
ప్రతిపక్ష కూటమిలో ఐక్యత సాధ్యమేనా?
డీఎంకే, టీఎంసీల ఓటమిలతో కూటమిలో లుకలుకలు
రెండు నెలల క్రితం, లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయినప్పుడూ ప్రతిపక్ష ఇండి కూటమి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇక ముందు మోదీ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ అని, ఆ బిల్లు ఓటమిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించాయి.
అయితే, ఆ ఉత్సాహం ఇప్పుడు గతంలా అనిపిస్తోంది. మే 4న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఇండి కూటమి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన ఎదురు దెబ్బను ఎదుర్కొంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, టీఎంసీలు అధికారం నుంచి గద్దె దిగగా, కూటమిలోనే అనేక విభేదాలతో కుదేలయ్యింది. దీంతో, తిరిగి పుంజుకోవడానికి కూటమి ఏం చేస్తుంది, ఏం చేయగలదు అనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఇండి’ కూటమికి అనేక తలనొప్పులు
తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ తమ పొత్తును విచ్ఛిన్నం చేసినందుకు డీఎంకే ఇంకా అసంతృప్తితో ఉంది టీఎంసీ చిన్నాభిన్నమైంది. అధినేత్రి మమతా బెనర్జీ కూడా తన ఉనికిని నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. కేరళలో బీజేపీతో వామపక్షాలు కుమ్మక్కయ్యాయన్న కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ "ఏకపక్ష" పనితీరు పట్ల జేఎంఎం అంతగా సంతోషంగా లేదు.
ఇటీవలి ఎన్నికల పరాజయం పర్యవసానాలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రభుత్వం తన ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుని కీలక బిల్లులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి, ప్రతిపక్షం రాబోయే వర్షాకాల సమావేశాల వంటి కీలక పార్లమెంటరీ సమావేశాలకు కూడా సిద్ధం కావాలి.
గందరగోళం మధ్య సమావేశం
ఇటువంటి పరిస్థితులలోనే, మే నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండి కూటమి మిత్రపక్షాలు తమ మొదటి ప్రధాన సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్, న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో 'ఇండియా జన్బంధన్' ('ప్రజల కూటమి')గా పిలవబడుతున్న ఈ సమావేశానికి 23 పార్టీలు హాజరవుతాయని ధృవీకరించింది.
ఈ ప్రతిపక్ష కూటమి తన వైవిధ్యంతోనే ఐక్యంగా ఉందని ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ పేర్కొంది. కొన్ని పార్టీలు "తమ సొంత కారణాల" వల్ల సమావేశానికి హాజరు కాలేమని తెలియజేశాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ అంగీకరించారు.
"లక్షలాది మంది భారతీయుల ఓటు హక్కును హరించివేస్తూ, ప్రతిరోజూ రాజ్యాంగంపై దాడి చేస్తూ, దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నాయకులపై దాడి చేస్తూ, కోట్లాది మంది భారతీయుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తూ, ఎడతెరిపి లేకుండా పెరుగుతున్న ధరలతో కుటుంబ బడ్జెట్లను నాశనం చేస్తూ, లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలకు ద్రోహం చేస్తూ, పెట్టుబడుల వాతావరణాన్ని నీరుగారుస్తూ, విదేశాంగ విధానంతో జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలు, చర్యలకు తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేసినప్పటికీ, కొన్ని పార్టీలు తమ సొంత కారణాలతో ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని తెలిపాయి" అని కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ రమేష్ 'ఎక్స్'లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
ఆయనను ట్యాగ్ చేస్తూ, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా అన్నారు, "ఒకే లక్ష్యంతో, స్పష్టమైన ఉద్దేశ్యంతో సమావేశం. ఐక్య భారతం. అనేక పార్టీలు సౌహార్ద స్ఫూర్తితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నాయి." అని ట్వీట్ చేశారు.
2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని ఈ కూటమి పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ దానిని అనేక సవాళ్లు వేధిస్తున్నాయి.
ఎడమొహం.. పెడమొహంగా డీఎంకే
ఇండి కూటమి ప్రధాన సవాళ్లలో ఒకటి డీఎంకే అలక. దాని దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్, రాష్ట్ర కూటమిని వీడి, నటుడు-రాజకీయవేత్త విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ తర్వాత టీవీకే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని మరో ప్రధాన మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా, టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన తర్వాత ఆ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
"కష్టకాలంలో ఒకరినొకరు వదిలేసేవాళ్లం మనం కాదు" అని ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. దీని ప్రభావం న్యూఢిల్లీలో కూడా కనిపించింది. డీఎంకే లోక్సభలో తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు కోరడమే కాకుండా, సోమవారం నాటి సమావేశాన్ని బహిష్కరించింది. అంతేకాకుండా, ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన టీకేఎస్ ఎలాంగోవన్, తమ పార్టీ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేసిందని కూడా ప్రకటించారు. ఎంకే స్టాలిన్ పార్టీ, తాను 'ద్రోహి' అని అభివర్ణించిన కాంగ్రెస్తో రాజీపడే మూడ్లో లేనట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, డీఎంకేకు బీజేపీతో 'భూగర్భ పొత్తు' ఉందని టీవీకే నాయకుడు వీర విఘ్నేశ్వరన్ ఆరోపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఇండి కూటమిలో ఆందోళనను మరింత పెంచుతాయని భావిస్తున్నారు.
టీఎంసీ అస్తిత్వ సంక్షోభం..
దిగువ సభలో దాదాపు 30 మంది ఎంపీలు ఉన్న మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన టీఎంసీ కూడా సంక్షోభంలో ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీకి అధికారం దక్కిన తర్వాత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఈ పార్టీ భారీ తిరుగుబాటును ఎదుర్కొని, వాస్తవంగా చీలిపోయింది.
పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న భవానీపూర్లో వ్యక్తిగతంగా ఓడిపోగా, ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉన్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పార్టీ శ్రేణులలోనూ, వీధుల్లోనూ తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నారు.
మే 20న, ఎన్నికల అనంతర హింసాకాండలో మరణించిన ఒక టీఎంసీ కార్యకర్త బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై, పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్ ప్రాంతంలో కొందరు స్థానికులు భౌతికంగా దాడి చేశారు. బీజేపీ వ్యతిరేక వేదికపై ఒకే పార్టీగా ఉన్నప్పటికీ, 2011 అసెంబ్లీ ఎన్నికల నుంచి బెంగాల్లో కాంగ్రెస్ కంటే తామే గొప్ప అని చెప్పుకోవడానికి టీఎంసీ ప్రయత్నించడం, ఈ రెండు పార్టీలు పోటీదారులుగా పోరాడటం వంటి పరిణామాల నేపథ్యంలో మమతా, అభిషేక్ ఇండి కూటమి సమావేశానికి హాజరు కావడం ఒక విచిత్రమైన పరిణామం.
పార్టీ ఎంపీల మధ్య ఏకాభిప్రాయం లేదని సమాచారం, ఇది మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో పార్టీని ఐక్యంగా ఉంచడానికి, బహుశా అధినేత్రి స్వయంగా లోక్సభలోకి ప్రవేశంపై ప్రయత్నిస్తున్నారు.
లోక్సభలో డీఎంకేకు 22 మంది ఎంపీలు, టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వీరు 50 మంది పార్లమెంటేరియన్లతో కూడిన కీలకమైన కూర్పును ఏర్పరుస్తారు, దీనిని కోల్పోతే ఇండి కూటమికి గట్టి దెబ్బ తగులుతుంది.
చిన్న పార్టీలు..
చిన్న మిత్రపక్షాలు కూడా ఇండి కూటమిలో సంతోషంగా లేవు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ-ఎం), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వంటి చిన్న మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఇటీవలి ఎన్నికలలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయిన కేరళలో, వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు చేసిన ఆరోపణలపై సీపీఐ-ఎం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
పీటీఐ నివేదిక ప్రకారం, సీనియర్ కాంగ్రెస్ నాయకుల అటువంటి వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. అధికారంలో ఉన్న ఇండి కూటమి ఉన్న జార్ఖండ్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం రెండు సీట్లలో ఒకదానికి తమ సీనియర్ మిత్రపక్షం "ఏకపక్షంగా" అభ్యర్థిని ప్రకటించడంపై కూడా జేఎంఎం అసంతృప్తిగా ఉంది. అయితే, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కాంగ్రెస్ పరిశీలకులు భూపేష్ బఘేల్, అజయ్ శర్మలతో అల్పాహారం సందర్భంగా సమావేశమైన తర్వాత, చెరొక సీటు నుంచి పోటీ చేయాలని ఆదివారం (జూన్ 7) ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ కూటమి నుంచి దూరంగా ఉంది.
ఇండి కూటమి తిరిగి ఏకం కావాల్సిన అవసరం ఉందా?
ఇలాంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య, ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంపొందించే ప్రయత్నంగా సోమవారం నాటి సమావేశాన్ని చూస్తున్నారు.
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఈ కూటమికి పెద్ద ఎన్నికల సవాళ్లు ఎదురుకానున్నాయి. గతంలో, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండి కూటమి నాయకత్వం లాంఛనంగా సంప్రదింపుల కోసం సమావేశమయ్యేది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు సభా సమన్వయం, కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన సమస్యలపై చర్చించేవి. కూటమి ఐక్యత ప్రమాదంలో ఉందా? రాబోయే వారాలు విషయాలు అన్ని స్పష్టంగా తెలుస్తాయి.
Next Story

