
డీలిమిటేషన్ వివాదం – కేంద్రానికి స్టాలిన్ సీరియస్ వార్నింగ్..
సవరణను ఆమోదిస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించిన తమిళనాడు సీఎం
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదింపజేయాలని ప్రయత్నిస్తే, తమిళనాడు ప్రభుత్వం మౌనంగా ఉండబోదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో స్టాలిన్ నేరుగా కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
“ఈ వీడియో రెండు ప్రయోజనాలను అందిస్తుంది: ఒకటి తమిళనాడు గడప వద్దకు చేరిన ప్రమాదాన్ని వివరించడం, రెండవది కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇవ్వడం,” అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక సమావేశాలపై ఆక్షేపణ..
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. “తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సమావేశాన్ని బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారు,” అని పేర్కొన్నారు.
“ఏ రాష్ట్రాన్ని గానీ, ఏ రాజకీయ పార్టీని గానీ సంప్రదించకుండా, నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణను ఏకపక్షంగా ఆమోదింపజేయాలని చూస్తున్నారు,” అని స్టాలిన్ విరుచుకుపడ్డారు.
దక్షిణాల రాష్ట్రాల ఆందోళనలు..
డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న భయాలను స్టాలిన్ స్పష్టంగా వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణలో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలకు ఇది శిక్షలా మారుతుందని అన్నారు.
“జనాభా నియంత్రణ పాటించమని కేంద్రం చెప్పింది. మేము క్రమశిక్షణతో పాటించాం. ఇప్పుడు అదే కారణంగా మా ప్రతినిధిత్వాన్ని తగ్గిస్తారా? ఇది శిక్షేనా?” అని ప్రశ్నించారు.
భారీ ఉద్యమానికి హెచ్చరిక..
కేంద్రం ఈ ప్రక్రియను కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని స్టాలిన్ హెచ్చరించారు. “తమిళనాడు తిరగబడుతుంది. ప్రతి కుటుంబం వీధుల్లోకి వస్తుంది. నా నాయకత్వంలో భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం,” అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనే కేంద్ర ఆలోచనను కూడా ఆయన తప్పుపట్టారు.
“ఇది ఎన్నికల కాలం కాబట్టి అందరి దృష్టి వేరే చోట ఉంటుంది అనుకొని, ఢిల్లీలో నిశ్శబ్దంగా డీలిమిటేషన్ చేయవచ్చని అనుకోవద్దు. ఆ ఆలోచన కూడా చేయవద్దు,” అని గట్టిగా హెచ్చరించారు.
చారిత్రక ఉద్యమాల ప్రస్తావన
డీఎంకే గత పోరాటాలను గుర్తుచేసుకుంటూ స్టాలిన్ భావోద్వేగంగా స్పందించారు. “1950లు, 1960లలో డీఎంకే చూపిన పోరాట స్ఫూర్తిని దేశం మళ్లీ చూస్తుంది,” అని అన్నారు.
తుది హెచ్చరిక ..
తన సందేశాన్ని ముగిస్తూ స్టాలిన్ కేంద్రానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. “దీనిని బెదిరింపుగా భావించవద్దు. ఇది ఒక హెచ్చరిక. మీరు దీనిని ఎలా తీసుకుంటారో అది మీ విషయం,” అని అన్నారు. ప్రధాని మోదీని నేరుగా ఉద్దేశిస్తూ.. “తమిళనాడు నుంచి మీకు జారీ చేస్తున్న చివరి హెచ్చరిక ఇది. తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుంది,” అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తంగా.. డీలిమిటేషన్ అంశం దేశ రాజకీయాల్లో కీలక చర్చకు దారితీస్తుండగా, తమిళనాడు నుంచి వస్తున్న ఈ కఠిన హెచ్చరిక కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.

