సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు..
x

సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు..

‘గో బ్యాక్’ అంటూ నల్ల జెండాల ప్రదర్శన


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. కోల్‌కతా సమీపంలోని దక్షిణేశర్ కాళీ మందిర్‌ను ఆయన సందర్శించిన సమయంలో కొంతమంది నిరసనకారులు ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. అయితే ఆలయం వెలుపల నిరసనలు కొనసాగినప్పటికీ, జ్ఞానేష్ కుమార్ తన కార్యక్రమాలను కొనసాగించారు.

విమానాశ్రయం వద్ద కూడా నిరసనలు..

ఆదివారం రాత్రి కోల్‌కతాకు చేరుకున్న సమయంలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం వెలుపల కొందరు నిరసనకారులు ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) పేరుతో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది.

బేలూర్ మఠం సందర్శన..

మంగళవారం ఉదయం జ్ఞానేష్ కుమార్ బేలూర్ మఠ్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో హింసరహిత ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పారు. ఓటర్లు పండుగ వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు జ్ఞానేష్ కుమార్ బెంగాల్ పర్యటించారు. సోమవారం ఆయన రాజకీయ పార్టీలు, రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా కఠిన పర్యవేక్షణ అవసరమని కూడా పేర్కొన్నారు.

మమతా బెనర్జీ ఆరోపణలు..

అయితే ఈ సమావేశం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అధికారులను ఎన్నికల కమిషన్ బెదిరించిందని ఆమె ఆరోపించారు.

ఓటర్ల తొలగింపుపై వివాదం..

రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య వివాదం మరింత తీవ్రతరమైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 63.66 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 8.3 శాతం. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు తగ్గింది. అదనంగా 60.06 లక్షల మంది ఓటర్లను “అండర్ అజుడికేషన్” కేటగిరీలో ఉంచారు. అంటే వారి అర్హతపై చట్టపరమైన పరిశీలన ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల ఎన్నికల సమీకరణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read More
Next Story