బెంగాల్ ఎన్నికలు: ఉదయం 11 గంటలకు 39.97 శాతం ఓటింగ్
x

బెంగాల్ ఎన్నికలు: ఉదయం 11 గంటలకు 39.97 శాతం ఓటింగ్

చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్‌ సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య 142 నియోజకవర్గాలలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ జిల్లాల్లో అధికార టీఎంసీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుందా? లేక తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పైచేయి సాధిస్తుందా? అన్నది మే 4న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.

ఉదయం 7 గంటలకే కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హుగ్లీ, పూర్బ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గత ఫలితాలను పరిశీలిస్తే.. 2021లో అధికార పార్టీ ఈ 142 స్థానాలలో 123 గెలుచుకోగా, బీజేపీకి కేవలం 18, ఐఎస్‌ఎఫ్‌ ఒక స్థానం మాత్రమే వచ్చాయి.

మమత వర్సెస్ సువెందు..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ కంచుకోటగా భావించే భబనీపూర్‌లో ఆమెతో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతున్నారు. 2021లో నందిగ్రామ్‌లో ఆయన చేతిలో మమత ఓడిపోయారు.

మొత్తం 3.21 కోట్ల ఓటర్లు..

రెండో దశ పోలింగ్‌లో 1.57 కోట్ల మంది మహిళలు, 792 మంది థర్డ్-జెండర్ ఓటర్లు సహా మొత్తం 3.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 41వేల కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.

7 జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం, మోహరించింది. కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీలను రంగంలోకి దింపింది. 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షణకు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్‌తో సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగిన విషయం తెలిసిందే. 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 93.19 శాతం ఓటింగ్ నమోదైంది.

Read More
Next Story