
‘హర హర మహాదేవ’ నినాదాలతో మొదలైన అమర్నాథ్ యాత్ర
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా...దక్షిణ కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహ వైపు తొలి యాత్రికుల బృందాలు ప్రయాణం ప్రారంభించాయి.
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహకు వార్షిక యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్, సోనామార్గ్ సమీపంలోని బల్తాల్ బేస్ క్యాంప్ల నుంచి తొలి యాత్రికుల బృందాలు బయలుదేరాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా భక్తులు ఉత్సాహంగా యాత్రను కొనసాగించారు.
48 కిలోమీటర్ల పహల్గామ్ మార్గం, 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా ఈ యాత్ర సాగుతోంది. పురుషులు, మహిళలు, సాధువులతో కూడిన బృందాలకు అధికారులు జెండా ఊపి వీడ్కోలు పలికారు. "బమ్ బమ్ బోలే" నినాదాలతో బేస్ క్యాంపులు మారుమోగాయి.
గురువారం జమ్మూలోని భగవతి నగర్ నుంచి 4,809 మంది యాత్రికులతో తొలి కాన్వాయ్ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కాశ్మీర్ చేరుకున్న భక్తులకు అధికారులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
యాత్రికులు సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు. యాత్ర సురక్షితంగా సాగేందుకు పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గగనతల నిఘా కూడా కొనసాగుతోంది.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న ముగియనుంది.

