
రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం..
SIR, ఓటు హక్కుపై ఆందోళన వ్యక్తం చేసిన ఎంఎన్ఎం అధినేత..
ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభ(Rajya sabha)లో తొలిసారిగా ప్రసంగించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(S.I.R) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కేవలం ఓటు వేయాలనుకుంటున్నారు. అయితే వారి అర్హతలు, పేర్లల్లో స్పెల్లింగ్లు, అడ్రస్సు అంటూ అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు పరిరక్షణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
తన ప్రసంగాన్ని “గౌరవప్రద క్షణం”గా అభివర్ణించిన కమల్ హాసన్.. తమిళ భాష, సంస్కృతిపై తన అభిమానం గురించి ప్రస్తావించారు. తన గురువులలో ఒకరైన సి.ఎన్. అన్నాదురై తనకు భాషా గౌరవం, హక్కుల పరిరక్షణ పాఠాలు నేర్పారని గుర్తుచేశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, పెరియార్, అన్నా వంటి నాయకుల ఆలోచనలు తన రాజకీయ దృక్పథాన్ని మలిచాయని చెప్పారు.
తాను హైస్కూల్ చదువు మానేసిన వ్యక్తినైనా, ఒక తమిళుడిగా తన అభిప్రాయం చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. సినిమా తనకు గుర్తింపు ఇచ్చిందని, అదే సమయంలో భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన “రాష్ట్రాల సమాఖ్య” భావనలో ఉన్న లోపాలను కూడా చూపిందన్నారు.
భవిష్యత్తు యువతదే..
పార్లమెంట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమని, కానీ ప్రజలను అణగదొక్కే ధోరణి ఉండకూడదని హెచ్చరించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారు ఈ నిజాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. యువత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, భవిష్యత్తు వారిదేనని, ప్రగతిశీల ప్రజాస్వామ్యాన్ని వారికి అందించాల్సిన బాధ్యత అందరిదని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

