతో ప్రోటోకాల్ నిబంధన ఉల్లంఘించినట్లయ్యింది. వేదిక మార్పుపై కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరింది. బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై వివాదం చెలరేగి చిలికి చిలిక గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ ఇవ్వాలని కోరింది.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్, వేదికమార్గ ఏర్పాట్లలో జరిగిన ఉల్లంఘనపై స్పందించాలని కేంద్ర హోం కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
శనివారం బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆదివాసీ సమాజ కార్యక్రమంలో తక్కువ హాజరు కావడంతో రాష్ట్రపతి ముర్ము నిరాశ వ్యక్తం చేశారు. అలాగే వేదికను బిధాన్నగర్ నుంచి మరో ప్రాంతానికి తరలించడాన్ని ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీ కూడా హాజరు కాలేదని కేంద్రం గుర్తించింది. రాష్ట్రపతి విడిది చేసిన గెస్ట్ హౌజ్ లో వాష్రూమ్లో నీరు కూడా లేకపోవడం గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరారు.
రాష్ట్రపతి తన ప్రసంగంలో ..
“మమతా బెనర్జీ నా చెల్లెలిలాంటి వారు. నేను కూడా బెంగాల్ కుమార్తెనే. ఆమెకు కోపముందో లేదో నాకు తెలియదు. అది ముఖ్యం కాదు. మీరు అనుకుంటే నేను అధ్యక్షురాలిగా ఇక్కడే ఉంటాను” అని అన్నారు. కార్యక్రమ స్థలం మార్పుపై కూడా ఆమె ప్రశ్నించారు. బిధాన్నగర్లో జరిగి ఉంటే ఎక్కువ మంది వచ్చేవారని అన్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.

