
ఎరువుల వాడకంలో ప్రపంచ రికార్డు ఆంధ్రాదే?
ఎరువుల అధిక వినియోగం.. భూసారం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం అంతర్జాతీయ సగటును మించిపోయిందన్న అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ (CACP) నివేదికను ప్రస్తావిస్తూ వ్యవసాయ, పర్యావరణ నిపుణుడు డాక్టర్ డి. నరసింహారెడ్డి ఈ పరిస్థితి దీర్ఘకాలంలో భూసారం, పర్యావరణం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆయన వివరాల ప్రకారం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో హెక్టారుకు వినియోగిస్తున్న రసాయన ఎరువుల పరిమాణం చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల కంటే ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా వరి సాగులో దశాబ్దాలుగా పెరుగుతున్న ఎరువుల వినియోగం వల్ల నేల సహజ సారం క్రమంగా తగ్గిపోతోందని ఆయన తెలిపారు.
భూమిలోని సూక్ష్మజీవుల వ్యవస్థ దెబ్బతినడం, నేలలో ఉప్పుదనం పెరగడం, తాగునీటి కాలుష్యం, పర్యావరణ నష్టం వంటి సమస్యలు అధిక రసాయన ఎరువుల వినియోగంతో ముడిపడి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నైట్రోజన్ ఆధారిత ఎరువుల అధిక వినియోగం వల్ల తాగునీటిలో నైట్రేట్ స్థాయులు పెరిగి, కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు కొన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో దీనిపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు అధిక ఎరువులు వినియోగించడానికి అనేక కారణాలు ఉన్నాయని నరసింహారెడ్డి వివరించారు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యం, కౌలు రైతుల సంఖ్య పెరగడం, రసాయన ఎరువులపై ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. దీంతో రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సహజ వ్యవసాయం (APCNF) కార్యక్రమం వల్ల కొన్ని ప్రాంతాల్లో రసాయన ఎరువుల వినియోగం తగ్గినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వినియోగంలో గణనీయమైన మార్పు కనిపించడం లేదని చెప్పారు. సహజ వ్యవసాయాన్ని మరింత విస్తరించడంతో పాటు, రసాయన ఎరువుల సబ్సిడీలను దశలవారీగా సహజ ఎరువులు, సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలని సూచించారు.
అలాగే వరి వంటి అధిక ఎరువులు అవసరమయ్యే పంటలపై ఆధారపడకుండా, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం పెంచితే రైతులు సహజంగానే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ విధానాల్లో మార్పులు, శాస్త్రీయ అవగాహన, భూసార పరిరక్షణ, సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేల, సురక్షితమైన ఆహారం, స్థిరమైన వ్యవసాయం అందించగలమని డాక్టర్ డి. నరసింహారెడ్డి సూచించారు.
Next Story

