
హోర్ముజ్ జలసంధి మళ్లీ దిగ్బంధం
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. శుక్రవారం జలసంధిని తిరిగి తెరిచినట్లు ప్రకటించిన టెహ్రాన్, కేవలం ఒకరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ఆంక్షలను అమలు చేసింది. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యల తర్వాత చోటుచేసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమం సహా కీలక అంశాలపై ఒప్పందం కుదిరే వరకు అమెరికా తన దిగ్బంధనాన్ని “పూర్తి స్థాయిలో కొనసాగిస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, “హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ మునుపటి స్థితికి తిరిగి వచ్చింది. ఇది పూర్తిగా సాయుధ దళాల కఠిన నియంత్రణలో ఉంది,” అని తెలిపింది. అలాగే, అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగించినంత కాలం, జలసంధి గుండా రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించింది.
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి గుండా సుమారు ఐదవ వంతు చమురు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేతతో ఇప్పటికే పరిమితంగా ఉన్న సరఫరా మరింత కుదించే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనానికి కారణం కూడా ఈ వివాదానికి కేంద్రంగా నిలిచింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణను అమలు చేయించేందుకు ఒత్తిడి తేవడమే లక్ష్యంగా అమెరికా ఈ చర్యలు చేపట్టింది.
ఇరాన్ ఉన్నతాధికారులు మాత్రం అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతించిన మార్గాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిగ్బంధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దళాలు 21 నౌకలను వెనక్కి పంపాయి.
ఇక లెబనాన్లోని పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, దాని అమలుపై అనిశ్చితి కొనసాగుతోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. “నా మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు లెబనాన్లో కాల్పుల విరమణకు అంగీకరించాం. కానీ హిజ్బుల్లాపై పోరాటం ఇంకా పూర్తికాలేదు,” అని స్పష్టం చేశారు. హిజ్బుల్లా క్షిపణి సామర్థ్యంలో 90 శాతం వరకు దెబ్బతీశామని కూడా ఆయన పేర్కొన్నారు.
అమెరికా కూడా లెబనాన్పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్ను ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆత్మరక్షణ చర్యలకు ఈ నిషేధం వర్తించదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే దక్షిణ లెబనాన్లో అడపాదడపా ఫిరంగి దాడులు జరిగినట్లు లెబనీస్ సైన్యం, ఐక్యరాజ్యసమితి శాంతి దళాలు నివేదించాయి.
మొత్తంగా హోర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేతతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

