ఎల్‌డీఎఫ్ ఓటమి ముగింపు కాదు.. ‘కొత్త ఆరంభం’
x

ఎల్‌డీఎఫ్ ఓటమి ముగింపు కాదు.. ‘కొత్త ఆరంభం’

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై స్పందించిన పినరయి విజయన్..


Click the Play button to hear this message in audio format

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ పరాజయం, తమ రాజకీయ ప్రయాణానికి ముగింపు కాదని, అది కొత్త ఆరంభమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, ఈ ఫలితాలను ఆత్మపరిశీలనకు అవకాశంగా తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూడీఎఫ్ విజయానికి అభినందనలు తెలిపారు. అదే సమయంలో, ఈ ఫలితం ఎల్‌డీఎఫ్‌కు పూర్తిగా ఊహించనిదని అంగీకరించారు.

‘ప్రజల విశ్వాసం తిరిగి పొందుతాం’

ఎన్నికల ప్రచార సమయంలో తీవ్ర విమర్శలు, దాడులు ఎదురైనా ఎల్‌డీఎఫ్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు పినరయి కృతజ్ఞతలు తెలిపారు.

“ఓటర్లలో పెద్ద వర్గం ఇప్పటికీ ఎల్‌డీఎఫ్‌తోనే ఉంది. అదే మాకు ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తోంది,” అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మళ్లీ సంపాదించి, మరింత బలంగా తిరిగి వస్తామని ఆయన స్పష్టం చేశారు.

‘బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం’

ఎల్‌డీఎఫ్ ఇకపై అసెంబ్లీలో బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని పినరయి తెలిపారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ప్రజారోగ్యం, విద్య, యువత ఉపాధి వంటి అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.

‘నూతన కేరళ’ లక్ష్యాన్ని కొనసాగిస్తాం

గత పదేళ్లలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కేరళ సమాజంలో స్పష్టమైన మార్పులు తీసుకువచ్చాయని పినరయి అన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, విద్యాభివృద్ధి వంటి అంశాలతో “నూతన కేరళ” నిర్మాణం తమ లక్ష్యమని చెప్పారు.

బీజేపీ గెలుపుపై ఆందోళన

కేరళలో బీజేపీ మూడు సీట్లు గెలుచుకోవడాన్ని పినరయి తీవ్రంగా ప్రస్తావించారు. రాష్ట్ర లౌకిక, బహుళత్వ స్వరూపానికి ఇది హెచ్చరికలాంటిదని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో కనిపించిన కొన్ని ధోరణులు లౌకికవాదాన్ని నమ్మే వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. “మతతత్వ శక్తులతో ఎలాంటి రాజీ ఉండదు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది,” అని స్పష్టం చేశారు.

మీడియా పాత్రపై విమర్శలు..

ఎన్నికల సమయంలో విస్తృతంగా తప్పుడు ప్రచారాలు జరిగాయని పినరయి ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు సగం నిజాలు, అతిశయోక్తులతో కథనాలు ప్రచారం చేశాయని విమర్శించారు. అలాంటి ప్రచారాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. అయితే, ఈ అనుభవం నుంచి ఎల్‌డీఎఫ్ గుణపాఠాలు నేర్చుకుంటుందని పేర్కొన్నారు.

అన్ని స్థాయిల్లో సమీక్ష..

పార్టీ అన్ని స్థాయిల్లో సమగ్ర సమీక్ష నిర్వహిస్తుందని పినరయి తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు, సానుభూతిపరుల అభిప్రాయాలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. “మా లోపాలను సరిదిద్దుకుని ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం,” అని అన్నారు.

‘మరింత స్పష్టతతో ముందుకు’..

ఎల్‌డీఎఫ్ ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని పినరయి విజయన్ స్పష్టం చేశారు. “మేము మరింత స్పష్టతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం,” అని ఆయన అన్నారు.

కేరళ భవిష్యత్తు, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం ఎల్‌డీఎఫ్ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

Read More
Next Story