మీ వారు చనిపోలేదు కదా? లోకేష్ కామెంట్స్‌పై కార్మికులు ఆగ్రహం
x

మీ వారు చనిపోలేదు కదా? లోకేష్ కామెంట్స్‌పై కార్మికులు ఆగ్రహం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరామర్శకు ఎందుకు వెళ్లలేదు?


విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (RINL) తాజాగా జరిగిన ద్రవ ఉక్కు లాడిల్ పేలుడు దుర్ఘటనలో తమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 29 మంది కార్మికులు మరణించడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం ప్లాంట్‌లో పడిపోయిన భద్రతా ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాల నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగడం, పరిహారం పెంపుపై డిమాండ్ చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు తీవ్ర దుమారానికి కారణమైంది. మీ వారు చనిపోలేదు కదా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధితుల గాయాలపై కారం చల్లినట్లు ఉన్నాయని, ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇది కాదంటూ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద పారిశ్రామిక విపత్తు జరిగినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రాకుండా నిమ్మకుండిపోవడం, గతంలో స్టీల్ ప్లాంట్ భూ కేటాయింపులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్‌ను పంపడం వెనుక ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, స్థానికులు విమర్శిస్తున్నారు.


https://youtu.be/82Dmsm2r9IU?si=UuNOpe9L2q_9NCC_


మరోవైపు ఈ ఘోర ప్రమాదం వెనుక కేవలం మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ కుట్ర కూడా దాగి ఉందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, లెఫ్ట్ పార్టీల (CPI, CPM) నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్లాంట్ నిర్వహణకు, విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించకుండా, తగినంత మంది నైపుణ్యం కలిగిన శాశ్వత సిబ్బందిని నియమించకుండా ఉక్కు కర్మాగారాన్ని ఉద్దేశపూర్వకంగానే బలహీనపరుస్తున్నారని కార్మిక సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితులను పరామర్శించి, కార్మికులకు అండగా నిలబడటంతో పాటు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిధుల కొరత, భద్రతా నియమాల ఉల్లంఘనల వల్లే పరిశ్రమలో కార్మికుల రక్తం ఏరులై పారుతోందని, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నియమించిన త్రిసభ్య నిపుణుల కమిటీ విచారణలోనైనా యాజమాన్యం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడాలని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగాలని కార్మిక లోకం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
Read More
Next Story