ఐటీ ‘సేఫ్ హార్బర్’ మార్జిన్‌ను 15.5%కి తగ్గింపు అర్థం ఏంటీ?
x

ఐటీ ‘సేఫ్ హార్బర్’ మార్జిన్‌ను 15.5%కి తగ్గింపు అర్థం ఏంటీ?

ప్రభుత్వ నిర్ణయం యాదృచ్ఛికం కాదంటున్న ఆర్ధిక నిపుణులు


2026లో ప్రభుత్వం ఐటీ సేవలపై ‘సేఫ్ హార్బర్’ లాభ మార్జిన్‌ను 15.5 శాతానికి తగ్గించింది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వాస్తవంగా జరిగిన సెటిల్‌మెంట్లు, వాణిజ్య వాస్తవాలతో సరిపోల్చి తీసుకున్న విధానపరమైన నిర్ణయంగా భావిస్తున్నారు. సేఫ్ హర్బర్ అంటే.. ఒక కంపెనీకి, పన్ను శాఖలకు జరిగే ఒక ఒప్పందం.

దీని ప్రకారం.. ‘‘మీరు మీ ఐటీ సేవలపై కనీసం 15.5 శాతం లాభాన్ని మీ విదేశీ మాతృసంస్థకు చూపిస్తే మేము మీ ధరలను ప్రశ్నించము. ముఖ్యంగా అదనపు పన్నులు వసూలు చేయం’’ అని పేర్కొంటారు.

వీటిలో రెండు సంస్థలు అంగీకరించకపోతే అవి సుదీర్ఘమైన కేసులకు దారితీయవచ్చు. ఈ సేఫ్ హర్బర్ కేవలం 300 కోట్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కంపెనీలకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త కంపెనీలు మాత్రం రూ. 2 వేల కోట్ల వరకూ చూపించుకోవచ్చు.

భారత ఐటీరంగం విలువ సుమారు 283 బిలియన్ డాలర్లుగా ఉంది. దాదాపు ఐదు మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తన నెట్ వర్క్ ను పెంపొందించుకుంది.
అయితే సంస్థలు తమకు తక్కువ లాభాలు వస్తున్నాయని పన్నులు ఎగ్గొడుతున్నాయని ట్యాక్స్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వీటిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
కంపెనీలు ట్రిబ్యూనల్ స్థాయిలో 69 శాతం కేసులను, హైకోర్టులలో 86 శాతం కేసులలో విజయం సాధించాయి. అయినప్పటికి వివాదాలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటికి పరిష్కారంగా ఆటోమోషన్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో సేఫ్ హర్బర్ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవి మొదట్లో 20-22 శాతం ఉండగా, ప్రస్తుతానికి 15.5 శాతానికి తగ్గింది.
దీనికి ఉదాహరణగా యూనిలీవర్ కేసు నిలుస్తుంది. యూనిలీవర్ ఇండియా తన యూకే మాతృసంస్థకు ప్రత్యేకమైన ఆర్‌అండ్‌డీ సేవలు అందించింది. సంవత్సరాల పాటు సాగిన న్యాయపోరాటాల అనంతరం, బైలేటరల్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (APA) ద్వారా ఇరు పక్షాలు 16.7 శాతం మార్జిన్‌పై అంగీకరించాయి. ఇప్పుడు నిర్ణయించిన 15.5 శాతం సేఫ్ హార్బర్ రేటు దాదాపు అదే స్థాయిలో ఉండటం గమనార్హం.

ప్రభుత్వ లాజిక్ స్పష్టం:

గతంలో ఉన్న 17–18 శాతం సేఫ్ హార్బర్ రేట్లు వాస్తవ వాణిజ్య లాభాల కంటే ఎక్కువగా ఉండటంతో కంపెనీలు వాటిని తిరస్కరించి, APAలు లేదా న్యాయపోరాటాల వైపు దృష్టి సారించాయి.
ఇప్పుడు మార్జిన్‌ను 15.5 శాతానికి తగ్గించడం ద్వారా చాలా APA సెటిల్‌మెంట్లకు దగ్గరగా తీసుకువచ్చి సేఫ్ హార్బర్‌ను ఆకర్షణీయంగా మార్చాలన్నదే లక్ష్యంగా కనబడుతోంది. ఫలితంగా వివాదాలు తగ్గి, పరిష్కారాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

వాస్తవ లాభ మార్జిన్లు

భారతదేశంలోని మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు 15.5 శాతం కంటే చాలా ఎక్కువ ఆపరేటింగ్ మార్జిన్లు నమోదు చేస్తున్నాయి. టీసీఎస్ 24.6 శాతం, ఇన్ఫోసిస్ 21.1 శాతం, విప్రో 17.1 శాతం. పరిశ్రమల సగటు 21–22 శాతం మధ్యలో ఉంది.
ఇక్కడే అసలు సమస్య ప్రారంభం అవుతోంది. 17–20 శాతం మధ్య లాభాలు పొందుతున్న కంపెనీలు అంటే సేఫ్ హార్బర్ 15.5 శాతం, పరిశ్రమ సగటు మధ్యస్థంగా ఉన్నవారు కొంత పన్ను ఆదాయం వదులుకున్నా సరే, స్థిరత్వం కోసం సేఫ్ హార్బర్‌ను అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరాల పాటు సాగే న్యాయపోరాటాల నుంచి తప్పించుకోవచ్చు.
ఉదాహరణకు, రూ.800 కోట్ల టర్నోవర్ ఉన్న మధ్యస్థాయి ఐటీ కంపెనీ 19 శాతం మార్జిన్‌తో (రూ.152 కోట్ల లాభం) సాధారణంగా పన్ను చెల్లించాలి. కానీ 15.5 శాతం సేఫ్ హార్బర్‌ను ఎంచుకుంటే, రూ.124 కోట్ల లాభంపైనే పన్ను చెల్లిస్తుంది. 22 శాతం పన్ను రేటుతో లెక్కిస్తే, ఏటా సుమారు రూ.6.2 కోట్ల ఆదా అయినట్లు తెలుసుకోవాలి.
ఇలాంటి నిర్ణయాన్ని 200–300 మధ్యస్థాయి కంపెనీలు తీసుకుంటే, ప్రభుత్వానికి ఏటా రూ.1,500–2,000 కోట్ల పన్ను ఆదాయం కోత పడుతుంది. అయితే 24–25 శాతం నిజమైన మార్జిన్లు ఉన్న పెద్ద కంపెనీలు 15.5 శాతం సేఫ్ హార్బర్‌ను ఆర్థికంగా అనుకూలంగా భావించవచ్చు. అవన్నీ APAల వైపు మళ్లుతాయి. అందువల్ల ఆదాయ నష్టం మొదట అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండొచ్చు.

ఇది ఉద్దేశపూర్వకమైన ట్రేడ్-ఆఫ్:

ప్రభుత్వం కొంత పన్ను ఆదాయాన్ని వదులుకుంటుంది, కానీ న్యాయపోరాటాల ప్రక్రియ అనే ‘భయంకర స్వప్నం’ నుంచి బయటపడుతుంది. 17–20 శాతం మార్జిన్లు ఉన్న కంపెనీలకు నిశ్చితత్వం, ప్రభుత్వానికి అంచనావేసే స్థిరత్వం ప్రస్తుత స్థితితో పోలిస్తే ఇరు పక్షాలకూ లాభమే.

ఆటోమేటెడ్ అనుమతుల్లో వాస్తవమెంత?

బడ్జెట్ “పన్ను అధికారుల పరిశీలన అవసరం లేకుండా” ఆటోమేటెడ్ అనుమతుల్ని హామీ ఇస్తోంది. కంపెనీలు ఆన్‌లైన్‌లో డిక్లరేషన్ సమర్పించి, తక్షణమే అనుమతి పొందవచ్చని చెబుతోంది. కానీ ఇవి కొంత తప్పుదారి పడతాయనే అవకాశం ఉంది. ఆటోమేటెడ్ అనుమతి ఉన్నప్పటికీ, తరువాత పన్ను అధికారులు ఆడిట్ చేయవచ్చు. కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని భావిస్తే సేఫ్ హార్బర్‌ను రద్దు చేసి కేసులు పెట్టవచ్చు.

APAలతో ఉన్న..

బడ్జెట్ 2026 APAల టైమ్‌లైన్‌ను కూడా రెండేళ్లకు కుదించింది. అయితే సేఫ్ హార్బర్ ఆటోమేటెడ్ స్థిరత్వం ఇస్తే, APAలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద కంపెనీలు 17–24 శాతం మార్జిన్లు సంపాదిస్తున్నాయి. వీరికి ఒకే రేటు ఉన్న 15.5 శాతం సేఫ్ హార్బర్ సరిపోదు. అందుకే వీరు తమ వ్యాపారానికి తగినట్లుగా కస్టమ్ APAలను ఎంచుకుంటారు.
2012 నుంచి ఇప్పటివరకు భారత్ 800కి పైగా APAలను కుదుర్చుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 174 ఒప్పందాలు కుదిరాయి. మధ్యస్థాయి కంపెనీలు మాత్రం పరిమిత వనరుల కారణంగా సేఫ్ హార్బర్ సరళమైన విధానాన్ని ఎంచుకుని, భవిష్యత్తులో అధికారులు ప్రశ్నించరని ఆశిస్తాయి. రూ.2,000 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న అతిపెద్ద కంపెనీలు సేఫ్ హార్బర్ పరిధిలోకి రాకుండా బలమైన డిఫెన్స్ వైపు వెళ్లాల్సిందే.

లోటు ఎక్కడుంది?

నిజమైన సంస్కరణలు భారత పన్ను వ్యవస్థలోని మూల సమస్య వ్యతిరేక ధోరణి గల పన్ను సంస్కృతిని పరిష్కరించాలి. స్వతంత్ర ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ట్రిబ్యునళ్లు, సాధారణ సేవల కోసం సరళమైన నియమాలు అవసరం. ప్రస్తుతం మార్జిన్‌ల సర్దుబాటు, థ్రెషోల్డ్ పెంపు వంటి చర్యలు ప్రకటించడానికి సులభం, కానీ దీర్ఘకాలంలో వ్యవస్థాత్మక సమస్యలను తాకవు.
సేఫ్ హార్బర్ విస్తరణ ఒక ప్రాయోగిక రాజీ మాత్రమే యాదృచ్ఛిక విధాన నిర్ణయం కాదు. వేగవంతమైన వివాద పరిష్కారాల కోసం ఏటా రూ.1,500–2,000 కోట్ల పన్ను ఆదాయం కోల్పోవడమే దీని ధర.
మూడు సంవత్సరాల తరువాత, మొదటి సేఫ్ హార్బర్ క్లెయిమ్‌లపై ఆడిట్లు ప్రారంభమైనప్పుడు, 15.5 శాతం నిజంగా వాణిజ్య వాస్తవాలకు సరిపోతుందా, లేక ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ వివాదాలకు కొత్త యుద్ధరంగమవుతుందా అన్నది తేలనుంది.
Read More
Next Story