
బాంబు దాడులతో దద్దరిల్లు గల్ఫ్, ఇరాన్- అమెరికా యుద్ధం తీవ్రం!
600 దాటిన మరణాలు, బీరూట్ పైన దాడులు
యుద్ధం 4 వారాలకు పైగానే కొనసాగవచ్చు- ట్రంప్
ఇతర ముఖ్య అప్డేట్స్
Live Updates
- 3 March 2026 6:04 PM IST
ఇరాన్లో భారత విద్యార్థులపై తల్లిదండ్రుల ఆందోళన..
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న తమ పిల్లలను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీనగర్కు చెందిన 30 ఏళ్ల అల్తాఫ్ ఖాన్ తన సోదరి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతని సోదరి సోబియా తెహ్రాన్లో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెతో కొద్దిసేపు మాత్రమే మాట్లాడగలిగామని, క్యాంపస్ దగ్గర తరచూ సైరన్లు మోగుతున్న శబ్దాలు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అల్తాఫ్ చెప్పారు.
మరో తల్లి ఆఫ్రోజా కూడా తన కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె తెహ్రాన్లో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని, ఆహారం అవసరాలు కూడా తగ్గుతున్నాయని తన కుమార్తె తనతో చెప్పిందని ఆఫ్రోజా పేర్కొన్నారు. ఇతర దేశాలు తమ విద్యార్థులను ఇప్పటికే తరలించాయని ఆమె గుర్తు చేశారు.
ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ ప్రతినిధి మహమ్మద్ మొమిన్ ఖాన్ మాట్లాడుతూ.. తెహ్రాన్ నుంచి తరలించిన భారత విద్యార్థులు భద్రంగా ఖోమ్కు చేరుకున్నారని తెలిపారు. ఈ చర్య భారత రాయబార కార్యాలయం సమన్వయంతో చేపట్టినట్లు చెప్పారు.
- 3 March 2026 2:15 PM IST
క్షేమంగా భారత్ చేరుకున్న పీవీ విందు
దుబాయ్లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంగ్లాండ్లోని ఆల్ ఇండియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనడానికి ప్రయాణం చేస్తూ మధ్యలో దుబాయ్ చేరుకున్నారు. గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో ఆమె దుబాయ్లోనే ఉండిపోలాల్సి వచ్చింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుని తిరిగి భారత్కు సురక్షితంగా చేరుకున్నారు.
“నేను బెంగళూరులో నా ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. ఇంటికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టకాలంలో సాయం చేసిన దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ” అని ఎక్స్లో పోస్టు చేశారు రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు.
- 3 March 2026 1:21 PM IST
మహారాష్ట్రీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో చిక్కుకుపోయిన 164 మంది మహారాష్ట్రీయులను తిరిగి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు విమానాలు ఫుజైరా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు, 4.30 గంటలకు బయలుదేరి సాయంత్రానికి ముంబై చేరుకుంటాయని ఆయన తెలిపారు. 164 మందిలో పుణేలోని ఇంద్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్కు చెందిన 84 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే థానే, అహిల్యానగర్, పుణే ప్రాంతాలకు చెందిన ఇతరులు కూడా ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సాయం అందజేస్తామని పేర్కొన్నారు.
దుబాయ్లోని ఇండియన్ పీపుల్స్ ఫోరమ్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ +971 50 365 4357 ను ప్రారంభించింది. సాయం అవసరమైన వారు ఈ నంబర్ను సంప్రదించాలని సూచించింది.
- 3 March 2026 12:28 PM IST
దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీ హత్యకు నిరసనగా జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. బుధాల్ ప్రాంతంలో స్థానికులు షేఖ్-ఉల్-ఆలం మసీదు ముందు చేరి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యను వారు ఖండించారు. ఆ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ముస్లిం ప్రపంచంపై దాడిగా అభివర్ణించారు. పీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ ఫారూక్ ఇన్కలాబీ ఖామెనీ హత్య దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర దేశ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. రాజౌరి పట్టణంలో ముస్లిం యువకులు “ఇరాన్ ఐక్యత ర్యాలీ” నిర్వహించారు. బేలా రోడ్ వద్ద ర్యాలీగా కదిలారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ నాయకుల పోస్టర్లను దహనం చేశారు.

