ఏపీలో జెన్ Z కలవరం
x

ఏపీలో జెన్ Z కలవరం

డిజిటల్ యువశక్తిగా ఎగిసిపడే అవకాశం. అధికార, ప్రతిపక్షాలకు పట్టుకున్న బొద్దింకల భయం.


దేశవ్యాప్తంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా జెన్ Z తరం యువత సృష్టించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అనే వ్యంగ్య డిజిటల్ నిరసన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోంది. సుప్రీం కోర్టు విచారణల నేపథ్యంలో నిరుద్యోగ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిచర్యగా ఎగిసిన ఈ యువత ఆగ్రహం, ప్రస్తుతం ఒక బలమైన సామాజిక శక్తీగా రూపాంతరం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పేదలు, నిరుద్యోగులు ఒకరోజు బొద్దింకల మాదిరిగా వీధుల్లోకి రావడం ఖాయమనే సంకేతాన్ని ఇస్తూ సాగుతున్న ఈ మూవ్‌మెంట్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ వంటి అగ్ర నేతలను సైతం తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. సాంప్రదాయ నిరసనలకు భిన్నంగా.. సోషల్ మీడియా ట్రెండ్స్, మీమ్స్ ద్వారా వేగంగా విస్తరిస్తున్న ఈ డిజిటల్ యువశక్తి, ఏపీలోని స్థిరపడిన ప్రాంతీయ పార్టీలలో మునుపెన్నడూ లేని కలవరాన్ని, రాజకీయ అప్రమత్తతను రేకెత్తిస్తోంది.



అధికార, విపక్షాల మైండ్ గేమ్
ఈ సరికొత్త పొలిటికల్ వేవ్‌ను అందుకోవడంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. యువతను మోసం చేస్తే ఏపీలోనూ బొద్దింకలు ఉద్భవిస్తాయని, అవసరమైతే తాను కూడా ఆ బొద్దింకలలో ఒకడిగా మారి పోరాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. మెగా డీఎస్సీ పేరుతో కుంభకోణాలు జరుగుతున్నాయని, నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని జగన్ నిలదీశారు. దీనికి కౌంటర్‌గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. జగన్ లాంటి ఫ్యాక్షనిస్టులను నేటి చైతన్యవంతమైన జెన్ Z యువత ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేశారు. ఇది జెన్ Z , జెన్ ఆల్ఫాల కాలమనే విషయాన్ని అంగీకరిస్తూనే.. యువత ఆలోచనల కంటే తమ ప్రభుత్వ దార్శనికత ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని, వారికి గ్లోబల్ స్కిల్స్ అందించి ఆర్థికంగా నిలబెడతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ విధంగా జాతీయ స్థాయిలో పుట్టిన ఈ నిరసన.. ఇప్పుడు ఏపీలో యువత ఓట్లను ఆకర్షించే సరికొత్త రాజకీయ యుద్ధానికి దారితీసింది.
Read More
Next Story