
‘‘ఇది మోదీ విజయం”
“పరివర్తన్” కోసం పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఈ ఫలితాలే నిదర్శనమంటున్న బీజేపీ నాయకులు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 293 నియోజకవర్గాల ఒట్ల లెక్కింపులో బీజేపీ 171 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు దారి తీసే అవకాశంగా భావిస్తున్నారు.
ఈ పరిణామాన్ని “ప్రధాని మోదీ విజయం”గా అభివర్ణిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రజలు మార్పు కోసం, అభివృద్ధి కోసం ఓటేశారని వారు పేర్కొన్నారు.
విపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ, “బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రజలు మాకు పూర్తి మద్దతు ఇచ్చారు” అని అన్నారు. నందిగ్రామ్లో పోటీ చేస్తున్న ఆయన, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేశారు.
కుల, మత, భాష ఆధారంగా ఓట్ల విభజన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. హిందూ ఓటర్లు బీజేపీకి ఏకీకృతమయ్యారని, ముస్లిం ఓటర్లు పూర్తిగా టీఎంసీ వైపు వెళ్లలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ, ప్రజలు ఇప్పటికే టీఎంసీ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, తుది ఫలితాల్లో అది స్పష్టమవుతుందని అన్నారు. మరికొంతమంది నేతలు 180కి పైగా సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ, అవినీతి, హింస, అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ విజయం టీఎంసీ హింసలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తలకు నివాళి అని వ్యాఖ్యానించారు.
మొత్తంగా, “పరివర్తన్” కోసం ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఈ ఫలితాలను బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.

