
పశ్చిమ బెంగాల్: బంగాళాదుంప రైతుల కష్టాలు.. ఎన్నికల అజెండాగా మారిందా?
ధరల పతనం, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో అప్పుల్లో మాల్దా రైతులు..
“రాజబన్షి వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆశతో బంగాళాదుంపలు సాగు చేశాడు. కానీ అకాల వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట పూర్తిగా నాశనమైంది. ఇప్పటికే అతనికి ఆర్థిక ఒత్తిడి ఉంది. పంట దెబ్బతినడంతో పెట్టిన ఖర్చును కూడా తిరిగి పొందలేకపోయాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. గ్రామీణ ఆదాయానికి కీలకమైన పంటగా ఉన్న బంగాళాదుంప, అసెంబ్లీ ఎన్నికల ముందు “హాట్ టాపిక్”గా మారింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలో బంగాళాదుంప రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ధరల పతనం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వంటి కారణాలతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అంశంగా మారింది.
క్షేత్రస్థాయిలో రైతుల మాటల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బస్తా బంగాళాదుంప పండించడానికి రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో అది రూ.100 నుంచి రూ.120కే అమ్ముడవుతోందని వారు చెబుతున్నారు. దీంతో ప్రతి బస్తాపై నష్టం తప్పదని, పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
సాగుకు రూ. 40వేల దాకా ఖర్చు..
విత్తనాలు, ఎరువులు, కూలీలు, నీటిపారుదల ఖర్చులు పెరగడంతో సాగు మరింత భారంగా మారిందని రైతులు అంటున్నారు. ఒక బీఘా (bigha) సాగు చేయడానికి రూ.35వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతోందని, కానీ పంట అమ్మకాల్లో ఆ మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నామని తెలిపారు.
అప్పుల భారంతో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వ్యక్తిగత రుణదాతల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకుని సాగు చేస్తున్నారని, పంట నష్టపోతే వాటిని చెల్లించడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు. కుటుంబ ఖర్చులు కూడా నిర్వహించడం కష్టమైందని పలువురు రైతులు తెలిపారు.
కోల్డ్ స్టోరేజీ సమస్య..
పంటను నిల్వ చేయడానికి సరైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. నిల్వ ఖర్చులు అధికంగా ఉండడంతో రైతులు పంట కోత తర్వాత వెంటనే తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తోంది. కొంతమంది రైతులు అమ్ముడుపోని పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు మార్కెట్ నియంత్రణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, కానీ ధరలు పడిపోయినప్పుడు తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాదుంపలకు కనీస మద్దతు ధర (MSP) అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తే తమకు కొంత ఉపశమనం లభిస్తుందని వారు అంటున్నారు.
సకాలంలో అందని బీమా..
పంట బీమా పథకాలు కూడా సరిగా పనిచేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బీమా క్లెయిమ్లు సకాలంలో అందడం లేదని, కొందరికి పథకం గురించి సరైన అవగాహన కూడా లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు, నష్టాలు, అనిశ్చితి కారణంగా నిరాశ పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
కిలో రూ.2.50 పైసలే..
“ఇక్కడ ప్రస్తుతం బంగాళాదుంపలకు అసలు ధర లేదు,” అని రాజబన్షి మేనల్లుడు తెలిపారు. “పంట కోత తర్వాత వ్యాపారులు ఒక్కో ప్యాకెట్కు రూ.130 నుంచి రూ.150 వరకు మాత్రమే ఇస్తున్నారు. అంటే కిలోకు సుమారు రూ.2.50 నుంచి రూ.3 మాత్రమే వస్తోంది. ఒక ప్యాకెట్లో 50 కిలోల బంగాళాదుంపలు ఉంటాయి. కానీ విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల ఖర్చులతో ఒక బీఘా సాగు చేయడానికి రూ.35వేల నుంచి రూ.40 వేలు వరకు ఖర్చవుతోంది,” అని ఆయన వివరించారు.
‘రైతుల ఆగ్రహం ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది..’
“రైతుల్లో కోపం, నిరాశ పెరిగిపోయాయి. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో కూడా తెలియదు,” అని బలరాంపూర్కు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త ఉదయ్ కుమార్ మండల్ తెలిపారు. “ఈ ఆగ్రహం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నవారిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.”
ఈ సంక్షోభం క్షేత్రస్థాయిలో ఉన్న లోతైన పరిపాలనా లోపాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. “రైతుల మాట వినడం లేదు. ఎరువుల ధరలపై కూడా ఎలాంటి నియంత్రణ లేదు. అవి ఎంఆర్పీ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి,” అని ఆయన పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే, మాల్దా జిల్లాలో బంగాళాదుంప రైతుల సమస్యలు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతుల అసంతృప్తి కీలక పాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

