కూటమిలో ’క్రెడిట్‘ వివాదం..పవన్ కూటమి ధర్మం తప్పారా?
x

కూటమిలో ’క్రెడిట్‘ వివాదం..పవన్ కూటమి ధర్మం తప్పారా?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం?


కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంబరాల వేళ పవన్ కల్యాణ్ పదే పదే తన త్యాగాన్ని, జనసేన వల్లే కూటమికి విజయం దక్కిందనే భావనను ప్రస్తావించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమౌతోంది. కేవలం వైఎస్ జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన సీట్ల సర్దుబాటును త్యాగం అనే పెద్ద పదంతో అభివర్ణించడంపై విమర్శలు వస్తున్నప్పటికీ.. పవన్ ఈ మైండ్ గేమ్‌ను వాంటెడ్‌గానే నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తక్కువ సీట్లకు ఒప్పుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ, ప్రభుత్వంలో తమకు ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న జనసేన క్యాడర్‌లో ఈ వ్యాఖ్యలు ఒక కొత్త ఉత్సాహాన్ని, మనం తగ్గడం వల్లే ఈరోజు కూటమి అధికారంలో ఉంది అనే అప్పర్ హ్యాండ్ ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి. అదే సమయంలో, క్షేత్రస్థాయిలో తనకు బలం ఉన్నా రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గానని పదే పదే చెప్పడం ద్వారా.. తమను తక్కువ అంచనా వేయవద్దని సీఎం చంద్రబాబు నాయుడికి, టీడీపీ పెద్దలకు ఆయన పరోక్షంగా ఒక గట్టి పొలిటికల్ సిగ్నల్ ఇస్తున్నట్లు భావించవచ్చు.



అయితే, పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని రగిలిస్తున్నాయి. 2019 ఎన్నికల గణాంకాల ప్రకారం 49.95% ఓట్లు సాధించిన వైసీపీని ఒంటరిగా ఎదుర్కొని 39.17% ఓట్ల బలాన్ని నిలబెట్టుకున్న టీడీపీ, కేవలం 5.53% ఓట్లు ఉన్న జనసేనకు తమ క్యాడర్ శ్రమ, ఓట్ల బదిలీ వల్లే 100% స్ట్రైక్ రేట్ సాధ్యమైందని పవన్ కల్యాణ్ వివిధ వేదికలపై గట్టిగా పస్తావిస్తూ వస్తున్నారు. గెలిచిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ కానీ, బీజేపీ కానీ ఇలాంటి క్రెడిట్ క్లెయిమ్ చేసుకోనప్పుడు, కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే ఇలా మాట్లాడటం తమ పార్టీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన క్యాడర్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరింత ముదిరి, 2029 ఎన్నికల నాటికి కూటమిలో ఒక పెద్ద చీలిక రావడానికి లేదా టీడీపీని రక్షణలో పడేయడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దల స్క్రీన్ ప్లేకి అనుగుణంగా పవన్ కల్యాణ్ యాక్ట్ చేస్తున్నాడని, రానున్న రోజుల్లో ఇది మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Read More
Next Story