నేపాల్‌లో బాలెన్ షా ప్రభుత్వానికి తొలి షాక్
x

నేపాల్‌లో బాలెన్ షా ప్రభుత్వానికి తొలి షాక్

ఆర్థిక, విద్యార్థి విధానాలపై ప్రజా ఆగ్రహం


Click the Play button to hear this message in audio format

నేపాల్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన బాలేంద్ర (బాలెన్) షా ప్రభుత్వానికి తొలి నెలలోనే కఠిన పరీక్ష ఎదురైంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కొద్ది వారాల్లోనే దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు చెలరేగడంతో ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నగర వీధుల నుంచి దేశ పరిపాలనా కేంద్రం సింఘా దర్బార్ వరకు ఆందోళనలు వ్యాపించాయి. విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు, సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

కస్టమ్స్ సుంకంపై ఆగ్రహం..

భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రూ.100కు పైబడిన వస్తువులపై తప్పనిసరి కస్టమ్స్ సుంకం విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ సరిహద్దు దాటి కొనుగోళ్లు సాధారణ జీవన విధానంలో భాగంగా ఉండటంతో, ఈ కొత్త విధానం వారి రోజువారీ ఖర్చులను పెంచుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనాపరంగా సరైన నిర్ణయంగా కనిపించినా, ప్రజల జీవితాలను ప్రభావితం చేయడంతో ఇది భావోద్వేగ అంశంగా మారింది.

విద్యార్థి సంఘాల రద్దు ప్రణాళికపై ఉద్రిక్తత..

పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక..పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. యూనిఫాం ధరించిన విద్యార్థులు వీధుల్లోకి రావడం ఈ సమస్య ఎంత విస్తృతమైందో సూచిస్తోంది. ప్రభుత్వం చర్చలకు బదులుగా కఠిన వైఖరి అవలంబిస్తోందని విద్యార్థి నాయకులు విమర్శిస్తున్నారు.

100 రోజుల ప్రణాళికలో భాగం..

షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన 100-సూత్రాల ప్రణాళికలో ఈ నిర్ణయాలు భాగంగా ఉన్నాయి. 60 రోజుల్లోగా విద్యార్థి రాజకీయ నిర్మాణాలను తొలగించి, వాటి స్థానంలో “విద్యార్థి మండలి” వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే, ఈ చర్య క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వ్యతిరేక స్వరాలు, మద్దతు అభిప్రాయాలు..

విద్యార్థి నాయకులు ఈ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే మేము వీధుల్లోకి వస్తాం,” అని ఒక విద్యార్థి సంఘ నాయకుడు హెచ్చరించాడు. నేపాల్ రాజకీయాల్లో విద్యార్థి ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, రాజ్యాంగ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంస్థలను మాత్రమే రద్దు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల్లోనే భిన్నాభిప్రాయాలు..

కొంతమంది విద్యార్థి నాయకులు కూడా సంఘాల పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో విద్యార్థి సంఘాలు తమ అసలు లక్ష్యాలకు దూరమయ్యాయని, అయితే వాటిని పూర్తిగా రద్దు చేయడం సరైన పరిష్కారం కాదని వారు అంటున్నారు.

పెరుగుతోన్న రాజకీయ ఒత్తిడి ..

ఇదే సమయంలో హోం మంత్రి సుడాన్ గురుంగ్‌పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎదురువుతోన్న సవాళ్లు..

కొన్ని విధాన నిర్ణయాలపై మొదలైన అసంతృప్తి ఇప్పుడు బహుముఖ సమస్యగా మారింది. ఆర్థిక విధానాలు, విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై ఒకేసారి ఒత్తిడి పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి నెల కూడా పూర్తికాకముందే బాలెన్ షా ప్రభుత్వం ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటుండగా, ఈ నిరసనలు మరింత ఉధృతం కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read More
Next Story