కాపుతో మొద‌లై.. రెడ్డితో ముగిసిన ముద్ర‌గ‌డ ప్ర‌స్థానం!
x
త‌న పేరును ప‌ద్మ‌నాభంరెడ్డిగా ప్ర‌క‌టిస్తున్న ముద్ర‌గ‌డ

కాపుతో మొద‌లై.. రెడ్డితో ముగిసిన ముద్ర‌గ‌డ ప్ర‌స్థానం!

కాపు సామాజిక‌వ‌ర్గంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌స్థానం కాపుతో మొద‌లై.. రెడ్డితో ముగిసింది!

ఆ మాట‌కొస్తే.. మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడ‌న్న‌పేరు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డకూ వ‌ర్తిస్తుందేమో! తానిచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డానికి క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా వెన‌క్కి త‌గ్గ‌ని, రాజీప‌డ‌ని అరుదైన మ‌న‌స్త‌త్వం ప‌ద్మ‌నాభం సొంతం. అలా త‌న రాజ‌కీయ‌, కాపు ఉద్య‌మ ప్ర‌స్థానంలో ఎన్నో ఒడుదొడుకుల‌ను, క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌వి చూశారు. అదే ఆయ‌న‌కు ఖ్యాతిని తెచ్చిపెట్టింది. విమ‌ర్శల‌కూ గురి చేసింది. త‌న ఆఖ‌రి శ్వాస దాకా ప‌ట్టుద‌ల‌కే ప‌ట్టం క‌ట్టిన నేత‌గా ముద్ర వేసుకున్నారు ముద్ర‌గ‌డ‌!


తునిలో జ‌రిగిన కాపు ఐక్య గ‌ర్జ‌న స‌మావేశం.. రైలు త‌గల‌బ‌డ‌టానికి ముందు (ఫైల్‌)

రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చి..
ఆది నుంచి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంది విభిన్న శైలి. రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న‌.. తండ్రి నుంచి రాజ‌కీయ వార‌సత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తండ్రి వీర‌రాఘ‌వ‌రావు రెండుమార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేస్తే ఈయ‌న నాలుగు సార్లు శాసన‌స‌భ్యునిగా, రెండు ప‌ర్యాయాలు మంత్రి ప‌ద‌వుల‌ను అధిరోహించారు. ఒక ద‌ఫా ఎంపీగా (కాకినాడ‌) ఎన్నిక‌య్యారు. కాంగ్ర‌స్‌, టీడీపీ ప్ర‌భుత్వాల్లో ఒక‌సారి ఆర్టీసీ/ర‌వాణా శాఖ మంత్రిగా, మ‌రోసారి ఎక్సైజ్ శాఖ మంత్రిగాను విధులు నిర్వ‌హించారు. ఆ శాఖ‌ల‌కు వ‌న్నె తెచ్చారు. ఎన్టీఆర్ మంత్రివ‌ర్గంలో విభేదించి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

తుని రైలు ద‌గ్ధం కేసులో రైల్వే కోర్టుకు హాజ‌ర‌వుతున్న ముద్ర‌గ‌డ

అవినీతి మచ్చ ఎరుగ‌ని నేత‌..
రాజ‌కీయాల్లో అవినీతి ఆరోప‌ణ‌లు స‌ర్వ సాధార‌ణం. పేద‌రికం, మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి రాజ‌కీయాల్లోకి వచ్చిన వారు అన‌తి కాలంలోనే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్న రోజులివి. అలాంటిది ఆయన త‌న రాజ‌కీయ కెరీర్‌లో అవినీతి మ‌చ్చ ఎరుగ‌ని నేత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక త‌న ఆస్తుల‌ను అమ్ముకున్నారు. ఆర్థికంగానూ న‌ష్ట‌పోయారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాల‌ని ఏనాడూ త‌పించ‌లేదు. తండ్రి నుంచి భూస్వామిగా వ‌చ్చిన ముద్ర‌గ‌డ రాజ‌కీయాల కోసం భూముల‌ను సైతం తెగ‌న‌మ్ముకున్నారంటే.. ఆయ‌న నీతి, నిజాయితీల గురించి వేరే చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో తాను శాస‌న‌స‌భ్యునిగా ఉన్న‌ప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, విద్యా సంస్థ‌ల‌కు భూములిచ్చిన దాన‌శీలి ముద్ర‌గ‌డ‌. గ‌తంలో త‌న ఊరు కిర్లంపూడిలో కుదువ పెట్టిన సొంత‌ జిన్నింగ్ మిల్లు అప్పు తీర్చ‌లేని సమ‌యంలో దానిని బ్యాంకు జ‌ఫ్తు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.
రాజీనామా లేఖ‌ను జేబులో ఉంచుకుని..
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాను న‌మ్మిన సిద్ధాంతాల కోస‌మే ప‌నిచేసేవారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎప్పుడైనా ప‌ద‌వికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకోసం త‌న జేబులో ఎప్పుడూ రాజీనామా లేఖ‌ను ఉంచుకునే వార‌ని ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారు చెబుతారు.

కాపునాడు ఉద్య‌మంలోకి అడుగు అలా..

కాపు నేత వంగ‌వీటి రంగా హ‌త్య‌కు ముందు విజ‌య‌వాడ‌లో స‌భ పెట్టారు. రంగాను అరెస్టు అయిన‌ప్పుడు కాపు నాయ‌కులంతా క‌లిసి రంగాకు మ‌ద్ద‌తుగా బెజ‌వాడ‌లో పెద్ద స‌భ పెట్టారు. అప్ప‌ట్లో టీడీపీ మ‌హానాడుకు ధీటుగా శాశ్వ‌తంగా కాపునాడు ఒక‌టి ఉండాల‌ని నిర్ణ‌యించారు. దీంతో కాపు నాయ‌కుడు మిరియాల వెంకట్రావు సార‌థ్యంలో కాపునాడును ప్ర‌క‌టించారు. ఆ స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ముద్ర‌గ‌డ‌కు దానిని మోసే బాధ్య‌త‌ను ఆయ‌న త‌ల‌పై పూల కిరీటాన్ని పెట్టి అప్ప‌గించారు. అలా ఆయ‌న కాపునాడు బాధ్య‌త‌ల‌ను భుజాన‌కెత్తుకున్నారు. ఆపై అంచెలంచెలుగా కాపు నాడు ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లారు ముద్ర‌గ‌డ‌. కాపు ఉద్య‌మం కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌న్న డిమాండ్‌తో ముద్ర‌గ‌డ ఉద్య‌మించారు. 1994లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం నిరాహార దీక్ష చేప‌ట్టారు.
మ‌లుపు తిరిగిన తుని కాపు ఐక్య గ‌ర్జ‌న‌
2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆధ్వర్యంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు - రైళ్ల రోకోలకు పిలుపు ఇచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది. ఆప్ప‌ట్లో ఆందోళ‌న‌కారుల చేతిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ద‌గ్ధ‌మైంది.

కోడ‌లికి మ‌రో పెళ్లి చేసిన సంఘ సంస్క‌ర్త‌..

.ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుక్కి పెళ్ల‌యిన కొన్నాళ్ల‌కు టైఫాయిడ్ తో అంగ‌వైక‌ల్యానికి గురై మంచానికే ప‌రిమిత‌మయ్యాడు. దీంతో ముద్ర‌గ‌డ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న పెద్ద కోడ‌లి జీవితం అంధ‌కార బంధురం కాకూడ‌ద‌ని ముద్ర‌గ‌డ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న పెద్ద కోడ‌లిని ఐఆర్ ఎస్ అధికారికిచ్చి మ‌రో పెళ్లి చేసి పంపిన మాన‌వ‌తా వాది. అభ్యుద‌య వాది, సం సంస్క‌ర్త‌గా నిలిచారు ముద్ర‌గ‌డ‌. అప్ప‌ట్లో ఆయ‌న తీసుకున్న ఆ నిర్ణ‌యం న‌లుదిశ‌లా పెను సంచ‌ల‌నం అయింది.

`` అండి`` అనే ప‌దం ఆయ‌న‌ సొంతం..

ముద్ర‌గ‌డ మాట తీరుకు ఓ ప్ర‌త్యేక ఉండేది. ఆయ‌న మాట్లాడిన ప్ర‌తి ప‌దానికి చివ‌ర‌న అండి అని అనే వారు. రాయాల్సి వ‌స్తే అండి అని పేర్కొనే వారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచి అండీ అని పిల‌వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. కొంత‌మంది శ‌త్రువులు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న అండీ అనే ప‌దాన్ని ఉచ్ఛ‌రించ‌డానికి హేళ‌న‌, ఎగ‌తాళి చేసే వారు. అయినా అవేమీ ప‌ట్టించుకోకుండా అండీ అల‌వాటునే ఆయ‌న చివ‌రి దాకా కొన‌సాగించారు.

ఒక‌సారి క‌మిట్ అయితే..

ఒక్క‌సారి క‌మిట్ అయితే త‌న మాట తానే విన‌ర‌న్న నానుడి ఉంది. అందుకే ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చ‌యినా ఆ మాట‌కే క‌ట్టుబ‌డ‌డం ఆయ‌న నైజం. అది ఆయ‌న‌కు రాజ‌కీయంగాను, వ్య‌క్తిగ‌తంగాను మేలు, కీడు రెండూ చేశాయంటారు ఆయ‌నతో అనుబంధం ఉన్న వారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తినా తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం, కాపు సామాజిక వ‌ర్గానికి బీసీ రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చి తీరాల‌న్న ల‌క్ష్యం కోసం వెన‌క‌డుగు వేసే వారు. కొన్నేళ్ల నుంచి ముద్ర‌గ‌డ ఆరోగ్యం క్షీణిస్తూ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌డూ త‌న ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందేవారు కాదు.
కాపు ఉద్య‌మ నేత‌గానే కొన‌సాగుతూ వ‌చ్చారు.

కాపు నుంచి వ‌చ్చి.. రెడ్డిగా మారి..

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు సామాజిక వ‌ర్గం అభ్యున్న‌తికి అహ‌ర్నిశ‌లు పాటు ప‌డ్డారు. ఆ జాతికి రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అందాల‌ని త‌పించే వారు. అలాంటి ముద్ర‌గ‌డకు 2024 ఎన్నిక‌లు ఓ స‌వాలుగా మారాయి. ముద్ర‌గ‌డ 2024లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరక్కపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు.సవాల్‌ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ గెజిట్‌లోనూ త‌న పేరును మార్పించుకున్నారు. దీనిపై ఆయ‌న ఎన్నో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. అయినా వెర‌వ‌కుండా త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నారు. ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రెడ్డిగానే కొన‌సాగారు. కాపు సామాజిక వ‌ర్గం నుంచి వ‌చ్చిన ముద్ర‌గ‌డ.. ప‌ద్మ‌నాభం.. రెడ్డిగా మారి రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నమ‌య్యారు. ఇలా కాపు నుంచి మొద‌లైన ముద్ర‌గ‌డ రాజ‌కీయ ప్ర‌స్థానం రెడ్డితో ముగియ‌డం విశేషం!

కూతురు తీరుతో తీవ్ర మ‌నోవేద‌న‌..

తాను ఎంతో ప్రేమ‌గా చూసుకునే కుమార్తె బార్ల‌పూడి క్రాంతి వైఖ‌రి ముద్ర‌గ‌డ‌ను ఎంత‌గానో బాధించింది. 2024 ఎన్నిక‌లే ఇందుకు దారితీశాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వ్య‌తిరేకంగా తండ్రి మాట్లాడ‌టం కుమార్తెకు రుచించ‌లేదు.
అదే విష‌యాన్ని ఆమె బ‌హిరంగంగా మీడియాకెక్క‌డం ముద్ర‌గ‌డ జీర్ణించుకోలేక పోయారు. అలా వారి మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకుని బ‌హిరంగ విమ‌ర్శ‌లు, స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌ వ‌ర‌కు వెళ్లాయి. టీడీపీ సానుభూతిప‌రుడు, ఆ పార్టీ నాయ‌కుల‌తో స‌త్సంబంధాలున్న కుమార్తె క్రాంతి మావ‌ ర‌వికుమార్ వెన‌క‌ నుంచి తండ్రిపై ఉసిగొల్పుతున్నార‌న్న అనుమానం అటు ప‌ద్మ‌నాభంలోనూ, ఆయ‌న గురించి తెలిసిన వారిలోనూ ఉంద‌ని చెబుతారు. కోడ‌లిని అడ్డం పెట్ట‌కుని టీడీపీలో రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌న్న‌ది ర‌వికుమార్ ఎత్తుగ‌డ అని చెప్పుకుంటారు. క్రాంతిని రాజ‌మండ్రి మేయ‌ర్‌గా గాని, లేదా ఎమ్మెల్యేను చేస్తాన‌ని ఆశ చూపి తండ్రిపై ఎగ‌దోశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో రెండేళ్లుగా తండ్రీ కూతుళ్ల మ‌ధ్య రాజుకున్న అగ్గి చ‌ల్లార‌లేదు స‌రిక‌దా పెరుగుతూ వ‌చ్చింది. త‌ర‌చూ ముద్ర‌గ‌డ‌ను ఇదే బాధించేది. ముద్రగ‌డ చ‌నిపోవ‌డానికి కొద్దిరోజుల ముందు కూడా కుమార్తెకు వ్య‌తిరేకంగా వీడియోను విడుద‌ల చేశారు.

తోట రాజీవ్‌

ముద్ర‌గ‌డ ఆశ‌య సాధ‌న‌తోనే నిజ‌మైన నివాళి..

`` కాపు ఉద్య‌మ‌కారుడు.. ముద్ర‌గ‌డ ఎన్ని ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చినా ఉద్య‌మాలు, నిరాహార‌ద‌క్ష‌ల‌కూ సిద్ధ‌మ‌య్యారు. కాపుల రిజ‌ర్వేష‌న్ హ‌క్కుల కోసం త‌న జీవితాన్నే ఉద్య‌మంగా మార్చుకున్న యోధుడు. కాపు జాతి ఆత్మ‌గౌర‌వం కోసం త‌పించిన నేత‌. నీతి, నిజాయ‌తీల‌కు మారు పేరుగా నిలిచారు. ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాలు సృష్టించారాయ‌న‌. వెన‌క‌బ‌డ్డ కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ ఫ‌లాల ద్వారా మేలు చేయాల‌ని త‌ల‌పోశారు. కాపులు బీసీ రిజ‌ర్వేష‌న్ సాధించిన రోజే ముద్ర‌గ‌డ‌కు నిజ‌మైన నివాళి అర్పించిన‌ట్ట‌వుతుంది`` అని కాపు బీసీ పోరాట జేఏసీ రాష్ట్ర క‌న్వీన‌ర్ తోట రాజీవ్ `ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌` ప్ర‌తినిధితో చెప్పారు.

పీవీఎన్ మాధ‌వ్

ముద్ర‌గ‌డ ఓ ప్ర‌జానాయ‌కుడు..

`` ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఒక ప్ర‌జానాయ‌కుడు. రాజీ ఎరుగ‌ని నాయ‌కుడు. న్యాయ ప‌ర‌మైన కార‌ణాల కోసం నిరంత‌రం పోరాడిన నేత‌. మాట‌కు క‌ట్టుబ‌డి జీవించిన రాజ‌కీయవేత్త‌. మంత్రిగా ఉన్న‌ప్పుడూ రాజీ ప‌డకుండా విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి త‌న ప‌ద‌వికి రాజీనామ చేసిన నిబద్ధుడు. కాపు స‌మాజానికే కాదు.. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి పాటుప‌డ్డారు. బీజేపీలోనూ సేవ‌లందించారు. మా తండ్రితోనూ ఆయ‌నకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది`` అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ పేర్కొన్నారు.

ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు

కాపు ఉద్య‌మానికి ముద్ర‌గ‌డ అంకితం..

`` కాపు ఉద్య‌మానికి త‌న జీవితాన్ని అంకితం చేసిన నేత ముద్ర‌గ‌డ‌. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ఆయ‌న చేసిన పోరాటం, స‌మాజానికి అందించిన సేవ‌లు అమూల్యం. ఆయ‌న వ్య‌క్తిత్వం ఎప్ప‌టికీ చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. ముద్ర‌గ‌డ లేని లోటు కాపు సామాజిక‌వ‌ర్గానికి ఎన్న‌టికీ తీర‌నిది. తీర్చ‌లేనిది`` అని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.

కేకే రాజు

పోరాట యోధుడు ముద్ర‌గ‌డ‌..
`` ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, ముఖ్యంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల హ‌క్కుల కోసం జీవితాంతం పోరాటం చేస్తూ వ‌చ్చారు. కాపు సామాజిక‌వ‌ర్గానికి న్యాయం కోసం నిరంత‌రం పోరాడారు. ఆయ‌న మ‌ర‌ణంతో రాష్ట్రం ఒక అనుభ‌వ‌జ్ఞుడైన నాయ‌కుడిని కోల్పోయింది` అని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు `` ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తినిధితో చెప్పారు.
Read More
Next Story