
షా వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం.. లీగల్ యాక్షన్కు సిద్ధమవుతున్న టీఎంసీ
ఇంతకు కేంద్ర హోం మంత్రి ఏమన్నారు?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చట్టపర చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీఎంసీ కార్యకర్తలను బెదిరించే విధంగా “హింసాత్మక వ్యాఖ్యలు” చేశారని ఆరోపిస్తూ, ఆయనపై కేసు నమోదు చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని ఆమె తెలిపారు.
“హింసాత్మక భాష ఆమోదయోగ్యం కాదు”
హుగ్లీ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ, కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “ఒక హోం మంత్రి ఎలాంటి భాష వాడుతున్నారు? ఎన్నికల తర్వాత ప్రజలను తలకిందులుగా వేలాడదీస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ” అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి మనస్తత్వంతో బీజేపీ బెంగాల్లో ఎప్పటికీ విజయం సాధించలేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. “ఈ విధమైన ఆలోచనతో మీరు బెంగాల్లో ఎప్పటికీ గెలవలేరు,” అని పేర్కొన్నారు.
ఇంతకు షా ఏమన్నారు?
అమిత్ షా ఆరంబాగ్లో జరిగిన సభలో ప్రసంగించారు. టీఎంసీతో సంబంధం ఉన్న “గూండాలు”పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “29న దీదీ గూండాలు బయటకు రాకూడదు. ఒకవేళ ప్రజలను ఇబ్బంది పెడితే, మే 5 తర్వాత వారిని తలకిందులుగా వేలాడదీస్తాం’’, అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసాయి.
ప్రధాని మోదీ కూడా టీఎంసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డమ్ డమ్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ “గూండాలకు” దాక్కోవడానికి చోటు కూడా ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.
అధిక పోలింగ్పై రాజకీయ వ్యాఖ్యలు..
మొదటి దశలో నమోదైన అధిక ఓటింగ్ శాతాన్ని ప్రస్తావిస్తూ, మోదీ దాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ప్రజలు భారీగా పోలింగ్లో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
బెంగాల్లో పెరిగిన ఉద్రిక్తతలు..
రెండో దశ ఎన్నికలకు ముందు బీజేపీ-టీఎంసీ మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు బీజేపీ నేతల ఘాటు వ్యాఖ్యలు, మరోవైపు టీఎంసీ చట్టపర చర్యల హెచ్చరికలు..రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఈ మాటల యుద్ధం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

