
కేరళలో ఎన్నికల వేడి..
LDF – UDF మధ్య మాటల యుద్ధం..
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ (LDF),ప్రతిపక్ష యూడిఎఫ్ (UDF) మధ్య ప్రచారం రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. రెండు కూటములు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే ప్రధాన అంశాల చుట్టూ రాజకీయ పోరు కొనసాగుతోంది.
అభివృద్ధి పనులపై ఎల్డీఎఫ్ ఫోకస్..
సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా తన పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతులు, రహదారులు, నగరాభివృద్ధి వంటి రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులను ఎల్డీఎఫ్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
తమ పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేశామని ఎల్డీఎఫ్ నాయకులు చెబుతున్నారు. 2011–2016 మధ్య ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వంతో పోలిస్తే తాము ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టామని వారు వాదిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో అనేక ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయని కూడా విమర్శిస్తున్నారు.
ఎల్డీఎఫ్ ప్రచారంలో ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యంగా చూపిస్తోంది. వయనాడ్లో కొత్త టౌన్షిప్ అభివృద్ధి ప్రణాళిక, ఆలప్పుజా జిల్లాలోని పెరుంబలం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే వంతెన, వయనాడ్లో టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ వంటి పనులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ప్రభుత్వం చెబుతోంది. ఇవి మౌలిక వసతుల విస్తరణకు దోహదపడతాయని ఎల్డీఎఫ్ ప్రచారం చేస్తోంది.
అంతేకాకుండా ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. అందులో 2011–2016 మధ్య యూడీఎఫ్ పాలనలో జరిగిన ఆలస్యాలు, అమలు కాలేని ప్రాజెక్టుల వివరాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తోంది.
యూడీఎఫ్ సంక్షేమ హామీలు..
ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కొత్త సంక్షేమ హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. అధికార పార్టీ అభివృద్ధి ప్రచారానికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాలను ప్రకటిస్తోంది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. యూడీఎఫ్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని ఉదాహరణగా తెలిపారు. సంక్షేమ పెన్షన్లను రూ. 3వేలకు పెంచడం, చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఆరోగ్య బీమా పథకాన్ని విస్తరించడం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. వెయ్యి ఆర్థిక సాయం వంటి పథకాలను కూడా ప్రకటించారు. ఈ చర్యలు ప్రజల ఆర్థిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని యూడిఎఫ్ నేతలు చెబుతున్నారు.
సర్వేలలో ఆసక్తికర సంకేతాలు..
కేరళలో ఇటీవల వెలువడిన కొన్ని సర్వేలు ఆసక్తికర సంకేతాలను ఇస్తున్నాయి. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదని అవి సూచిస్తున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం మారే అవకాశం తక్కువగా ఉండొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేరళ రాజకీయాల్లో గతంలో సాధారణంగా ప్రతి ఎన్నికలో ప్రభుత్వం మారే సంప్రదాయం కనిపించేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని వారు అంటున్నారు. అలాగే కొన్ని అల్పసంఖ్యాక వర్గాల అభిరుచుల్లో మార్పులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.
సీపీఎం విమర్శలు
ఇక సీపీఎం నాయకులు కాంగ్రెస్ ప్రకటించిన పథకాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి కేవలం “ఉచిత పథకాల హామీలు” మాత్రమేనని వారు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని హామీలు పూర్తిగా అమలు కాలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వామపక్ష భావజాలంలో భాగమని సీపీఎం చెబుతోంది.
వేడెక్కుతోన్న ఎన్నికల పోరు..
మొత్తంగా కేరళలో ఎన్నికల పోరు ఇప్పుడు రెండు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలనపై దృష్టి పెడుతోంది. యూడీఎఫ్ మాత్రం సంక్షేమ హామీలు, ఆర్థిక సాయం వంటి అంశాలను ముందుకు తెస్తోంది.
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ రెండు కూటముల మధ్య రాజకీయ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కేరళ ఓటర్లు చివరికి ఏ వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

