‘‘బంగ్లాదేశ్‌కు డిసెంబర్‌లో తిరిగి వస్తా.. ఏం జరిగినా సిద్ధమే‘‘
x
షేక్ హసీనా

‘‘బంగ్లాదేశ్‌కు డిసెంబర్‌లో తిరిగి వస్తా.. ఏం జరిగినా సిద్ధమే‘‘

షేక్ హసీనా ప్రకటన


తన వ్యక్తిగత భద్రత కంటే ప్రజల పట్ల ఉన్న బాధ్యతే ముఖ్యమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఢాకాకు తిరిగి వస్తానని ప్రకటించారు. 2024లో దేశం విడిచి న్యూఢిల్లీకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తన మద్దతుదారులు, దేశ ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో తాను దూరంగా ఉండలేనని హసీనా అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజల మధ్యకే వస్తానని, తనకు ఎదురయ్యే పరిణామాలన్నింటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తనను హత్య చేయవచ్చని, జైలుకు పంపవచ్చని లేదా రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేయవచ్చని తెలిసినా ప్రజల పట్ల తన కర్తవ్యాన్ని భయం ప్రభావితం చేయదని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత కంటే ప్రజాసేవనే ఎప్పుడూ ముందుగా ఉంచానని చెప్పారు.

ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను హసీనా గుర్తు చేసుకున్నారు. 1971లో తల్లితో కలిసి జైలులో ఉన్నానని, తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ నిర్బంధంలోనే జన్మించాడని తెలిపారు. 1975లో కుటుంబ సభ్యులను కోల్పోయానని, అనంతరం ఆరేళ్లపాటు ప్రవాస జీవితం గడిపానని గుర్తుచేశారు. బంగ్లాదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే సంకల్పంతోనే తిరిగి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

2024లో ప్రభుత్వం పతనానికి దారితీసిన అశాంతి, నిరసనలపై కూడా హసీనా స్పందించారు. అవి కేవలం విద్యార్థుల శాంతియుత ఉద్యమాలు కావని, పాలన మార్పు లక్ష్యంగా పథకం ప్రకారం నడిపించిన ఆందోళనలని ఆరోపించారు. విద్యార్థులను ఒక కవచంగా ఉపయోగించారని కూడా ఆమె పేర్కొన్నారు.

పోలీసుల చర్యలపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ భవనాలు తగలబెట్టడం, దోపిడీలు జరిగినప్పుడు ప్రాణాలు, ప్రజా ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యతేనని హసీనా అన్నారు. 2024 జూలై 18న జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి మరణాన్ని నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

భారత్‌కు కృతజ్ఞతలు

భారత్‌ను బంగ్లాదేశ్‌కు "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించిన హసీనా, తనకు అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తిరుగు ప్రయాణం గురించి భారత్‌కు సమాచారం ఉందా అనే ప్రశ్నకు స్పందించిన ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఈ ప్రకటన ఇప్పటికే అంతర్జాతీయ వార్తగా మారిందని, సహజంగానే భారత ప్రభుత్వానికీ తెలిసి ఉంటుందని చెప్పారు.

భారత్‌లో హసీనాకు ఒక మాజీ దేశాధినేతకు తగిన గౌరవం, పూర్తి భద్రత కల్పిస్తున్నారని జాయ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమెను అత్యంత గౌరవంతో చూసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story